తాడేపల్లి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా? అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని మోదీ, అమిత్షాతో ఎందుకు చెప్పించలేదని నిలదీశారు. 15 రోజులుగా చంద్రబాబు అండ్ ముఠా ఈ యాక్ట్పై అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. 2019 జులైలో అసెంబ్లీలో టీడీపీ పయ్యావుల కేశవ్ మద్దతుగా మాట్లాడారన్నారు. ఈ బిల్లు వచ్చినప్పుడు అసెంబ్లీలో టీడీపీ సభ్యులు 13 మంది ఉన్నారన్నారు. ఈ బిల్లు సమయంలో కౌన్సిల్లో నారా లోకేష్ ఉన్నారన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిన తరవాత ప్రభుత్వమే ఆ ప్రాపర్టీకి గ్యారెంటీ అంటూ సజ్జల వెల్లడించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు కావాలంటే ముందు భూమి సర్వే పూర్తి కావాలన్నారు. మోడీ భుత్వంలోని నీతి ఆయోగ్ సిఫారసుతోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిందన్నారు. చంద్రబాబు దివాళా తీశారని.. అందుకే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చెత్త అని మోడీ, అమిత్ షాతో చెప్పించాలని ఆయన సవాల్ విసిరారు. అప్పుడు ఎందుకు ఆమోదం తెలిపారు.. ఇప్పుడు అడ్డగోలుగా ప్రచారానికి చంద్రబాబు ఎందుకు దిగారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే మద్దతు ఇచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తా అంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్లపై కూడా తప్పడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ వైజాగ్లో స్థలం కొన్నారు.. చంద్ర బాబు చెప్పే ప్రకారం అది ఆయన ఆస్తి కాదన్నారు. పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నెలలో ఆస్తి కొన్నారు.. మరి ఆ ఆస్తికి ఏం అయ్యిందంటూ ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్లో ఈ-స్టాంప్ కలెక్షన్ 2016-2017 నుంచి మొదలు అయ్యిందని.. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్ర బాబు నాయుడు అని ఆయన తెలిపారు. ఈ-స్టాంపింగ్ విధానం 24 రాష్ట్రాల్లో కొనసాగుతుందన్నారు. ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం లేని ఉగ్రవాదుల చర్యలా చంద్ర బాబు తీరు ఉందని విమర్శించారు. చంద్ర బాబు ఇచ్చిన ఆరు హామీల అమలు చేయలేనని ఆయనకు తెలుసని.. అందుకే ప్రజల్లో అపోహలు భయాందోళనలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. భూ సమగ్ర సర్వే పూర్తి అయి… గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు లోకి వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్పై ఈనాడులో వచ్చిన కంటెంట్ చూడండి. వీరు ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? వీళ్లు మనుషులా? రాక్షసులా? అర్థం కావడం లేదు. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు అని ప్రకటన ఇచ్చారు. వీరికి నిజంగా సిగ్గు శరం ఉందా? ఇదేనా పద్ధతి. ఈ చట్టం రద్దు చేసేది అయితే..ఈ బిల్లు పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు రద్దు చేసింది? .ఇంతటి అబద్ధాలు, విష ప్రచారం చేస్తున్న వీరిని ప్రజలు ఓటుతో శిక్షించాలి. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ముఠా పిశాచి ఆలోచనలు చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారు అనుకున్నది కిందికి వెళ్లాలని విష ప్రచారం చేస్తున్నారు. 2019 జులైలో ల్యాండ్ టైట్లింగ్ బిల్లు పెట్టే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేవశ్ ఎందుకు మద్దతు ప్రకటించారు. ఆ తరువాత చంద్రబాబుకు జ్ఞానోదయం అయితే 14 డిపార్ట్మెంట్లకు తిరిగిన ఈ చట్టానికి ఎందుకు అభ్యంతరం తెలుపలేదన్నారు. ఈ చట్టంకు ముందు ఇంకా సమగ్రమైన సర్వే పూర్తి కావాలి. దీన్ని నీతి అయోగ్ కూడా ప్రపోజ్ చేసింది. బీజేపీ రాష్ట్రాలు సపోర్టుచేశాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా కేంద్రానికి లేఖలు రాశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చెత్త అని కేంద్ర ప్రభుత్వంతో చెప్పిస్తే సరిపోతుంది కదా? వైయస్ జగన్పై అబండాలు వేసేందుకు ఇలా కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు దిగజారుడు తనానికి, దివాళకోరు రాజకీయానికి, ఎత్తిపోయావని చెప్పడానికి, శవం దింపుడుకళ్లెం ఆశలు అన్నట్లుగా చంద్రబాబు ఇలా కుట్రలు చేస్తున్నారు. నీచమైన, పైశాచికమైన పని కోట్లు ఖర్చు చేసి ఈ రోజు చేశారు. చంద్రబాబు తాను చేసింది చెప్పేందుకు ఎందుకు కోట్లు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఆయన చేసింది ఏమీ లేదు కాబట్టి..వైయస్ జగన్పై విష పూరితమైన, దుష్టపన్నాగంతో ఈ పని చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని మోదీ, అమిత్షాతో చంద్రబాబు ఎందుకు చెప్పించలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా?. ఇదంతా వైయస్ఆర్సీపీకి ప్రజలు ఓటు వేయొద్దని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఏపీలో ఏదో జరిగిపోతుంది, భూమి బద్ధలవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీలో మద్దతిచ్చిన టీడీపీ, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తోంది. వీటన్నింటికి చంద్రబాబు జవాబు ఇస్తాడని అనుకోవడం లేదు. ప్రజలు వీటిని గమనించాలని కోరుతున్నాను. అసలు చంద్రబాబు ఈ సొసైటీలో ఉండాల్సిన వ్యక్తి కాదు. టీడీపీకి ఈ సమాజంలో ఉండే అర్హత లేదు. ప్రజలు చంద్రబాబు మాట్లాడే మాటలు పట్టించుకోవద్దు. ఇష్యూడ్ బేస్డ్పై వైయస్ జగన్ ఏం చే శాడో చూడండి. 2014–2019 మధ్య చంద్రబాబు ఏం చెప్పాడో, ఏం చేశాడో గమనించాలి. మళ్లీ ఇప్పుడు కొత్త డ్రామాలతో వస్తున్నాడు. ఆయన చెప్పినవి ఏవీ చేయడని ప్రజలు గమనించాలి. వైయస్ జగన్ వస్తే ఈ పథకాలు కొనసాగుతాయి, జీవితాలు ఇంకా మెరుగవుతాయి. చంద్రబాబు వస్తే ఇవన్నీ ఆగిపోతాయి. ఇది గ్రహించి ప్రజలు తమ ఓటు వైయస్ఆర్సీపీకి వేసి తమ జీవితాలను కాపాడుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈసీ క్లారిఫికేషన్ చూస్తే దాని వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేతల ఫిర్యాదుతోనే డీబీటీ ఆగిపోయింది. 2019లో పోలింగ్కు వారం రోజుల ముందు పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు ఇచ్చాడు. ఆరోజు ఎవరు అడ్డుకోలేదు. ఈ రోజు ఎందుకు అడ్డుకుంటున్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ బటన్ నొక్కినా ఆ డబ్బులు రావడానికి కొంత సమయం పడుతుందన్నది అందరికి తెలుసు. పోలింగ్ డేట్ ముందు చంద్రబాబు పసుపు కుంకుమ చెక్కులు ఇచ్చి ప్రలోభపెట్టారు. ఫైనాన్షియల్ ఎండ్ కావడంతో ఈ రోజు వైయస్ జగన్ నొక్కిన బటన్లకు ఆలస్యమైంది. మేం ఈసీని 20 రోజుల క్రితం అనుమతి అడిగాం. అప్పట్లోనే పర్మిషన్ ఇచ్చి ఉంటే ఈపాటికి లబ్ధిదారులకు అందేవి. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నారు. ఫీజుల కోసం విద్యార్థులు, బ్యాంకులు లోన్ తీసుకున్న మహిళలు ఇబ్బందులు పడుతారు. ఇందుకు చంద్రబాబే కారణం. ఈ రోజు కూడా నవతరం పార్టీ తరఫున చంద్రబాబు పరోక్షంగా కోర్టులో అప్పీల్ చేయించారు. ఈసీ క్లారిఫికేషన్ ఇస్తే..కోర్డు డైరెక్షన్లో విండో ఓపెన్లో ఉంది కాబట్టి కొంత చేసే అవకాశం ఉంది. లేదంటే మే 13 తరువాత లబ్ధిదారులకు నగదును అందజేస్తాం. చంద్రబాబు ప్రజల నోటికాడిది లాగుతున్నాడు. మొన్న పింఛన్లు ఇంటి వద్ద అందకుండా అవ్వాతాతలను ఇబ్బంది పెట్టారు. ఇవాళ లబ్ధిదారులకు నగదు అందకుండా రక్షసుడిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.