తిరుపతి: వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలకొస్తే ఎందుకంత భయమని సీఎం చంద్రబాబును వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ప్రశ్నించారు. ఆలయాలకు ఎవరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతుంది హిందూ ధర్మం. అలాంటిది.. ఐదేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకోవాలని చూస్తారా?. వైయస్ జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. శుక్రవారం ఎంపీ గురుమూర్తితో కలిసి భూమన కరుణాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘మా పార్టీ నేతలందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వైయస్ జగన్ అంటే చంద్రబాబుకు ఎంత భయమో దీని బట్టి చూస్తే అర్థమవుతోంది. వైయస్ జగన్పై నీచాతినీచంగా రాజకీయ దాడికి దిగుతున్నారు. దేవుడిపై భక్తి లేని వారు జగన్ను కట్టడి చేయాలని చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. వైయస్ జగన్పై గతంలో లేని ఆంక్షలు ఇప్పుడెందుకు? అంటూ భూమన ప్రశ్నించారు. ‘‘చంద్రబాబూ.. ఇకనైనా మీ రాజకీయాలు ఆపండి. మీరు ఎంత నిర్బంధానికి గురిచేస్తే అంతగా పైకి లేస్తాం. మీ పాపపు పాలనపై ప్రజా పోరాటం చేస్తాం. వేదమూర్తి ప్రసాదం మీద వెయ్యి నాలుకలతో మాట్లాడకండి. చంద్రబాబు మీరు చాలా పాపం చేశారు. చంద్రబాబూ మీరొక మాట.. పవన్ మరో మాట మాట్లాడతారు. చంద్రబాబు శిష్యులు వైయస్ జగన్ను రానివ్వం అంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. బీజేపీ నేతలు డిక్లేరేషన్ కోసం భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు’’ అంటూ కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘వైయస్ జగన్ ఒక భక్తుడిగా శ్రీవారి దర్శనానికి వస్తున్న సమయంలో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందంటూ రాయలసీమ వ్యాప్తంగా హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. జగన్ను చూస్తే చంద్రబాబుకు భయం వేస్తుంది. ర్యాలీలు అంటే మీకు భయం, 10 వేల మందిని సమీకరిస్తున్నారంటూ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. మేము ఎక్కడ జన సమీకరణ చేయడం లేదు. మీరు చేసిన పనికి డిఫెన్స్లో పడిపోయారు. వైయస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూజలు చేయడానికి అర్హత లేదా?. వైయస్ జగన్ వెంట ఎవరు రాకూడదని చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. చంద్రబాబు నిరంకుశ విధానాలు వ్యతిరేకిస్తాం. ప్రజా గొంతుక వినిపిస్తాం. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మీరు ఎంతకైన తెగిస్తారు చంద్రబాబు. సనాతన హిందూ పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలు వైయస్ఆర్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఈవో శ్యామలరావును ఒకటే అడుగుతున్నాం.. ఇప్పటి వరకు వెళ్లిన నెయ్యి ట్యాంకర్లు వివరాలు చెప్పాలని భూమన డిమాండ్ చేశారు.