భూములపై స‌ర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ ఉద్దేశం

మ‌చిలీప‌ట్నం ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ఎన్నికలు వచ్చేసరికి బాబు దుష్ప్రచారాలు మొదలుపెట్టాడు

రూ.2లక్షల కోట్ల డ్రగ్స్‌ తీసుకొచ్చామని దుష్ప్రచారం

ఆ డ్రగ్స్‌ తీసుకొచ్చింది బాబు వదినమ్మ బంధువులేనని తేలింది

తమ వారేనని బయటకు రావడంతో బాబు కూటమి గప్‌చుప్‌

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు

ఎవరి భూములపై వారికే హక్కులు కల్పించడమే ఈ యాక్ట్‌ ఉద్దేశం

భూ వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

మచిలీపట్నంలో మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణం పూర్తి చేశాంబందర్‌లో రూ. 350 కోట్ల ఫిషింగ్‌ హార్బర్‌

మచిలీపట్నం అభివృద్ధికి బాటలు వేసింది మీ బిడ్డ జగనే.

రూ.5100 కోట్లతో పోర్టు నిర్మాణం జరుగుతుంది

మచిలీపట్నంలో మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణం పూర్తి చేశాం

బందర్‌లో రూ. 350 కోట్ల ఫిషింగ్‌ హార్బర్‌

గతంలో ఇంత మంచి ఎప్పుడైనా మీరు చూశారా?:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

 మ‌చిలీప‌ట్నం:  భూములపై స‌ర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ ఉద్దేశమ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరి భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ..ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ సంస్కరణ తీసుకురావాలనేది మీ బిడ్డ ఆలోచన అని చెప్పారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ప్ర‌తిప‌క్షాల‌పై ఆయ‌న‌ మండిపడ్డారు.  సర్వేలన్నీ పూర్తి చేసి రికార్డులన్నీ అప్‌డేట్‌ చేస్తున్నామని, రైతన్నలకు భూ హక్కు పత్రాలను పదిలంగా అందిస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ‌ బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ యాక్ట్‌ గొప్పదని టీడీపీ నేత పయ్యావులే అసెంబ్లీలో చెప్పాడని ప్రస్తావించారు. 

మంచి సంస్కరణను ఆపేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటికొచ్చే పెన్షన్‌ను అడ్డుకుంది చంద్రబాబేనని దుయ్యబట్టారు. బాబు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల వల్లే పెన్షర్లు అగచాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌ గోయింగ్‌ స్కీమ్స్‌ను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నాడని, లబ్దిదారులకు డబ్బులు వెళ్లకుండా  కుట్రలు పన్నుతున్నాడని నిప్పులు చెరిగారు.

సీఎం వైయ‌స్ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..  

మచిలీపట్నం సిద్ధమా?

చిక్కటి చిరునవ్వులతో ఇంతటి ప్రేమానారాగాలు, ఆప్యాయతలు, ప్రేమాభిమానాలు చూపిస్తున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకు, తాతకు, నా ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ... మీ అందరి ప్రేమాభిమానాలకు మీ జగన్... మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు,పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు.

 

*రానున్నది ఎన్నికల కురుక్షేత్రం.*

మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది. జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. అందరూ గుర్తుపెట్టుకొండి.. ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధికి అడుగులు ముందుకు పడతాయి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన మేనిఫెస్టోకు అర్థం. 

 

 

*బాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే.*

ఈ ఎన్నికల్లో ఎవరైనా మళ్లీ చంద్రబాబును నమ్మడం అంటే దానర్ధం... కొండచిలువ నోట్లో తల పెట్టడం. చంద్రబాబును మళ్లీ నమ్మడం అంటే...మళ్లీ చంద్రముఖిని  నిద్రలేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. 

 

*బాబు పేరు చెబితే ఒక్క స్కీమూ గుర్తురాదు.*

ఈ ఎన్నికల్లో పేదల శత్రువులంతా.. పేదలకు అండగా నిలబడిని మీ ఒక్క జగన్‌ మీద ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో, ఎంతగా దిగజారి యుద్ధం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. ఎన్ని అబద్ధాలు చెబుతున్నారో, అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారో చూస్తున్నారు. నేడు ఇన్ని దుష్ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అంటే...చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసాడు. కానీ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా బాబు చేసిన ఏ ఒక్క మంచి అయినా గుర్తొస్తుందా? ఒక్క స్కీమ్‌ అయినా గుర్తొస్తుందా? అందుకే ఇన్ని కుట్రలు..ఇన్ని అబద్ధాలు..అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి.

 

*విపక్షాల అబద్ధపు ప్రచారం.*

అబద్ధాలు ఏ స్థాయికి వెళ్లిపోయాయి అంటే..ఎన్నికలు వచ్చేసరికి మీరే చూస్తున్నారు....కొన్ని వారాల క్రితం అబద్ధాలు ఏ స్థాయికి తీసుకువెళ్లారంటే...ఏదో ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్‌లో విశాఖపట్నానికి ఏకంగా 2 లక్షల కోట్లు విలువైన డ్రగ్స్ తెచ్చారు అని...ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనే అని వీళ్లంతా కలిసి ప్రచారం చేసారు. ఇదే బాబు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, ఇదే దత్తపుత్రుడు..తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్‌ చేసింది ఎవరూ అంటే చంద్రబాబు వదినమ్మ బంధువులే..తమవారే అని ఎప్పుడైతే బయటకు వచ్చిందో..అప్పుడు అందరూ కూడా గప్‌చుప్‌...అది బయటకు వచ్చేదాకా రెండు లక్షల కోట్ల రూపాయిల డ్రగ్స్ అంట, తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ అంట. బురద చల్లేయడమే.

 

 

*కిరాణాదుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారని చంద్రబాబు దుష్ప్రచారం*

మరో ప్రచారాన్ని కూడా చూడండి..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారట. ఇది ఇంకో దుర్మార్గమైన ప్రచారం. చంద్రబాబు, దత్తపుత్రుడు ఎంత సంస్కార హీనంగా, పరమ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అన్నదానికి ఇదే నిదర్శనం. నేను అడుగుతున్న...రాష్ట్ర వ్యాప్తంగా కిరాణా షాపులు నడుపుకుంటున్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలను అడుగుతున్నాను...

చంద్రబాబు చెబుతున్నాడు...మీ కిరాణా షాపుల్లో మీరు గంజాయి అమ్ముతున్నారంట.. చంద్రబాబు నాయుడుకి ఓటు అనే అస్త్రంతో గట్టిగా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. వీళ్లంతా ఎంతగా దిగజారిపోయారంటే...ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే రాష్ట్రం పరువు ఏమవుతుంది అన్న కనీసపు ఇంగిత జ్ఞానం లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. 

 

 

*వివాదాలు లేకుండా భూములపై సంపూర్ణ హక్కులు కల్పనే - ల్యాండ్ టైటిలింగ్.*

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం

ఈమధ్యకాలంలోనే ఇంకో దుష్ప్రచారం..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద..ఇలా ప్రతి ఒక్కరికీ ఫోన్లు చేసి దుర్మార్గమైన ప్రచారం, అబద్ధాలతో చెబుతున్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ అనేది ఏమిటో మీలో ఎవడికైనా తెలుసా? అని ఈ దుష్ప్రచారం చేసేవాళ్లను అడుగుతున్నాను. 

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు, రైతులకు, భూ యజమానులకు ఎల్లవేళలే ఉండేట్టుగా ఒక చట్టం చేయడం, యాక్ట్ తీసుకు రావడం అని తెలియని ఈ మూర్ఖులకు తెలియజేస్తున్నాను. 

 

ఏ భూమిని ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏవేవో వివాదాలు కనిపిస్తుంటాయి. భూములు అమ్మాలనుకునేవారికి, కొనాలనుకునేవారికి కూడా తెలియని భయం ఉంది. కాగితం మీద ఉన్న భూమి కంటే ఎక్కువ తక్కువగా ఉండటం, సబ్‌ డివిజన్ జరక్కపోవడం, రికార్డులన్నీ అప్డేట్‌ కాకపోవడం, మ్యుటేషన్ జరగకపోవడం..ఇటువంటి భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి, కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతున్నారు. మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ వల్ల ఇటువంటి వివాదాలకు తావు వుండదు. ప్రతి ఒక్కరికీ కూడా వాళ్ల భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి, ఆ హక్కులకు గ్యారెంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్లకు తోడుగా ఉండేలా చేయడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అర్థం. ఇలా రైతులు, భూ యజమానులు కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ భూముల మీద భూ యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ,  ఆ భూముల మీద ఎలాంటి వివాదం లేదు అని చెబుతూ గ్యారెంటీ ఇచ్చే ఒక సంస్కరణే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇదొక్కటే కాదు రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్‌ కూడా చేసి ఆ భూ యజమానులకు కాంపన్సేషన్‌ ఇచ్చే విధంగా కూడా చేస్తున్నాం. ఇదీ చట్టంలో చేర్చడం జరిగింది. ఇలా ఒక సంస్కరణ తెచ్చి భూ యజమానులు, రైతులకు రక్షణ కల్పించే కార్యక్రమం జరగాలి అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 వేల రెవెన్యూ గ్రామాల్లో జరుగుతున్న సర్వే పూర్తి కావాలి. ప్రతి భూయజమానికి సంబంధించిన రికార్డులు అప్డేట్‌ కావాలి. ఇది చేయడం కోసం మీ బిడ్డ ఒక యజ్ఞంలా పనిచేస్తున్నాడు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక సర్వేయర్‌ను కూడా నియమించి 15,000 సర్వేయర్లను నియమించాం. రోవర్లను కొనుగోలు చేయడం జరిగింది. కోర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జీపీఎస్‌తో సరిహద్దురాళ్లు పెట్టించడం కూడా జరుగుతోంది. ఇందుకోసం రూ. 2వేల కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. మీ బిడ్డ ఈ ఖర్చును చిరునవ్వుతో భరాయిస్తున్నాడు. కేవలం నా రైతన్నలకు మేలు జరగాలి...భూ యజమానులకు మంచి జరగాలి...వారి చేతుల్లో ఉన్న టైటిల్స్‌ ఎవరికైనా స్వేచ్ఛగా అమ్ముకునేందుకు సర్వహక్కులూ ఉండాలి, ఎలాంటి వివాదాలు రాకూడదు, ఏ కోర్టు చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు అని..మీ బిడ్డ ఈ కార్యక్రమం చేస్తున్నాడు. 17 వేల రెవెన్యూ గ్రామాలు ఉంటే 6వేల రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికే సర్వేలు పూర్తి అయ్యాయి. ఇంకా ఒకటిన్నర రెండు సంవత్సరాల్లో మిగితా గ్రామాల్లో కూడా సర్వేలన్నీ పూర్తిచేసి, రికార్డులన్నీ అప్డేట్‌ చేయడం జరుగుతుంది. సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించి సరిహద్దురాళ్లను జీపీఎస్‌ కోఆర్డినేట్స్‌తో సహా పెట్టిస్తున్నాం. రికార్డులన్నీ అప్డేట్‌ కూడా మీ బిడ్డే చేయిస్తున్నాడు. అవసరమైన చోట సబ్‌ డివిజన్‌, మ్యుటేషన్ కూడా మీ బిడ్డే చేయిస్తున్నాడు. ఇవన్నీ కూడా భూ యజమానులకు, రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు వాళ్ళపై లేకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తూ మీ బిడ్డే చేయిస్తున్నాడు. 

 

రైతన్నలకు భూమికి సంబంధించిన మ్యాప్‌తో కూడిన భూ హక్కు పత్రాలను కూడా రైతన్నలకు పదిలంగా అందించే కార్యక్రమం చేస్తున్నాడు మీ జగన్. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే సమర్థించాల్సింది పోయి, ఎంతటి దుష్ప్రచారం చేస్తున్నారో గమనించాలని ప్రజలను కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి అయిన 6వేల గ్రామాలల్లో ఏ ఒక్క రైతు అయినా తన భూమి లాగేసుకున్నారు అని చెప్పారా అని ఈ చంద్రబాబు నాయుడును, ఈ ఈనాడును, ఆంధ్రజ్యోతిని, టీవీ5 ను అడుగుతున్నాను. మీ అంతట మీరే అబద్ధాలు చెప్పిస్తున్నారు, జరుగుతున్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. 

 

 

*ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ, ఈటీవీ ప్రశంసలు.*

నిజంగా వీళ్ల మాటల్లో ఎంత డొల్లతనం ఉంది అంటే మీ మాటల్లో చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. ఇదే ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ ఎంతో మంచిది అని చెప్పి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన పయ్యావుల కేశవ్‌ ఎంతగా పొగిడాడో అసెంబ్లీ రికార్డులను చూసుకోవాల్సిందని చెబుతున్నాను. చివరకు దుష్ప్రచారం చేస్తున్న ఇదే ఈటీవీ నాలుగు నెలల క్రితం వాళ్ల ప్రోగ్రాంలో మంచి యాక్ట్ ఇది, రైతన్నలకు మంచి జరుగుతుందని చెప్పి ప్రచారం చేసిన వీళ్లు, నేడు ఎన్నికలు రాగానే యూట్యూబ్‌ నుంచి వీళ్లు ప్రసారం చేసిన ఈ కథనాన్ని తొలగించి నేడు అడ్డగోలుగా అబద్ధాలు ఆడే కార్యక్రమం చేస్తున్నారు. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి.

 

 

*అవ్వాతాతల పెన్షన్‌ అడ్డుకున్నదీ చంద్రబాబే.*

అవ్వాతాతలకు మొన్నటిదాకా ఇంటికే వచ్చిన పెన్షన్‌ను అడ్డుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు మనిషి అయిన  నిమ్మగడ్డ రమేష్‌తో సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే ఎన్నికల కమీషన్‌కు లేఖ రాయించాడు. వాలంటీర్లు ఇంటికి రాకూడదు అని అవ్వాతాతలకు అప్పటి వరకూ ఇంటికే అందుతున్న పెన్షన్‌ ఇంటికి రాకుండా అడ్డుకున్నాడు. అడ్డుకోవడమే కాకుండా అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‌ను బ్యాంక్‌ అకౌంట్లలో వేయాల్సిందిగా ఎన్నికల కమీషన్‌కు విజ్ఞప్తి చేయిస్తాడు, ఆ ఎన్నికల కమీషన్‌తో  ఉత్తర్వులు కూడా ఇప్పిస్తాడు. మళ్లీ ఆ అవ్వా తాతలు చంద్రబాబు నాయుడును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే  ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తున్నాడు. ఈ చంద్రబాబు అయినా ఈనాడు అయినా ఆంధ్రజ్యోతి అయినా టీవీ5 అయినా, దత్త పుత్రుడు అయినా వీళ్లందరూ కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్ని అగచాట్లు పడుతున్నారో ఒక్కసారి గమనించండి. 

 

 

*ఆన్‌ గోయింగ్‌ పథకాలను కూడా ఆడ్డుకుంటూ చంద్రబాబు దుర్మార్గం.*

వీళ్ల కుట్రలు ఏ స్థాయికి వెళ్లాయంటే మనం బటన్లు నొక్కి ఆన్‌ గోయింగ్ స్కీమ్స్‌ను కూడా ఎన్నికల కమీషన్‌ మీద ఒత్తిడి తీసుకువచ్చి అక్కచెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బును కూడా దిక్కుమాలిన చంద్రబాబు ఆపుతున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? 

ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అని నమ్మకం సన్నగిల్లుతోంది. ఎందుకంటే ఆన్‌గోయింగ్‌ స్కీమ్‌లకు సంబంధించి బటన్లు నొక్కినా కూడా అక్కచెల్లెమ్మలకు డబ్బులు పోకుండా కావాలని ఆపుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులను మారుస్తున్నారు. ప్రజలకు అందాల్సిన మంచి జరక్కుండా చేస్తున్నారు. ఇన్ని కుట్రలు పన్నుతున్నారు..కేవలం బీదలకు, పేదలకు మంచి చేసే మీ జగన్‌ ఉండకూడదని ఇవన్నీ చేస్తున్నారు.

 

 

*మీ బిడ్డ పాలనలో జరిగిన మంచి ఏమిటంటే..*

దేవుడు దయతో, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ అందరి ఆశీస్సులతో ఈ 59 నెలల కాలంలోనే, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ఇచ్చిన పరిపాలన.. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ 130 సార్లు బటన్‌ నొక్కి, రూ.2.7౦ లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ఆ డబ్బులు వెళ్లాయి. 

 

గతంలో ఎప్పుడూ జరగని విధంగా 2.31 లక్షల  ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే. 

మేనిఫెస్టోలో ఇచ్చిన 99% వాగ్దానాలను అమలు చేసింది కూడా 59 నెలల మీ బిడ్డ పాలనలోనే.

 

ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా...ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎవరైనా చూసారా? ఎవరైనా చేసారా అన్నది మీరే ఆలోచించండి..

గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడునేడుతో బాగుపడ్డ గవర్నమెంట్‌స్కూళ్లు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాస్ రూముల్లో డిజిటల్ బోధన, 8వ తరగతి పిల్లాడికి వచ్చేసరికే ఆ పిల్లాడి చేతిలో ట్యాబ్‌లు, ఇంగ్లీష్ మీడియం అమలుతో మొదలుపెడితే... 3వ తరగతి నుంచే  టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్ట్స్‌ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగుతో అందుబాటులోకి తెచ్చాం.

బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద, పిల్లల చదువులకు తల్లులను  ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, పెద్ద చదువులకు ఏ తల్లీ తండ్రీ అప్పుల పాలు కాకూడదు అని పూర్తి ఫీజ్ రీయంబర్స్మెంట్ ఇస్తూ విద్యాదీవెన, వసతిదీవెన. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని ఆలోచించమని కోరుతున్నాను. 

 

 

*అక్కచెల్లెమ్మల సాధికారతపై చిత్తశుద్ధితో..*

నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేట్లుగా, మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఒక ఆసరా, ఓ సున్నావడ్డీ, ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీనేస్తం, ఏకంగా నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లు. నేను చెప్పిన ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

 

*గతంలో లేని విధంగా ఇంటివద్దకే పౌరసేవలు*

గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇంటికే రూ.3వేలు పెన్షన్‌ కానుక, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే రేషన్. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా?

 

*రైతన్నకు అండగా మీ బిడ్డ.*

గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలను చేయిపట్టుకు నడిపిస్తూ రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఓ రైతుభరోసా, రైతన్నలకు ఉచితంగా పంటలబీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్‌పుట్ సబ్సిడీ, పగటిపూటనే రైతన్నలకు 9 గంటల ఉచిత విద్యుత్, రైతనన్ను చేయి పట్టుకుని నడిపిస్తూ ఆ గ్రామంలోనే రైతన్నకోసమే ఓ ఆర్బీకే వ్యవస్థ. ఈ మార్పులన్నీ కూడా గతంలో ఎప్పుడైనా జరిగాయా?, ఎప్పుడైనా కనబడ్డాయా? అని అడుతున్నాను. 

 

 

*స్వయంఉపాధికి తోడు నిలుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం*

స్వయం ఉపాధికి ఏ ప్రభుత్వమూ ఎప్పుడూ తోడు నిలవనంతగా మీ బిడ్డ ప్రభుత్వం స్వయం ఉపాధికి అండగా నిలబడుతూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్ననేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ ఓ తోడు, ఓ చేదోడు,  లాయర్లకు కూడా లానేస్తం ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయా? చూసారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

 

వీటన్నింటికీ తోడు ఏగ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తూ ఓ గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది.  60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు అక్కడే కనిపిస్తాయి. అదే గ్రామంలోనే ఒక ఆర్బీకే. ఆ పక్కనే  ఆర్బీకే నుంచి నాలుగు అడుగులు వేస్తే ఓ విలేజ్‌ క్లినిక్‌, అక్కడి నుంచి మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు  నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి.  గ్రామానికే  ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్లోనే ఓ దిశ యాప్.. ఇటువంటివన్నీ గతంలో ఉన్నాయా? ఇంతకుముందు ఎప్పుడైనా చూశారా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  

 

*మన మచిలీపట్నం అభివృద్ధిని చూస్తే..*

మన మచిలీపట్నమే తీసుకుందామా...మన మచిలీపట్నంలో వాయువేగంగా రూ.5,100 కోట్ల రూపాయిలతో పోర్టు నిర్మాణం జరుగుతోంది. మీలో ఎవరైనా అలా సాయంత్రం వెళ్లి చూస్తున్నారు. ఇలా ఇన్ని వేల కోట్లతో పోర్టు కట్టిన పరిస్థితి గతంలో ఉందా?

ఇదే మచిలీపట్నంలో రూ.550 కోట్లను ఖర్చు చేస్తూ మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసింది మీ బిడ్డ పాలనలోనే. ఇలాంటి పాలన గతంలో ఉందా?

ఇదే బందరులో పక్కనే రూ.350 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్. ఈ ప్రాంతంలో ఇంటింటి అభివృద్ధికి మొత్తంగా ఈ ప్రాంతం అభివృద్ధికి బాటలు వేసింది ఎవరూ అంటే..అది మీ బిడ్డ..మీ జగన్‌ అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

ఈ ప్రాంతంలో భూముల సమస్యను పరిష్కరించింది ఎవరు?

ఎవరు ఉంటే ఈ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయి? అని అడుగుతున్నాను. 

అందరూ ఆలోచించండి. అన్నింటికీ కూడా సొల్యూషన్ మీ బిడ్డ...మీ జగన్. మీ అన్న..మీ తమ్ముడు..అని సగర్వంగా తెలియజేస్తున్నాను.

 

మీ బిడ్డ గెలిచి వచ్చి మీ భూముల హక్కులు మీకు అందిస్తాడు. 

 

నానీ ఇప్పుడే చెబుతున్నాడు. బందరు తీరప్రాంతంలోని 14 గ్రామాల్లోని, 30-40 ఏళ్లుగా పేదరైతులు ఆ భూములను అనుభవిస్తున్నారు, ఆ భూ హక్కు వారికి కల్పించే కార్యక్రమం...దీనికి సంబంధించిన ఫైల్‌ను చంద్రబాబు ఆపారు. వాటికి సంబంధించి రూ.7,200 కోట్లు రైతులకు అప్పజెప్పే కార్యక్రమానికి సంబంధించి మీ బిడ్డ శ్రీకారం చుట్టాడు. మళ్లీ మీ బిడ్డ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్లీ ఇదే బందరుకు వచ్చి అవే భూములు మీ అందరికీ మీ బిడ్డ పంచిపెడతాడా  అని తెలియజేస్తున్నాను. 

 

*బాబు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్కహామీ అయినా నెరవేరిందా?*

మరోవంక చంద్రబాబు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 3 సార్లు తాను సీఎంగా ఉన్నాను అంటాడు. నేను అడుగుతున్నాను. అంతకుముందు అడిగిన ప్రశ్నే మళ్లీ అడుగుతున్నాను. 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి కనీసం తన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా తాను చేసిన మంచి గుర్తుకురావడం లేదంటే.. ఏ పేదవాడికైనా తాను చేసిన ఒక స్కీమ్ గుర్తుకురావడం లేదంటే ఆయన, ఆయన మోసాలు, ఆయన పాలన ఒక్కసారి అందరూ గుర్తుకుతెచ్చుకోమని మీఅందరితో కూడా కోరుతున్నాను.

 

 

*చంద్రబాబు విఫల హామీలు.*

ఈ రోజు నేను చూపిస్తున్న ఈ ఫాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా? (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) గుర్తుందా అన్నా? గుర్తుందా అక్కా ఈ ఫాంప్లెట్?  2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫొటోలతో మీ ప్రతి ఇంటికీ ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంప్లె్ట్ పంపించాడు. 

 

ఆ తర్వాత 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఈ హామీలన్నీ నేను చదివి వినిపిస్తాను. ఇందులో ముఖ్యమైన హామీలంటూ ఈయన సంతకం పెట్టి మరీ చెప్పినవి...కనీసం ఏ ఒక్కటైనా జరిగిందా? నేను మిమ్మల్నే అడుగుతా మీరే సమాధానం చెప్పండని మిమ్మలే కోరుతున్నాను.

 

ఇందులో మొదటిది.. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్లు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతున్నాను.. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించి రూ.14,205 కోట్లు ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? 

ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25వేలు మాట దేవుడెరుగు.. కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకుల్లో వేశాడా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెలా రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు.  మరి ఐదేళ్లు అంటే 60 నెలలు నెలకు రూ.2వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  అర్హులందరికీ మూడు సెంట్ల స్ధలం. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఇన్ని వేలమంది ఇక్కడున్నారు చంద్రబాబు 3 సెంట్ల కథ దేవుడెరుగు మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు అయినా ఇచ్చాడా ? అని మీబిడ్డ అడుగుతున్నాడు.

 

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా?

సింగపూర్ కి మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీని నిర్మిస్తానన్నాడు, జరిగిందా? మచిలీపట్నంలో ఏమైనా కనిపిస్తుందా?. మరి నేను అడుగుతున్నాను. 

 

2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయానా సంతకం పెట్టి పంపించాడు. ఇదే ఫాంప్లెట్, ఇందులో చెప్పినవి ఆయన సంతకం పెట్టి స్వయంగా 2014లో మీ ఇంటికి పంపించి 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. 

 

 

*ఓటు ద్వారా మన మెసేజ్ ఢిల్లీ దాకా వినిపించాలి.*

పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా? అదీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. మరి నేను మిమ్మల్నందర్నీ కూడా అడుగుతున్నాను. మరి ఇలాంటి వాళ్లను నమ్మవచ్చా అని అడుగుతున్నాడు మీ బిడ్డ. నమ్మొచ్చా? అన్నా నమ్మొచ్చా? అక్కా నమ్మొచ్చా? తమ్ముడు నమ్మొచ్చా? పెద్దమ్మ నమ్మొచ్చా? మళ్లీ ఇదే ముగ్గురు, ఇదే మేనిఫెస్టో డ్రామా. ఇప్పుడు ఏమంటున్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా? సూపర్ సెవెన్ అంట నమ్ముతారా?. ఇంటింటికీ కేజీ బంగారమట నమ్ముతారా? ఇంటింటికీ బెంజి కార్ కొనిస్తారట నమ్ముతారా? మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇలాంటి వాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి వాళ్లను మన ఓటుతో రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అన్నది చాలా అవసరమూ ఇలాంటి వాళ్లకే మా ఓటు వేస్తామన్న మెసేజ్ ఇక్కడ నుంచి మనం ఓటు వేస్తే దేశంలో ఢిల్లీ దాకా ఆ మెసేజ్ వినిపించాలి . 175 కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 కి 25 ఎంపీ స్ధానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.

 

ఇక్కడో, ఎక్కడో, అక్కడో మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే అక్కడున్న అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్కా, పెద్దమ్మ, అవ్వా మన గుర్తు ఫ్యాన్, అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాను, అక్కా ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు, అక్కడ కళ్లజోడు పెట్టుకున్న పెద్దమ్మ, ఎర్రచీర కట్టుకున్న పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను.. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి. ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయడే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్, సింక్ లోనే ఉండాలి. 

 

ఈ విషయాలన్నీ మీకు చెబుతూ నా కుడిపక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కిట్టు(పేర్ని కృష్ణమూర్తి), ఎంపీ అభ్యర్ధిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌లు పోటీ చేస్తున్నారు. 

 

మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వీరిద్దరిపై సంపూర్ణంగా ఉంచాల్సిందిగా రెండు చేతులు జోడించి పేరుపేరునా మీబిడ్డ ప్రార్థిస్తున్నాడు అంటూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.

Back to Top