ప్ర‌జ‌ల గొంతు నొక్కుతున్నారు

మంగ‌ళ‌గిరి రోడ్‌షోలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

వైయ‌స్‌ జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. మళ్లీ ఇంటింటి అభివృద్ధి.

పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు

గత 59 నెలల  మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు

130 సార్లు బటన్‌ నొక్కితే నేరుగా నా అక్కచెల్లమ్మల ఖాతాల్లో జమ

మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ పాలనలోనే

నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ గతంలో ఎప్పుడైనా జరిగిందా?

పేదల భవిష్యత్తు మారాలి.. అందుకు మీ బిడ్డ అడుగులు

పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా పథకం లేదు

2014-19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మేనిఫెస్టోలో చెప్పినవి ఒక్కటైనా జరిగాయా? 

మళ్లీ ఇదే ముగ్గురూ..మళ్లీ.. కొత్త మేనిఫెస్టో డ్రామా ..న‌మ్ముతారా?

మంగ‌ళ‌గిరి సీటు బీసీల‌ది..ఈసారి ఆర్కే త్యాగంతో లావ‌ణ్య‌కు టికెట్టు ఇచ్చాం

ప్ర‌త్య‌ర్థి పార్టీలు బీసీ సీటునే క‌దా..డ‌బ్బుల‌తో గెల‌వొచ్చ‌ని సంచుల‌తో వ‌స్తున్నారు

వాళ్లు డ‌బ్బులిస్తే తీసుకొండి..ఓటు మాత్రం వైయ‌స్ఆర్‌సీపీకి వేయండి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

మంగ‌ళ‌గిరి:  ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందే ప్ర‌తిప‌క్షాలు కుట్ర‌లు, కుతంత్రాలు చేస్తూ పేద‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌కుండా గొంతు నొక్కుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఏదైనా ప్ర‌భుత్వానికి 60 నెల‌లు పాలించాల‌ని ప్ర‌జ‌లు ఎన్నుకుంటార‌ని, కానీ 57 నెల‌ల‌కే మీ బిడ్డ ప్ర‌భుత్వాన్ని గొంతు ప‌ట్టుకొని పిసికేయాల‌ని అనుకుంటున్నార‌ని, ఇక్క‌డ గొంతు ప‌ట్టుకుంటున్న‌ది నా అక్క‌చెల్లెమ్మ‌లు, నా అవ్వాతాత‌ల‌, విద్యార్థుల గొంతును నొక్కుతున్నార‌ని వీరు మ‌ర‌చిపోతున్నార‌న్నారు. మంగ‌ళ‌గిరి సీటు బీసీల‌ద‌ని, ఈ సీటు ఎమ్మెల్యే ఆర్కే త్యాగం చేయ‌మ‌ని చెబితే ఆయన సీటును తీసి నా చెల్లి లావ‌ణ్య‌కు ఇచ్చాన‌ని, వాళ్లు మాత్రం బీసీల సీటే క‌దా డ‌బ్బుల‌తో గెల‌వ‌చ్చు అని పెద్ద పెద్ద సంచుల‌తో బ‌య‌లుదేరార‌ని విమ‌ర్శించారు. సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో   ఓటేయమని అడుగుతున్నాం అని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం ఉదయం వైయ‌స్ఆర్‌సీపీ  నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన ప్రసంగించారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

మంగళగిరి సిద్ధమేనా?
 

దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా కాస్తా చల్లగా ఉంది. మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి స్నేహితుడికీ, ప్రతి సోదరుడికీ ముందుగా మీ బిడ్డ.. మీ జగన్ రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. 

 

 

*ముూడు రోజుల్లో మహాసంగ్రాం.*

కేవలం మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కావు. జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొ నసాగింపు. మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యంకాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్ధం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోమని సవినయంగా మనవి చేస్తున్నాను. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. 

 

 

*ఐదేళ్ల మీ బిడ్డ ప్రభుత్వంలో... 2.31లక్షల ఉద్యోగాలు, రూ.2.70 లక్షల కోట్ల డీబీటీ.*

మీ అందరూ ఇప్పడు నేను చెప్పబోయే కొన్ని మాటలపై ఆలోచన చేయండి. గత 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, నా అక్కచెల్లెమ్మల చేతికే మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా వెళ్లిపోవడం, ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. నేను అడుగుతున్నాను. గతంలో ఈ మాదిరిగా ఎప్పుడైనా జరిగిందా? మీ బిడ్డ రాకమునుపు ఈ మాదిరిగా బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల ఖాతాల కుటుంబాల్లోకి నేరుగా వెళ్లిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అన్నది ఆలోచన చేయండి.

గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. ఈ 59 నెలల పాలనలో ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు.

 

ఈ రోజు మన రాష్ట్రం వచ్చిన తర్వాత... దశాబ్దాలుగా మీ బిడ్డ పాలన వచ్చేవరకు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే ఈ 59 నెలల కాలంలోనే.. గత చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ ఉద్యోగాల్లో ఉన్న మన పిల్లలందరూ మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తున్నారు. మన చెల్లెమ్మలు, తమ్ముళ్లు చిక్కటి చిరునవ్వులతో మీ అందరికీ సేవలందిస్తున్నారు. 

 

 

*మేనిఫెస్టో అర్ధం మారుస్తూ...*

ఇంతకముందు మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు చెప్పేవారు. రంగు,రంగుల కాగితాలతో, రంగు,రంగుల ఆశలకు.. అబద్దాలకు రెక్కలు కట్టి చెప్పేవారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసేవారు. ఎన్నికలు అయిన తర్వాత వెదికినా

మేనిఫెస్టో కనిపించని పరిస్ధితి. అలాంటి సంప్రదాయాన్ని మారుస్తూ... మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా 99శాతం హామీలు మేనిఫెస్టోలో చెప్పినవి అమలు చేసి.. ఆ మేనిఫెస్టోను మీ ఇంటికే పంపించి.. ప్రతి అక్కనూ, చెల్లెమ్మనూ..వాళ్ల చిక్కటి చిరునవ్వు మధ్య అక్కా మీ జగన్ ఇవన్నీ చెప్పాడు.. ఇవి జరిగాయా? లేదా? మీరే టిక్ పెట్టండి అంటూ నేరుగా ఇళ్లకే పంపించి... వాళ్ల ఆశీస్సులు తీసుకుంటున్న సాంప్రదాయం, మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకి విశ్వసనీయత తీసుకొచ్చే కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందా ? అంటే మీ బిడ్డ 59 నెలల పాలనలో కాదా? నేను చెప్పే ప్రతి మాట మీరే ఆలోచన చేయండి.

 

 

*మచ్చుకు మన ప్రభుత్వంలో కొన్ని పథకాలు...*

ఇప్పుడు నేను గడ,గడా మచ్చుకు న్ని పథకాలు చెబుతాను. అవి గతంలో మీరు ఎప్పుడైనా చూశారా? 

 

గతంలో ఎవరైనా చేశారా ?అన్నది నేను మిమ్నల్నే ఆలోచన చేయమని కోరుతున్నాను.

నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంటు బడులు, గవర్నమెంటు బడులలో ఇంగ్లిషు మీడయం, 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్ లలో ఐఎఫ్‌బీలతో డిజిటల్ బోధన, 8వతరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు, ఇంగ్లిషు మీడియంతో మొదలుపెడితే 3వ తరగతి నుంచో ప్రభుత్వ బడులలో టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లతో పాటు ఏకంగా ఐబీ వరకు ప్రయాణం, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లిషు మరో పేజీ తెలుగులో అందుబాటులోకి తెచ్చాం. బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద ,పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి, పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకు, పిల్లలకుఅండగా ఉంటూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఈ రోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ చదువుతున్న పిల్లలు ఏకంగా 93 శాతంమంది పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనతో చదవి పెద్దవాళ్లు అవుతున్నారు.

 

మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలను ఆన్ లైన్ సర్టిఫైడ్ కోర్సులతో మన డిగ్రీలతో భాగస్వామ్యం చేయడం, డిగ్రీలలో ఇంటర్న్ షిప్ ను తప్పనిసరి చేయడం... ఈ 59 నెలల కాలంలో చదువులలో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడూ? జరిగాయా చెల్లెమ్మా? ఈ రోజు ఒకటో తరగతి ఇంగ్లిషు మీడియం చదువుతున్న పిల్లవాడు... పదోతరగతికి వచ్చేసరికి, 2035 వచ్చేసరికి ఐబీ సర్టిఫికేట్ తో పదోతరగతి పాస్ అవుతాడు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు

 డిగ్రీ పూర్తి చేస్తాడు.ఆ డిగ్రీ సర్టిఫికేట్‌లో కూడా ఏ హార్వర్డ్ నుంచో, ఎల్‌ఎస్సీ, స్టాన్‌పర్డ్ నుంచో, ఏంఐటీ నుంచో వాళ్లు సర్టిఫికేట్ ఇచ్చిన కోర్సులతో డిగ్రీ పట్టా తీసుకుంటాడు. 15 సంవత్సరాల తర్వాత పిల్లవాడు పదోతరగతి ఐబీ సర్టిఫికేట్‌తో, డిగ్రీలో హార్వర్డ్‌, ఎంఐటీ లాంటి యూనివర్సిటీలకు చెందిన కోర్సుల సర్టిఫికేట్‌తో ఆ పిల్లవాడు అనర్ఘళంగా ఇంగ్లిషు మాట్లాడుతూ.. ఉద్యోగం కోసం అఫ్లికేషన్ పెట్టుకుంటే పరిస్ధితి ఎలా ఉంటుందో మిమ్మల్ని ఆలోచన చేయమని కోరుతున్నాను.

పేదల భవిష్యత్ మారాలి, పేదల తలరాతలు మారాలి. అలా మారాలంటే మీ బిడ్డ వేస్తున్న అడుగులు ఎంత ముఖ్యమో.. ఈ అడుగులు వేయడం ఎంత అవసరమో ఆలోచన చేయండి. 

 

 

*అక్కచెల్లెమ్మలకు ఆసరాగా...*

గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో చూడని విధంగా నా అక్కచెల్లెమ్మలు వాళ్లు కాళ్ల మీద వాళ్లు నిలబడాలని,నా అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం వాళ్లకు రావాలి...అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అందులో కడుతున్నవి 22 లక్షల ఇళ్లు.. అక్కచెల్లెమ్మల బాగుకోసం ఇంతగా తపించిన ప్రభుత్వం, ఇన్నిన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? అక్కా జరిగిందా? చెల్లెమ్మా ఎప్పుడైనా జరిగిందా? పెద్దమ్మా జరిగిందా? 

 

అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేలు పెన్షన్, ఇంటివద్దకే పౌరసేవలు, ఇంటివద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు... ఇలా నేరుగా ఇంటికే పెన్షన్ రావడం, ఇంటి వద్దకే రేషన్, పథకాలు వంటివి గతంలో ఎప్పుడైనా జరిగిందా ? ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఆలోచన చేయండి. ఇవన్నీ 59 నెలల కాలంలో నా అవ్వాతాతల మొహంలో చిరునవ్వులు చూడాలని, నా అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవం నిలబడాలని మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతున్నాయి.  

 

గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడి కోసం సాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంట బీమా, సీజన్‌ ముగిసేలోగానే రైతన్నలకు  మొట్టమొదటిసారిగా అందుతున్న ఇన్ పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటలకు పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్, గ్రామస్ధాయిలోనే రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ , విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటూ.. గ్రామస్ధాయిలోనే ఆర్బీకే వ్యవస్ధ.. ఇటువంటి పాలన, రైతన్నను ఇలా చేయిపట్టుకుని నడిపించే అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా ? గతంలో ఎప్పుడైనా ఇన్నిన్ని పథకాలు ఉన్నాయా? పెట్టుబడి కోసం గవర్నమెంటు ఎప్పుడైనా సహాయం చేసిందా? రైతు భరోసా ఉండేదా? 

 

 

*స్వయం ఉపాధికి అండగా...*

స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ... గతంలో ఎప్పుడూ జరగని విధంగా... ఆటోలు, టాక్సీలు నడిపుకుంటున్న నా డ్రైవర్ అన్నదమ్ములకు తోడుగా వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులు మత్స్యకార భరోసా, పుట్ పాత్‌ల మీద వ్యాపారాలు చేసుకుంటున్నవారిని గతంలో ఎవరూ పట్టించుకున్న పరిస్థితిలు ఉండేవి కావు.. అలాంటి చిరువ్యాపాలుకు, శ్రమజీవులకు అండగా ఓ తోడు, ఓ చేదోడు, లాయర్లకు అండగా లా నేస్తం ఈ మాదిరిగా స్వయం ఉపాధికి అండగా నిల్చిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా ? ఈ పథకాలన్నీ గతంలో ఉండేటివా చెల్లీ? ఉండేటివా అక్కా? ఉండేవా తమ్ముడూ?, మీరే చెప్పండి.

 

 

*పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలవ్వకూడదని..*

గతంలో ఎప్పుడూ చూడని విధంగా వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని... ఆరోగ్యశ్రీని విస్తరించాం. రూ.25 లక్షల వరకు విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదని రెస్ట్ పీరియడ్‌లో కూడా ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే పేదవాడికి అండగా  విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ అన్నా, అక్కా మీ ఇంటిలో ఏం సమస్యలు ఉన్నాయి అని అడుగుతూ.. మందులిస్తూ.. ఇంటికే ఆరోగ్య సురక్ష.. ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా ? అని అడుగుతున్నాను. 

 

 

*గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ...*

వీటన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్లినా ఆ గ్రామంలో 600 రకాల సేవలందిస్తున్న గ్రామ సచివాలయం.

ఏ గ్రామానికి వెళ్లినా.. 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వాలంటీర్... అదే గ్రామంలో రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ ఆర్బీకే, దానికి పక్కనే ఓ విలేజ్ క్లినిక్, మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లిషు మీడియం బడి, అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, నా అక్కచెల్లెమ్మలకు భద్రతగా, తోడుగా గ్రామంలోనే మహిళా పోలీసును పెట్టాం.  నా అక్కచెల్లెమ్మలకు తోడుగా వాళ్ల ఫోన్ లలోనే దిశా యాప్.. ఏ అక్కచెల్లెమ్మ అయినా బయటకు వెళ్లినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు దిశ యాప్‌లో బటన్ నొక్కగానే.... పదినిమిషాల్లో పోలీసు సోదరుడు వచ్చి చెల్లెమ్మా ఏం అయింది అని అడుగుతున్న పరిస్థితి. నేను అడుగుతున్నాను. నేను చెపుతున్న ఈ పథకాలు, ఈ మార్పులు, నేను  చెబుతున్న లంచాలు, వివక్ష లేని పాలన ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అక్కా జరిగాయా? చెల్లెమ్మా జరిగాయా? కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ మీకు పాలన అందించాడు. 

 

 

మరోవంక చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాటు 3 సార్లు సీఎంగా చేశానంటాడు.

కానీ నేను అడుగుతున్నాను. చంద్రబాబు పేరు చెబితే ఏ పైదవాడికైనా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా?.

14 ఏళ్లు సీఎం అంటాడు. 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీం ఏ పేదవాడికైనా గుర్తుకు వస్తుందా ?. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఏ రోజూ, ఏ పేదకూ గుర్తుకువచ్చే ఒక్క పథకమూ పెట్టలేదంటే... ఆయన పాలన ఎలా ఉండేదో గమనించమని అడుగుతున్నాను.

 

 

*బాబు పాలన అబద్దాలు, మోసాలు.*

అధికారంలోకి వచ్చే దాక చంద్రబాబు పాలన అబద్దాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు , మోసాలు ఒక్కసారి ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ 2014లో ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్ గుర్తుకు తెచ్చుకొమ్మని కోరుతున్నాను. 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకం పెట్టి, ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వారి ఫోటోలు పెట్టి.. ఈ పాంప్లెట్‌లో ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికీ పంపించాడు.ఈ పాంప్లెట్‌లో హామీలను ప్రజలను నమ్మి చంద్రబాబునాయుడుకి  అధికారం ఇచ్చారు.  ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచి.. 2014 నుంచి 2109 వరకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో.. ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించి, పాంప్లెట్ లో చెప్పినవి... కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశాడా ? నేను చదువుతాను. మీరే చెప్పండి. ఇందులో ఒక్కటైనా అమలు చేశాడా ?.

 

 

*చంద్రబాబు విఫలహామీలు.*

రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? రెండోది పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు. అక్కా, చెల్లెమ్మా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు. డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలను,వారి కుటుంబ సభ్యులను  నేనుఅడుగుతున్నాను.. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాపీ చేశాడా? 

 

మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు.  నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు. ఏ ఒక్కరి అకౌంట‌లో అయినా ఒక్క రూపాయి డిపాజిట్ చేశాడా? అని అడుగుతున్నాను.

 

నాలుగో హామీ. ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, అంటే రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? ఇన్నివేల మంది ఇక్కడ ఉన్నారు. మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? 

 

ఐదో హామీ..అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు ఇస్తామన్నారు. 

 మూడు సెంట్లు స్థలం కథ దేవుడెరుగు, చంద్రబాబు హయాంలో ఇక్కడున్న ఇన్ని వేలమందిలో ఏ ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

 

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలుమాపీ అన్నాడు. జరిగిందా?. 

ఉమెన్ ప్రొటెక్షన్ పూర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నారు, చేశారా?.

ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, జరిగిందా ? మంగళిగిరిలో కనిపిస్తోందా? 

చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలప్పుడు మీ ఇంటికి 2014లో పంపించి.. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత.. ఇందులో ఆయన చెప్పినవి ఒక్కటంటే ఒక్కటి జరిగిందా? అని అడుగుతున్నాను. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. 

 

ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? అన్నా నమ్మొచ్చా? చెల్లి నమ్మొచ్చా? 

 

 

*మళ్లీ కలిసిన మోసాల కూటమి.*

ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు, మళ్లీ కూటమిగా ఏర్పడ్డారు. మళ్లీ మేనిఫెస్టో డ్రామా అంటున్నారు. నమ్ముతారా? సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా? తమ్ముడూ నమ్ముతారా? చెల్లెమ్మా నమ్ముతారా ?

సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంట.. అక్కా, పెద్దమ్మా నమ్ముతారా? ఇంటింటికీ బెంజికార్ అంట నమ్ముతారా? తమ్ముడూ నమ్ముతారా? పట్టపగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారు. మామూలుగా ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు కింద ఛీటర్ అని కేసు పెడతాం, దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం, మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మేనిఫెస్టో అంటూ అందమైన ఆశలతో ఆడుకుని, ఆ తర్వాత మన జీవితాలను మోసం చేస్తున్న ఇలాంటి వాళ్ల మీద ఎలాంటి కేసులు పెట్టాలి? అని అడుగుతున్నాను. 

 

 

*స్కీములు అడ్డుకున్న దుర్మార్గులు.*

వీళ్ల దుర్మార్గాలు, కుట్రలు ఏ స్దాయిలో ఉన్నాయంటే... జగన్‌కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తుందని, జగన్‌ను అక్కచెల్లెమ్మలు ఎక్కడ తమ అన్నగా భావిస్తారో అని, జగన్‌ ను ఎక్కడ అవ్వాతాతలు తమ బిడ్డగా భావిస్తారోనని, రైతన్నలుఎక్కడ తమ అన్నగా, తమ్ముడుగా భావిస్తారోనని.. ఈర్ష్య పడి.. వీళ్లు చేస్తున్న కుట్రలు ఎలా ఉన్నాయంటే...అవ్వాతాతలకు మొన్నటి వరకు ఇంటికే వచ్చే పెన్షన్‌ను కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు.

 

వీళ్ల కుట్రలు ఏ స్ధాయిలో ఉన్నాయంటే... మీ బిడ్డ బటన్లు నొక్కి రెండు నెలలైంది. ఎన్నికల కోడ్ అని తీసుకువచ్చిన తర్వాత... మీ బిడ్డ నొక్కిన బటన్లకు ఎక్కడ నా అక్కచెల్లెమ్మలకు డబ్బులు వెళ్లిపోతాయో, ఎక్కడ జగన్‌ను వాళ్లంతా మంచి వాడు అని అనుకుంటారేమోనని, దానిని కూడా అడ్డుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. 

 

నా అక్కచెల్లెమ్మలకు ఎట్టిపరిస్ధితుల్లోనూ అవి అందాలని... ముఖ్యమంత్రి స్ధానంలో మీ బిడ్డ కోర్టుకు వెళ్తున్నాడంటే.. ఏ స్ధాయిలో ఈ వ్యవస్ధ దిగజారిపోయిందో ఆలోచన చేయండి.

 

 

*మీ బిడ్డ ఎన్నికల కోసం చేయలేదు.*

మీ బిడ్డ చేసిందేదీ ఇవాళ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏదీ ఎన్నికలకు రెండు నెలల ముందు, మూడు నెలల ముందు చేసిన దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా మొట్టమొదటి రోజు నుంచి ప్రతినెలా మీ బిడ్డ కేలండర్ ఇస్తూ..ఇదిగో ఈ కేలండర్ ప్రకారం ఈ నెలలో రైతుభరోసా, ఈ నెలలో అమ్మఒడి, ఈ నెలలో చేయూత, ఈ నెలలో ఈ పథకం ఇస్తాను అని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ అందరికీ మంచి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నికలకు మూడు నెలల ముందు వచ్చేసరికి కుట్రలు, కుతంత్రాలు.

 

 

మామూలుగా ఒక ప్రభుత్వాన్ని 5 ఏళ్ల కోసం ఎన్నుకుంటారు. కానీ 57 నెలలకే వీళ్లందరూ మీ బిడ్డ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకుని పిసికేయాలని ఆలోచన చేస్తున్నారు. వీళ్లు గొంతు పట్టుకుని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు... నా అక్కచెల్లెమ్మల గొంతులను, నా అవ్వాతాతల గొంతులను, నా రైతన్నల గొంతులను, నా పేద విద్యార్ధుల గొంతులనే..  అని ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నాను.

 

 

*పేదల తలరాతలు మారాలంటే- ఫ్యాను గుర్తుకే ఓటు.*

వాలంటీర్లు మరలా ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా... బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్లీ నా అక్కచెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా.. పేదల భవిష్యత్‌, పేదల తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన వైద్యం మెరుగుపడాలన్నా... ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కి 175కి 175 ఎమ్మెల్యే స్ధానాలు, 25కి 25 ఎంపీ స్ధానాలు ఒక్కటి కూడా తగ్గేందుకే వీలు లేదు. సిద్ధమా? 

 

మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే.. అన్నా మన గుర్తు ఫ్యాను. అక్కా మన గుర్తు ఫ్యాను. చెల్లి మన గుర్తు ఫ్యాను. ఎర్ర చీర కట్టుకున్న అవ్వా మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి. 

 

ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ.. నా చెల్లి లావణ్యమ్మను పరిచయం చేస్తున్నాను. లావణ్యమ్మ మీలో ఒకరు. మంగళగిరి సీటు బీసీలది. వెనుకబడిన వర్గాలది. అలాంటి సీటు గతంలో నేను ఆర్కేకు ఇచ్చాను. ఆర్కేతో నేను ఈ సారి మనం సీటు త్యాగం చేయాలి, ఇక్కడ నుంచి మనం బీసీలను తీసుకుని రావాలని.. ఆర్కేకు ఉన్న సీటు బీసీలకు ఇస్తే.. అక్కడ వాళ్లేం చేస్తున్నారు. బీసీల సీటు కదా.. గెలవడం సులభం అని.. ఏకంగా పెద్దపెద్దవాళ్లు అంతా వచ్చి డబ్బులు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. 

 

*మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను.*       

    మీ బిడ్డ మాదిరిగా చంద్రబాబు బటన్లు నొక్కలేదు. మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు తక్కువ ఉండవచ్చు. కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి... ఆయన పాలన అంతా దోచుకోవడం, దోచుకున్నది అంతా పంచుకోవడం కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆయన మీకు డబ్బులు ఇవ్వొచ్చు. రూ.2వేలో, రూ.3 వేలో, రూ.4వేలో, రూ.5 వేలో ఇస్తాడు. ఆయన డబ్బు ఇస్తే వద్దు అనొద్దు. తీసుకొండి. ఎందుకంటే ఆ డబ్బు అంతా మన దగ్గర నుంచే దోచేసిన సొమ్మే. 

 

కానీ ఓటేసినప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకొండి. ఎవరి వల్ల మంచి జరిగింది. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుందని గుర్తుపెట్టుకుని ఓటు వేయమని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.

 

ఎంపీ అభ్యర్ధిగా రోశయ్యపైన కూడా మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలిసిందిగా సవియనంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు, పేరునా ప్రార్ధిస్తున్నాడు అని చెబుతూ సీఎం శ్రీ వైయస్‌.జగన్ తన ప్రసంగం ముగించారు.

Back to Top