చంద్ర‌బాబే నాపై దాడి చేయించాడు

బీసీ నేత, వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్యపై దాడి

ఇది నాపై జ‌రిగిన దాడి కాదు.. యావత్‌ బీసీలందరిపై జరిగిన దాడి

ఏర్పేడు బహిరంగ సభలో మాట్లాడుతుండగా రాయి విసిరిన గుర్తు తెలియని దుండగుడు

తిరుపతి జిల్లా: వైయ‌స్ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యపై గుర్తుతెలియని వ్యక్తులు రాయితో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన వీపు భాగంలో తీవ్రగాయమైంది. తిరుపతి జిల్లా శ్రీకాళ­హస్తి నియోజకవర్గం ఏర్పేడులో గురువారం వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌­రెడ్డికి మద్దతుగా కృష్ణయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగుడు ఆయనపై రాయితో దాడి చేశాడు. రాయి వేగంగా దూసుకొచ్చి ఆయన వీపునకు బలంగా తగిలింది. వెంటనే వాహనంపై ఉన్న మిగిలిన వారు తేరుకుని వీపుపైన అయిన‌ గాయాన్ని గుర్తించారు. తలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని అయితే రాయి వీపునకు తగిలిందని చెబుతున్నారు. 

వైయ‌స్ఆర్ సీపీ లభిస్తున్న ప్రజాస్పందనను తట్టుకోలేకే టీడీపీ నేతలే దాడికి పురికొల్పారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనపై దాడి జరిగినా కృష్ణయ్య తన ప్రసంగాన్ని కొనసాగించారు. అక్కడ నుంచి ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ శ్రీరామ శ్రీనివాసులుకు ఫిర్యాదు అందజేశారు. తర్వాత శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది కృష్ణయ్య గాయానికి బ్యాండేజ్‌ వేసి కట్టు కట్టారు. నీరసంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు సెలైన్‌ ఎక్కించారు.

చంద్రబాబే దాడి చేయించారు.. 
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని కృష్ణయ్య ధ్వజమెత్తారు. బీసీలెవరూ టీడీపీకి ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. దీంతో తనను చంపాలని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థికి చెప్పి దాడి చేయించారని ఆరోపించారు. ఇది కేవలం తనపై దాడి కాదని.. యావత్‌ బీసీలందరిపై జరిగిన దాడని ధ్వజమెత్తారు. తనను రాయితో కొట్టారని.. బీసీలు, బడుగులు, పేదలు ఓటు అనే ఆయుధంతో టీడీపీని ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేయడం ఖాయమని తెలిపారు. బీసీల బాగోగుల గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బీసీల అభ్యున్నతికి అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆయన వైపే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, అగ్రకులాల్లోని పేదలంతా ఉన్నారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఖచ్చితంగా వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పారు.
 

Back to Top