తాడేపల్లి: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రజలకు తెలుసని, ఎన్నికలు వచ్చేసరికి హడావిడిగా హామీలు ఇవ్వడం.. అమలు చేయకపోవడం బాబుకు అలవాటేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే జీవితాలతో చెలగాటమాడతాడని, మళ్లీ జన్మభూమి కమిటీలు, పాత వ్యవస్థతో చీకటి రోజులు తెచ్చుకోవడమేనని ప్రజలను అప్రమత్తం చేశారు. చంద్రబాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలేనని.. చేయగలిగినవి మాత్రమే సీఎం వైయస్ జగన్ మేనిఫెస్టోలో పెట్టారని వివరించారు. అర్హత ఉన్నవాళ్లందరికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందించారు.. చంద్రబాబు మాత్రం కండీషన్స్ అప్లై అంటూ పథకాల్లో కోత పెట్టాడు. చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ అనేవి అమలు చేయడన్నారు. చంద్రబాబు సాధ్యం కాని మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదని, అసలు బీజేపీ గుర్తును కూడా ఆ మేనిఫెస్టో మీద వాడుకోవడానికి అనుమతించలేదన్నారు. కోవిడ్లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలు కొనసాగించారని, రైతులు, పేదల ఎదుగుదలకు సీఎం కట్టుబడి ఉన్నారని, పేదల కోసం సీఎం వైయస్ జగన్ ఏమాత్రం వెనుకాడరని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాం. పేదల కోసం సీఎం వైయస్ జగన్ ఏమాత్రం వెనుకాడరు. వెసులుబాటు ఉంటే సీఎం వైయస్ జగన్ మరిన్ని పథకాలు అమలు చేస్తారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకొని మరింత ఆదాయం పెరిగితే మరిన్ని పథకాలు అమలు చేస్తాం. కోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాం. అభివృద్ధి ఎక్కడా ఆపలేరు.. కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చాం. సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు గతంలో దుష్ప్రచారం చేశారు. ఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు. 2014–19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏం చేశాడు. గతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారు. నిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ అర్హత ఏంటో చెప్పలేదు. అంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?’’ 1999లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారు. కానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారు. అది కూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదు. వృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా సీఎం వైయస్ జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారు. టీడీపీ ఏజెంట్ నిమ్మగడ్డతో కలిసి ఇంటింటికీ పెన్షన్లు అందకుండా అడ్డుకున్నాడు. చివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారు. బ్యాంకుల దగ్గర పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోంది. ఇప్పుడు మళ్లీ రూ.4 వేల పెన్షన్ అంటూ అబద్ధపు హామీ ఇస్తున్నాడు. బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలే. ‘‘చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోంది. వృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదే. వాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు. 2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉంది. అందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారు. కూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫొటోలు ఎందుకు లేవు. అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?. సిక్కిం, అరుణాచల్ప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోడీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి? ‘‘చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయింది. అందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. ఆ యాక్టును బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోంది. ఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదే. తప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడు. చంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రం. ల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలి. బీజేపీ రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?. చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోడీ అమ్ముకుంటున్నారా?. దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.