పులివెందుల: వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వైయస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాల రూపురేఖలు మారాయి. ఈ ప్రాంత ప్రజలకు ఇప్పటికే నేత్ర వైద్య సేవలందిస్తున్న ఈ వైద్యశాలకు వైయస్ఆర్ఫౌండేషన్ స్థలం సమకూర్చడంతోపాటు సుమారు రూ.10 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించి అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. ఆధునికీకరించిన ఈ నేత్ర వైద్యశాలను ఎల్వీ ప్రసాద్, వైయస్ రాజారెడ్డి కంటి వైద్య విజ్ఞాన సంస్థగా తీర్చిదిద్ది అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. గతంలో వైయస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాలలో ఏ విధంగా కంటి ఆపరేషన్లు చేసేవారో.. నూతనంగా ప్రారంభించే ఎల్వీ ప్రసాద్, వైయస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాలలోనూ అదేవిధంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయనున్నారు. రోజుకు 5 వేల ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను ఆస్పత్రిలో అందుబాటులో ఉంచారు. భవిష్యత్లో ఐ కేర్ సెంటర్లు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తరహాలో పులివెందులలో కంటి వైద్య సేవలు అందించేందుకు ఎల్వీ ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి కంటి వైద్య విజ్ఞాన సంస్థలో 25 వార్డులు ఏర్పాటు చేశారు. కంప్యూటర్తో కంటి పరీక్షలు, డయోగ్నస్టిక్ సేవలు అందించనున్నారు. పులివెందుల చుట్టుపక్కల గ్రామాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి పరీక్షలతోపాటు ఆపరేషన్లు చేస్తారు. మొదటివిడతగా పులివెందులలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యులచే వైఎస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని ఏర్పాటు చేయగా.. రానున్న రోజుల్లో 50 వేల జనాభా గల ప్రతి గ్రామంలో ఐ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నేడు ప్రజలకు అంకితం వైయస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్, వైయస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని మాజీ సీఎం, వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ బుధవారం పులివెందుల ప్రజలకు అంకితం చేయనున్నారు.