రాజకీయ కక్షతోనే వైయ‌స్ జగన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు 

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి
 

నెల్లూరు: రాజకీయ కక్షతోనే వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి విమ‌ర్శించారు. రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

 మాజీ మంత్రి కాకాణి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు కేసులు పెట్టడమేంటి?. రాజకీయ కక్షతోనే వైయ‌స్‌ జగన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ఎప్పుడు లేని సంప్రదాయాలను తీసుకువస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు.

ఎంపీగా గెలిచినప్పటి నుంచి ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంపై రఘురామ కృష్ణంరాజు విమర్శలు  చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి విచారించారు. మూడు సంవత్సరాల క్రితం జరిగిన పాత కేసును మళ్లీ తోడారు. ఇప్పుడు కేసులు నమోదు చేయడానికి చూస్తే రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దూరాగతాలపై చంద్రబాబు బాధ్యత వహిస్తారా?. ఒక దుష్ట సంప్రదాయాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారు. జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వస్తే 11న ఈ మెయిల్‌లో  రఘురామ ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు 10వ లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే కుట్ర అర్థమవుతుంది.

పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం ఇస్తానని చంద్రబాబు చెప్పారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తానని ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్‌లో ఒక పథకానికి తూట్లు పొడిచారు. జీవో జారీ చేసి ఆధార్ కార్డు వివరాలు  ఇవ్వాలని కోరారు. దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నిస్తే ఇప్పుడు ఇంకా మార్గదర్శకాలు ఇవ్వాలని చెబుతున్నారు. తల్లికి లేదా సంరక్షకుడికి రూ.15 వేలు ఇస్తామన్నారు. వైయ‌స్‌ జగన్ అధికారంలో ఉంటే ఈ సమయానికే అమ్మ ఒడి కింద ఆర్థిక సాయం అందేది. చంద్రబాబు అంటేనే మోసం అని రుజువైంది. ఉచిత ఇసుక అని చెప్పారు. కానీ, డబ్బులు వసూలు చేస్తున్నారు. స్టాక్ పాయింట్లలోని ఇసుకను టీడీపీ నేతలు దోచుకున్నారు అంటూ కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

Back to Top