వైయస్‌ జగన్‌కు ప్రజాసేవే ముఖ్యం 

మంచి పనులు పవన్‌ నాయుడికి కనిపించడం లేదా?

పవన్‌..మీకు పెళ్లిళ్ల మీద మక్కువుంది కాబట్టి చేసుకుంటున్నారు

వెంకయ్యను తిట్టింది మరిచారా పవన్‌ నాయుడు

లాంగ్‌మార్చ్‌లో పవన్‌ మాట్లాడింది సంస్కారమా?

ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నారు..వచ్చాక ఏం చేస్తున్నారు

వైయస్‌ జగన్‌పై కేసులు ఎందుకు పెట్టారన్నది ప్రపంచమంతా తెలుసు

రాష్ట్రంలో డబ్బుల్లేక చదువుకోలేని కుటుంబాలు ఉన్నాయి

విద్యార్థుల తలరాతలు మార్చేలా వైయస్‌ జగన్‌ ఇంగ్లీష్‌ మీడియంపై నిర్ణయం

తాట తీస్తామని చెబితే ప్రజాజీవితంలో కుదరదు

మీరొక్కరే ధైర్యవంతులని అనుకోవద్దు పవన్‌ నాయుడు

వైయస్‌ఆర్‌సీపీలో టన్నుల ధైర్యం ఉన్నవాళ్లు ఉన్నారు

 మంత్రి పేర్నినాని

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజాసేవే ముఖ్యమని, పవన్‌ నాయుడికి పెళ్లిళ్ల మీద మక్కువ కాబట్టి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. పవన్‌ నాయుడికి ప్రభుత్వం చేసే మంచి పనులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రశ్నించేందుకు 2014లో పార్టీ పెట్టిన పవన్‌ నాయుడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదన్నారు. సినిమాల్లో మాదిరిగా ప్రజాజీవితంలో తాట తీస్తామంటే కుదరదన్నారు. పవన్‌ నాయుడు ఇవాళ ప్రెస్‌మీట్లో ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను పేర్నినాని తీవ్రంగా ఖండించారు. సచివాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు. 

 

అమ్మ ఒడి పథకం కింద స్కూల్‌లో చదివించే ప్రతి పేద తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నామన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన మాట నెరవేర్చుతున్నారని, ఈ పనులన్నీ కూడా పవన్‌ నాయుడికి కనిపించడం లేదన్నారు. కేవలం ఇసుక మాత్రమే కనిపిస్తుందని మండిపడ్డారు. జూన్‌ 8వ తేదీన మా ప్రభుత్వం ఏర్పడిందని, జూన్‌ 25వ తేదీ నుంచి గోదావరి నది ఉగ్రరూపం దాల్చిందన్నారు. ఈ రోజు దాకా గోదావరి తల్లి ఉధృతి తగ్గలేదన్నారు. ఈ రోజుకు వరద కొనసాగుతుందన్నారు. ఆగస్టు 13న ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తితే ఈ రోజు వరకు దించలేదన్నారు. ఈ రోజుకు 1400 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్లుందన్నారు. ఇవన్నీ పవన్‌ నాయుడికి కనిపించడం లేదని, చంద్రబాబు చెప్పిందే కనిపిస్తుందన్నారు. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల జపం చేస్తున్న పవన్‌ నాయుడికి గతంలో చంద్రబాబు రూ.1200 కోట్లను నాటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఇతర పనులకు వాడేస్తే..అలాంటి అచ్చెన్నాయుడిని విశాఖ లాంగ్‌మార్చ్‌లో పక్కన కూర్చొబెట్టుకొని మీరు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడటం ఇంతకన్న పాపం మరొకటి ఉందా పవన్‌ నాయుడు అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కరోజైనా భవన నిర్మాణ కార్మికుల గురించి ప్రశ్నించావా అని నిలదీశారు. ప్రశ్నిస్తాను..ప్రశ్నిస్తాను అంటున్న పవన్‌ నాయుడు భవన నిర్మాణ కార్మికులను మోసం చేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదన్నారు.మీ భాషా, మీ వేషం ఎవరి కోసమని ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు కోసం కాదా అన్నారు. వైయస్‌ జగన్‌ బాగా పాలిస్తే నేను వెళ్లి సినిమాలు చేసుకుంటానన్న పవన్‌ నాయుడు..ఈ రోజు ఆయన వద్దకు ఎవరు వెళ్లి బాధలు చెబుతున్నారని నిలదీశారు. ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు మీకు తెలియవా?. చంద్రబాబు బలవంతపు భూసేకరణ చేస్తే ఏం చేశారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మంచి పనులు చేస్తే..రోజు ఖాళీగా ఉన్న పవన్‌ నాయుడు ఒక్కరోజైనా ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారా అన్నారు. 

నా తల్లిదండ్రులు సంస్కారవంతులు అన్న పవన్‌కు నిజంగా సంస్కారం ఉందా అన్నారు. 2014లో ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్‌..మొదటి నుంచి వైయస్‌ జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని తప్పుపట్టారు. నిన్న వైజాగ్‌లో ఏం మాట్లాడారో గుర్తు లేదా? ఇదేనా మీ అమ్మానాన్న నేర్పిన సంస్కారం అని ప్రశ్నించారు. పవన్‌ నాయుడికి సినిమాలో యాక్ట్‌ చేసినప్పుడు ఇష్టం వచ్చినట్లు తిట్టేవారని, రాజకీయాల్లో కూడా ఇలాగే యాక్ట్‌ చేస్తే సరిపోదన్నారు. తాట తిస్తామని బెదిరిస్తున్నారని, ప్రజలు తాట తీస్తే ఎక్కడుంటారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఊహ తెలిసిన ప్రతి పిల్లాడికి కూడా వైయస్‌ జగన్‌ 16 నెలలు జైలులో ఉన్నారో అందరికి తెలుసు అన్నారు. సుష్మాస్వరాజ్‌ పార్లమెంట్‌లోనే మాట్లాడారని, వైయస్‌ రాజశేఖరరెడ్డి బతికున్నంత వరకు వైయస్‌ జగన్‌ మంచివారే అని చెప్పింది గుర్తు లేదా అన్నారు. జైల్లో ఉన్న చిదంబరం తప్పుడు మాటలు విని వైయస్‌ జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టింది పవన్‌ నాయుడికి తెలియదా అన్నారు. ప్రజలందరికీ ఈ విషయం తెలుసు కాబట్టే వైయస్‌ జగన్‌ను 151 స్థానాల్లో గెలిపించి ప్రజలు ముఖ్యమంత్రిని చేశారన్నారు. మనసుకు నచ్చినట్లు ప్రజాసేవ చేస్తారని, నీకు పెళ్లిల మీద మక్కువ ఉండి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారన్నారు. వైయస్‌ జగన్‌కు పెళ్లిల మీద మక్కువ లేదని, ఆయన ప్రజాసేవ, వ్యాపారంపై మక్కువ ఉందన్నారు. వైయస్‌ జగన్‌కు వాళ్ల తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు కాబట్టే..మీరు గత ఐదేళ్లు ఇష్టానుసారంగా తెగబడి మాట్లాడినా మీ గురించి ఎప్పుడు మాట్లాడలేదన్నారు.

వెంకయ్యనాయుడి గురించి పవన్‌ మాట్లాడుతున్నారని, వెంకయ్యనాయుడిని పవన్‌ తిట్టినట్లు ఎవరు కూడా తిట్టి ఉండరన్నారు. మైక్‌లు పెట్టి, టీవీల్లో తిట్టిన ఏకైక వ్యక్తి పవన్‌ నాయుడే అన్నారు. ప్రెస్‌మీట్లలో తాను మాట్లాడేది ఏదో మాట్లాడి గబగబ పవన్‌ లేచిపోయారన్నారు. వైయస్‌ జగన్‌ మాట్లాడిన మాటల్లో అర్థం, పరమార్థం ఉంటుందన్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌తో అనేక వర్గాల ప్రజలు కలిసి తమ బాధలు చెప్పుకున్నారన్నారు. తెలుగు మీడియం చదవడం వల్ల ఉన్నత చదువుల్లో అగ్రవర్ణాలతో పోటీపడలేకపోయామని చెప్పారన్నారు. రాష్ట్రంలో ఉన్న అగ్రవర్ణాల పిల్లల్లో 80శాతం మంది పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతున్నారని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలు మాత్రమే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. విద్యార్థుల బాధలు చూశాకే వైయస్‌ జగన్‌ ఇంగ్లీష్‌ మీడియంపై నిర్ణయం తీసుకున్నారని, వచ్చే ఏడాది నుంచి 1 నుంచి ఐదో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడతామని నిర్ణయంతీసుకున్నారన్నారు. ఉపాధ్యాయులకు ఆంగ్లంపై బోధించేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వపాఠశాల్లో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా నైపుణ్యం కలిగిన వారే అన్నారు. తెలుగు సబ్జెట్‌ తీసేయలేదని, ప్రతి ఒక్కరు తెలుగు చదవాల్సిందే అన్నారు.  దున్నపోతు ఈనిందనగానే పవన్‌ నాయుడు కట్టేసేందుకు పరుగులు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. వైయస్‌ జగన్‌ను నోటికి వచ్చినట్లు దూషించినా పవన్‌ నాయుడిని కాపులతో కాకుండా వేరే కులం వాళ్లతో తిట్టించాలని అంటున్నారని, ఈ వ్యాఖ్యలు వింటే పవన్‌ నాయుడి నరనరాల్లో కులం అనే దురహంకారం ఉందన్నారు. కులజాడ్యం ఎవరికి ఉందని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనన్న ఓట్లు వేశారని పవన్‌ అంటున్నారని తప్పుబట్టారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేర్చుతానని హామీ ఇచ్చి మరిచిపోతే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కాపుల రిజర్వేషన్లపై పవన్‌ నాయుడు సుక్తులు చెప్పారన్నారు. నిన్నటి ఎన్నికల్లో కాపులకు మీరిచ్చిన హామీ గుర్తు లేదా అన్నారు. వైయస్‌ జగన్‌ ఈ రోజు కేబినెట్లో కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, ఏటా కాపు కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఇవన్నీ కూడా పవన్‌ నాయుడికి అర్థం కాదని, ఆయన మెదడంతా చంద్రబాబు ఆలోచనలతో నిండిందన్నారు. 

150 మంది ఎమ్మెల్యేలను పాములతో పవన్‌ నాయుడు పోల్చడం సరికాదన్నారు. మేమంతా శివుడి మెడలో ఉన్నామని, వైయస్‌ జగన్‌ను శివుడితో పోల్చడం సంతోషమే అన్నారు. కేఏ పాల్‌, పవన్‌ నాయుడు, సోనియాగాంధీ, చంద్రబాబు అందరూ కూడా కాలిపోయారు కదా అనిగుర్తు చేశారు. సినిమా డైలాగులు రాజకీయాల్లో చెబితే సరిపోదన్నారు. పవన్‌కు తెలిసిన చరిత్ర వైయస్‌ జగన్‌కు తెలియదన్నారు. పవన్‌కు తెలిసిన చరిత్ర ఏంటంటే..భగత్‌సింగ్‌ 20 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్నారన్న చరిత్ర వైయస్‌ జగన్‌కు తెలియదన్నారు. మ్యాన్‌ ఫ్రైడే అంటూ వ్యక్తిత్వాన్ని హననం చేయవచ్చు..మేమంటే మాత్రం తప్పు అనడం ఏంటన్నారు. బెజవాడ బజార్‌లోకి రండి తేల్చుకుందామని సవాల్‌ చేస్తున్నారు. గతంలో ఢిల్లీ రమన్నారు..విశాఖకు రమన్నారు.మేం వెళ్తే అక్కడ కనిపించలేదు అన్నారు. సినిమాల్లో ఇవన్నీ చెల్లుతాయని కానీ, రాజకీయాల్లో సరిపోవన్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు ప్రజల కోసం చేసిన త్యాగాన్ని స్మరించే అవకాశం కూడా లేకుండా చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపకపోతే ఒక్కరోజైనా మాట్లాడారా?. ఇవాళ తెలుగు భాషా, ఇంగ్లీష్‌ మీడియం గురించి మాట్లాడుతున్నారు. మీ అబ్బాయి ఓక్రిజ్‌ స్కూల్‌లో చేర్పించవచ్చు..అంత గొప్ప స్కూల్‌ ఎక్కడా చూడలేదని, మీరందరూ కూడా చేర్పించండి అన్న పవన్‌..ఇవాళ తెలుగు భాషా, సంస్కృతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఇంగ్లీష్‌ మీడియం అవసరమన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలు ఏదైనా నేర్చుకునే వయసు అన్నారు. వారిది రెంటికి చెడ్డ రేవడి కాదన్నారు. పవన్‌ కళ్యాణ్‌ చాలా ధైర్యవంతులని, అయితే మీరొక్కరే ధైర్యవంతులు అనుకోవడం పొరపాటు అన్నారు. టన్నుల టన్నుల ధైర్యం, సాహసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కూడా ఉందని హెచ్చరించారు. 2014 నుంచి పవన్‌ నాయుడు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని పేర్నినాని హెచ్చరించారు.

Read Also: సరిపడా ఇసుక సరఫరా

Back to Top