సభలోనూ బయటా పోరాటం కొనసాగిస్తాం

ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి హెచ్చ‌రిక‌

అమరావతి: శాసన మండలిలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తిరుమ‌ల ల‌డ్డూపై చర్చను అడ్డుకుందని ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి మండిప‌డ్డారు.  మంత్రి జోక్యం చేసుకుని సభను ఆపించారని ఆమె విమర్శించారు. శుక్ర‌వారం అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి మాట్లాడుతూ.. శాస‌న మండ‌లి చైర్మన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌ స్టేట్‌మెంట్ చదువుతామని చెప్పడం సభా నియమావళికి విరుద్ధమని అన్నారు. తిరుమల లడ్డూ అంశంపై గత ఐదు రోజులుగా వాయిదా తీర్మానం ఇస్తున్నామని, చర్చకు వస్తామని ప్రభుత్వం మాటిచ్చినా ఆచరణలో మాత్రం వెనక్కి తగ్గిందని తెలిపారు. చర్చకు సిద్ధమని ప్రకటించిన కూటమి నేతలు సభలో మాత్రం కనిపించలేదని విమర్శించారు. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశంపై పారదర్శకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. 
చర్చ జరిగే వరకు తమ డిమాండ్‌పై పట్టుబడతామని, సభలోనూ బయటా పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి స్పష్టం చేశారు.


 

Back to Top