విశాఖపట్నం: టీడీపీ మేనిఫెస్టో చూసి జనం నవ్వుకుంటున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. చంద్రబాబు మాటల్లో నిజం ఉండదంటూ ఎద్దేవా చేశారు. వరుదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘అబద్ధానికి పసుపు రాసినట్టు టీడీపీ ‘మాయా’నిఫెస్టో ఉంది. 2019లో మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఇవీ అని.. చెప్పే దమ్ము టీడీపీకి లేదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు నోబెల్స్ అయితే.. చంద్రబాబు ఆలోచనలు గోబెల్స్. గత టీడీపీ మేనిఫెస్టోలో కనీసం ఐదు హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. చంద్రబాబు మాటల్లో నిజం ఉండదు. వరుదు కళ్యాణి మీడియాతో ఏం మాట్లాడారంటే.. అబద్ధాలు, మోసాలతో కూటమి మేనిఫెస్టోః చంద్రబాబు, పవన్కళ్యాణ్లు కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోలో... ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్నీ అలవికాని హామీలు, అబద్ధాలతోనే నిండిపోయి ఉంది. గతంలో 650 హామీలిచ్చారు. అందులో 10 శాతం కూడా నెరవేర్చలేదు. కాబట్టి.. ఇప్పుడు అన్ని హామీలిస్తే ప్రజలు నమ్మరేమోనని, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను కాపీ కొట్టి, మా పథకాలను, కొన్నింటిని పెంచి ఇచ్చారు. అబద్ధానికి పసుపు పూస్తే ఎలా ఉంటుందో అలా ఉందని కూటమి మేనిఫెస్టోను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే, దానికి చంద్రబాబు, పవన్కళ్యాణ్లు పెట్టిన పేరు ప్రజాగళం అంట. దీనిపై ప్రజలు మాత్రం అది ప్రజాగళం కాదు.. ప్రజాగరళం అంటున్నారు. అంతేకాదు, దాన్ని ఐదుకోట్ల మంది ప్రజల పాలిట యమగళంగా భావిస్తున్నారు. పావలాకు కూడా చెల్లని చెత్తడాక్యుమెంట్ః చిత్తశుద్ధి లేని నాయకుడు ఇచ్చిన కాగితాలను మేనిఫెస్టో అంటారా? చిత్తు కాగితం అంటారా..? ప్రజలను నిలువునా మోసం చేసే అబద్ధాల పుట్ట కూటమి మేనిఫెస్టో అని అంతా భావిస్తున్నారు. మార్కెట్లో వేలం పెడితే పావలాకు కూడా చెల్లని చెత్త డాక్యుమెంట్గా దీన్ని జనం పోలుస్తున్నారు. దమ్మున్న నాయకుడు జగన్గారు.. పార్టీ వైఎస్ఆర్సీపీః దమ్మున్న మేనిఫెస్టో, దమ్మున్న పార్టీ ఎలా ఉంటుందంటే.. వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన జగనన్న మేనిఫెస్టోను చూడాల్సిందే. 2024లో మా పార్టీ మేనిఫెస్టో ఇది. గతంలో నేను ఈ హామీలిచ్చాను. వాటి విలువ ఇది. వీటిల్లో 99.4 శాతం హామీల్ని నెరవేర్చాను. రానున్న ఐదేళ్లలోనూ ఈ హామీలతో పాటు కొత్తగా నేనిచ్చే వాగ్దానాలివని .. వాటిని నెరవేర్చేందుకు, ఆర్థిక పరిస్థితి, వనరులతో సహా వివరించి విడుదల చేసిన దమ్మున్న మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీది. అలాంటి దమ్మున్న నాయకుడు మా జగన్మోహన్రెడ్డి గారు. కూటమి మేనిఫెస్టోకు మోదీనే గ్యారెంటీ ఇవ్వలేదుః అబద్ధాలు, మోసాలతో నిండిన కూటమి మేనిఫెస్టోకు, ఆఖరికి ప్రధాని మోదీ గ్యారెంటీ కూడా లేదు. నెరవేర్చని హామీలను బీజేపీకి రుద్దవద్దని .. స్వయాన మోదీగారే వారి మేనిఫెస్టోకు దూరంగా ఉన్నారంటే, అందరూ ఆలోచన చేయాల్సిందే. కనీసం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అయినా .. వారి మేనిఫెస్టో కు గ్యారెంటీ ఇచ్చిందా..? అంటే, ఆమె కూడా పారిపోయిన పరిస్థితిని చూశాం. బాబు అంటే నమ్మకం లేదు-ఆయన మాటలకు విలువలేదుః శ్మశానంలో ముగ్గు.. తెలుగుదేశం పార్టీకి సిగ్గూ ఉండదని ప్రజల్లో నానుడి ఉంది. అలాగే, అద్దం అబద్ధం చెప్పదు. చంద్రబాబు నిజం మాట్లాడడు. మైసూరు బజ్జీలో మైసూరు, హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ లేనట్టుగానే.. చంద్రబాబు మేనిఫెస్టో వారి వెబ్సైట్లోనూ ఉండదు. జగనన్నకు చంద్రబాబుకూ ఉన్న తేడా అదిః 650 వాగ్దానాలిచ్చి ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అయితే.. చేసేదే చెప్పి.. మేనిఫెస్టోలో 99.4 శాతం హామీల్ని నెరవేర్చిన దమ్మున్న నాయకుడు జగన్గారు. ఈ ఇద్దరికీ ఉన్న తేడా అది. చంద్రబాబు అభివృద్ధిపై చెబుతున్న మాటలు గ్రాఫిక్స్లోనే కనిపిస్తాయి. అదే మా జగనన్న చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తోంది. -అలాగే, చంద్రబాబు విజన్ టెలివిజన్లో కనిపిస్తే.. జగనన్న విజన్ ప్రతీ విలేజ్లోనూ కనిపిస్తోంది. చంద్రబాబు ఆలోచనలన్నీ గోబెల్స్వైతే.. జగనన్న ఆలోచనలు మాత్రం నోబెల్ స్థాయికి తగిన ఆలోచనలని ప్రతీ ఒక్కరూ అంగీకరిస్తారు. క్రెడిబుల్టీకి కేరాఫ్గా జగనన్న మేనిఫెస్టోలోని అంశాలైతే.. వాటినన్నింటినీ తుంగలో తొక్కిన చరిత్ర చంద్రబాబుది. పేద, మధ్యతరగతి ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచేందుకు గతంలో నవరత్నాల సంక్షేమ పథకాలు జగనన్న అమలు చేస్తున్నప్పుడు రాష్రం మరో శ్రీలంక అవుతుందని ఈ చంద్రబాబు అన్నాడు. మరి, ఇప్పుడు మీరు అలవికాని హామిలిచ్చి.. నిజంగా, వాటిని అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా..? మరో దేశమౌతుందా..? 5 సంతకాలపై చేతులెత్తేసిన బాబును ఎవరు నమ్ముతారు..? చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో ఐదు సంతకాలన్నాడు. రైతురుణ మాఫీ, డ్వాక్రా రుణమాఫీ, రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్, పింఛన్ల పెంపు, మద్యం బెల్టు షాపుల రద్దు.. ఈ ఐదు అంశాల్ని అధికారంలోకొచ్చిన వెంటనే అమలు చేస్తానని సంతకాలు చేశాడు. సంతకాలు చేసిన మొట్టమొదటి హామీల్నే గాలికొదిలేసిన మీరు.. ఇవాళ అలవికాని హామీలిస్తే ప్రజలు నమ్ముతారు చంద్రబాబు..? నమ్మరు గాక నమ్మరు. ప్రజలంతా ఫ్యాన్గాలి కోసమే సిద్ధం! చంద్రబాబు, పవన్కళ్యాణ్ లు ఎన్ని మాయ మాటలు చెప్పినా.. అలవికాని హామీలతో నమ్మించాలని చూసినా ప్రజల్లో మాత్రం కూటమి మేనిఫెస్టోపై చాలా స్పష్టత ఉంది. గతంలో చంద్రబాబు తానిచ్చిన వాగ్ధానాల్ని ఏ విధంగా నిలబెట్టుకోలేకపోయాడో.. సాయం చేయమని అడిగిన వారిపై ఎలా అహంకారంతో మాట్లాడాడో అనేది ప్రజలు మరిచిపోలేదు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు మోసాలు, అబద్ధాలపై ప్రశ్నిస్తానన్న పవన్కళ్యాణ్ బాధ్యతారాహిత్యాన్ని కూడా ప్రజలు బాగా అర్ధం చేసుకున్నారు. కనుకే, పేద, మధ్యతరగతి బతుకులు మార్చుతూ.. రాష్ట్ర భవిష్యత్తును ఆకాక్షించే జగనన్న పరిపాలన కోసం ప్రజలు ఎదురు చూస్తోన్నారు. మళ్లీ మాకు ‘ఫ్యాన్’ గాలి కావాలంటూ వైఎస్ఆర్సీపీకి ఓట్లేసేందుకు ప్రజలంతా సిద్ధం అని ఎమ్మెల్సీ వరదు కల్యాణి అన్నారు.