వైయస్ఆర్ జిల్లా : జిల్లా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన పంటలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించి, రైతులను పరామర్శించారు. శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో వైయస్ జగన్ పర్యటించారు. అకాల వర్షాలకు వైయస్ఆర్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైయస్ఆర్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. పెద్దకుడాల గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. 3 ఎకరాల్లో యాలకి (సుగంధాలు) అరటి సాగు చేయగా.. పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.