రాజమండ్రి: ‘ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి కదా..? కేబినెట్లో ప్రత్యేక హోదా ఇవ్వం.. స్పెషల్ ప్యాకేజీ ఇస్తాం అన్నప్పుడు అశోక్గజపతిరాజు నిద్రపోయారా..? అప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయారు.. ఇన్నాళ్ల తరువాత నిద్రలేచి నిందలు వేస్తారా..? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీల పనితీరు బాగోలేదని అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలను ఎంపీ భరత్ తీవ్రంగా ఖండించారు. ముంపు మండలాలు ఇస్తేనే సీఎంగా ప్రమాణం చేస్తానన్న చంద్రబాబు.. ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే సీఎంగా ప్రమాణం, సంతకం చేస్తానంటే అప్పుడే వచ్చేది కదా అని నిలదీశారు. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. తాము అప్పటి టీడీపీ ఎంపీల్లా సన్నాయి నొక్కులు నొక్కడం లేదని, అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూనే ఉన్నామన్నారు. ఉత్తర కుమారుడు లోకేష్ భాష ఏంటో, ఆయన బాధ ఏంటో తమకు సరే.. లోకేష్ కూడా తిరిగే వారికే అర్థం కాదని ఎంపీ భరత్రామ్ ఎద్దేవా చేశారు. యువగళమా అది గందరగోళమో..? అర్థం కావడం లేదన్నారు. కాపురం చూస్తే తెలంగాణాలో.. రాజకీయ డ్రామాలు ఆంధ్రప్రదేశ్ లోనా, మీలాంటి వారి చేతిలో ఎలా ఈ రాష్ట్రాన్ని పెడతారని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏపీలో ప్రజలు చాలా విజ్ఞులని, గతంలో చేసిన మీ పాలన చూశాక మళ్లీ ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తారని ఎలా అనుకుంటున్నారని చంద్రబాబు, లోకేష్ను ప్రశ్నించారు. ఎంపీ రఘురామ రాజు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్ స్పందించారు. తాను ఏక చిత్ర నటుడినైనా.. హీరోనే.. చేయాలనుకుంటే ఎన్ని సినిమాలోనైనా హీరోగా నటిస్తా, ప్రజలను మెప్పిస్తా.. సూపర్ స్టార్ అనిపించుకుంటా అన్నారు. రఘురామకు ఒక కామెడీ క్యారెక్టర్ ఇప్పిస్తా..గోచీ పెట్టుకుంటావు కదా అంటూ ఎద్దేవా చేశారు. అరటి ఆకు స్టోరీ.. పార్లమెంటరీలో అందరూ నవ్వుకున్నారు.. నోరు అదుపులో పెట్టుకో రఘూ అంటూ ఎంపీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రూ.13లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చాయని, ఇవి చూసి ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయని ఎంపీ భరత్ అన్నారు. రాయలవారి కొలువులో అష్ట దిగ్గజాల మాదిరిగా దేశ విదేశాల నుంచి ఎందరో పారిశ్రామిక దిగ్గజాలు వస్తే.. అభినందించడం పోయి దీనికి కూడా వారి సహజసిద్ధమైన విమర్శలు చేయడం ప్రతిపక్షాల నైజం బయటపడిందన్నారు. ఆరోగ్యకరమైన విమర్శలు ప్రగతికి దోహదపడతాయి కానీ.. ఇలా ప్రతీ దానికీ విమర్శిస్తే ప్రజల్లో నవ్వులపాలవుతారని ఎంపీ భరత్ అన్నారు.