సీమ వాసులపై చంద్రబాబు వివక్ష

వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు జిల్లా అధ్య‌క్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఫైర్

కౌన్సిల్‌లో రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై ప్రశ్నిస్తే కూటమి నేతలు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. 

అమరావతికి వేల కోట్లు కేటాయిస్తూ, కడప ఉక్కు పరిశ్రమ,  గుండ్రేవుల రిజ‌ర్వాయ‌ర్‌కు నిధులు కేటాయించ‌కుండా నిర్ల‌క్ష్యం 

సీమ హక్కుల కోసం మార్చి 1న కడపలో సమావేశం

రైతు–ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఎస్వీ మోహ‌న్ రెడ్డి పిలుపు 

కర్నూలు: సీమ ప్రాంతంపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు వివక్ష చూపుతున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. శుక్ర‌వారం క‌ర్నూలు న‌గ‌రంలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..శాస‌న మండ‌లి సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించగా కూటమి నేతలు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా సీమ ఎత్తిపోతలపై ప్రకటన చేసినప్పటికీ, దీనిపై ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు స్పందించడం లేదన్నారు.

మౌనం ఎందుకు బాబూ?
రాయ‌ల‌సీమకు రావాల్సిన 20 టీఎంసీల నీటి అంశంపై చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఎస్వీ మోహ‌న్‌రెడ్డి ప్రశ్నించారు. 2 లక్షల ఎకరాలకు నీరు అందే ప్రాజెక్టును రాజకీయ కారణాలతో నిలిపివేశారని విమర్శించారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని నిలిపివేయడం సీమ రైతులకు తీరని అన్యాయమని అన్నారు. శ్రీ‌శైలం డ్యామ్‌లో 800 అడుగులు చేరకముందే తెలంగాణ ప్రభుత్వం నీటిని తీసుకెళ్తోందని, 225 టీఎంసీలు నిండిన తర్వాతే నీరు వదులుతారని నియమం ఉన్నప్పటికీ దానిపై చంద్రబాబు స్పందించడం లేదని విమర్శించారు. అలాగే కర్ణాటకలోని ఆల్మ‌ట్టి డ్యామ్‌ ఎత్తు పెంపుతో సీమకు 100 టీఎంసీల నీరు తగ్గిపోతున్నదని, ఈ విషయంపై కూడా ప్రభుత్వం నిర్ల‌క్ష్యంగా ఉందన్నారు. అమరావతికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, సీమలోని కడప ఉక్కు పరిశ్రమకు రాయితీలు ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో గుండ్రేవుల రిజ్వాయ‌ర్‌కు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు.

వెలుగొండ‌ టన్నల్ పనుల విషయంలో కూడా దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రాజెక్టును దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పూర్తి చేశారని తెలిపారు. ఎవరో చేసిన పనిని తానే చేసినట్లు చెప్పడం తగదన్నారు. సీమ హక్కుల కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి పిలుపునిచ్చిందని, మార్చి 1న వైయ‌స్ఆర్ జిల్లా కడప న‌గ‌రంలో నిర్వహించే సమావేశానికి రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు ఇవ్వాలని ఎస్వీ మోహన్ రెడ్డి కోరారు.
 

Back to Top