తాడేపల్లి: చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పారదర్శకతకు పాడె కట్టి రహస్య జీవోలతో పాలన సాగిస్తున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఆక్షేపించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే 78 రహస్య జీవోలు విడుదల చేసి కూడా పారదర్శక ప్రభుత్వం అని ఎలా చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా తాను నేతృత్వం వహించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకేరోజు ఏకంగా 6 రహస్య జీవోలు ఇచ్చి తానేం తక్కువ తినలేదని నిరూపించుకున్నాడన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రహస్య జీవోలన్నీ కూడా కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పేవి, కన్సెల్టెన్సీలకు బిల్లులు చెల్లించేవే ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం వెన్నుపోటుతో పెట్టిన విద్య అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అబద్ధాల్లో చంద్రబాబునే మించిపోయారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన రహస్య జీవోల్లో కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధించి 36, మున్సిపల్ శాఖకు సంబంధించి 14, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి 4, ఆర్థికశాఖకు చెందినవి 5, ఇరిగేషన్కి 6, హోంశాఖకు 4 జీవోలు ఇచ్చారని వివరించారు. నాగార్జునయాదవ్ ప్రెస్మీట్ పాయింట్స్: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అబద్ధాల్లో చంద్రబాబునే మించిపోయారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవోల గురించి మాట్లాడుతూ పారదర్శకత ఉండాలని పదే పదే నీతులు చెప్పేవాడు. తీరా అధికారంలోకి వచ్చాక ఏడు నెలల్లోనే 78 రహస్య జీవోలు విడుదల చేసి పారదర్శకతకు పాడె కట్టేశాడు. ఆయనే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం.. మేం ఏ వివరాలను గోప్యంగా ఉంచం. ప్రభుత్వ శాఖలు వెలువరించే ఉత్తర్వులు ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఇది మా పారదర్శక పాలనకు సాక్ష్యం.. అంటూ ఆగస్టు 30, 2024న ప్రకటన చేశారు. ఎక్స్ ఖాతాలోనూ పోస్టు చేశారు. కానీ, షరా మామూలే. అంతా సీక్రేట్. కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధించి 36, మున్సిపల్ శాఖకు సంబంధించి 14, జనరల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి 4, ఆర్థికశాఖకు చెందినవి 5, ఇరిగేషన్కి 6, హోంశాఖకు 4 జీవోలు రహస్యంగా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనూ ఒకే రోజు 6 రహస్య జీవోలిచ్చారు. ఇవన్నీ కీలకమైన విధానాల అమలుకు సంబంధించినవే. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు అప్పగించేవి. కన్సల్టెన్సీలకు పేమెంట్లు చేసే జీవోలే. ప్రభుత్వం వెంటనే ఆ జీఓలన్నీ బహిర్గతం చేసి, తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నాగార్జునయాదవ్ డిమాండ్ చేశారు.