తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిరోజూ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పార్టీ అనుబంధ సంఘాలన్నీ కూడా సమాయత్తం కావాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్సీపీ యూత్, స్టూడెంట్, ఇంటెలెక్చువల్ విభాగాల నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధాల విభాగాల ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైయస్ఆర్సీపీ యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజా, స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, ఇంటెలెక్చువల్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ వై.ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి, అన్ని జిల్లాల విభాగాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. అన్ని రంగాలలో కీలక పాత్ర యువతదే, సొసైటీలో తమ బాధ్యతను గుర్తించి ముందుకెళ్ళాల్సిన దశ, అన్నింటికీ పునాది ఈ దశ నుంచే ఉంటుంది. రాజకీయాల్లో యువత పాత్ర ఎంత ఎక్కువగా ఉంటే నిర్ణయాలు అంత బావుంటాయి. దివంగత మహానాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి మంచి ఆశయాలు, ఆలోచనలే పునాదిగా, కోట్లాదిమంది అభిమానం పెట్టుబడిగా మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్ధానం ప్రారంభమైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వైయస్ జగన్ గారి పాలనలో సంస్కరణలు తీసుకొచ్చి ముందుకువెళ్లాం. వైయస్ జగన్ గారి పాలనలో మనం ఏ తప్పు చేయకుండా ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డాం. ఎలాంటి ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా పాలన అందించాం, మనం గర్వంగా కాలర్ ఎగరేసి చెప్పుకునేలా మనల్ని వైయస్ జగన్ గారు నిలబెట్టారు. మనం తప్పు చేసి తలదించుకునే పరిస్ధితి లేదు, ఇప్పుడు ఓటర్లు కూడా వైయస్ జగనే ఉండి ఉంటే అని ఈ రోజు ఆలోచిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎక్కడా చూడలేదు, ఈ ప్రభుత్వం వికృతమైన ఆట కొనసాగిస్తుంది. మన ప్రభుత్వంలో చేసిన మంచిని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. అన్ని వ్యవస్ధలను కూల్చేస్తున్నారు. వైయస్ జగన్ గారు పునాదులతో నిర్మించిన వ్యవస్ధలను కూల్చేసే కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది రాష్ట్రానికి, భవిష్యత్ తరాలకు తీరని నష్టం, దీనిని గమనించి ముందుకెళ్లాలి. వైయస్ జగన్ గారు సమగ్రమైన ప్రణాళికలు, ఆలోచనలతో యజ్క్షంలా సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రపంచస్ధాయిలో ఆలోచించగలిగిన యువత మన రాష్ట్రం నుంచే ఉండాలని తపన పడ్డారు. అన్ని రంగాలలో మన యువత ప్రపంచంతో పోటీపడేలా ఉండే ప్రయత్నం వైయస్ జగన్ గారు చేశారు, కానీ దురదృష్టవశాత్తూ అవన్నీ కూటమి ప్రభుత్వం నిర్వీర్వం చేస్తుంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ నుంచి టెరిషియరీ కేర్ వరకూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, నాణ్యమైన వైద్యం పేదలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని వైయస్ జగన్ గారు కృషిచేశారు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడం, కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దానిని ప్రైవేటీకరణ చేసింది. చంద్రబాబు పాలసీ దారుణంగా ఉంది, వైయస్ జగన్ కట్టింది భవనాలు కాదు వ్యవస్ధ. చంద్రబాబు వీటిని నిర్వీర్యం చేసి క్షమించరాని నేరం, మహా పాపం చేశారు. రాష్ట్రానికి తీరని ద్రోహం, నష్టం చేస్తున్నారు చంద్రబాబు, ఇక పోర్ట్ల విషయానికి వస్తే ప్రభుత్వ ఆదాయాన్ని రాకుండా చేసి ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీంతో రాష్ట్రం పది, ఇరవై ఏళ్ళు వెనక్కిపోతుంది. ఉచిత విద్యుత్ విషయంలో కూడా ఇంతే, పీపీఏల పేరుతో ఆర్ధిక భారం వేశారు. వైయస్ జగన్ గారు రైతుకు హక్కుగా ఉచిత విద్యుత్ అందాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు మాత్రం భారమయ్యేలా చేస్తున్నారు. ప్రజల సొమ్ముకు ధర్మకర్తలా ఉండాల్సిన వ్యక్తి ఇలా వ్యవహరిస్తున్నారు, ప్రతి రూపాయి పేదలకు అందాలని జగన్ గారు ప్రయత్నిస్తే చంద్రబాబు మాత్రం దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రతిరోజూ వైయస్ జగన్ గారిపై, మన పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. అనుబంధ సంఘాలన్నీ కూడా సమాయత్తం కావాలి, ఈ తప్పుడు ప్రచారం ఏ విధంగా తిప్పికొట్టాలి. మనం మళ్ళీ ఏ విధంగా సుపరిపాలన అందించగలమో చెప్పగలగాలి, బరితెగించి వ్యవహరిస్తున్న కూటమి పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందులో ఈ విభాగాల రోల్ ఎక్కువగా ఉంది, పురోగమనం నుంచి తిరోగమనం వైపు వెళ్తున్న రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. చంద్రబాబు చేస్తున్న పాలన వల్ల రాష్ట్రం ఎలా నష్టపోతుందనే విషయాన్ని అన్ని ప్లాట్ఫామ్స్ పై మన గొంతు వినిపించాలి. రాష్ట్రానికి మంచి చేయడంలో మనం చక్కగా ముందుకెళ్ళాం, జగనన్న పాలనే మళ్ళీ కావాలనే గొంతులు పెరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు జగన్ గారి పాలన ఎందుకు అవసరమనే చెప్పాలి. ఇందులో అనుబంధ విభాగాల పాత్ర అత్యంత కీలకమైనది, మీరు సమర్ధవంతంగా పనిచేసినప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. వైయస్ జగన్ గారు వేసే ప్రతి అడుగులోనూ మనమంతా తోడుగా నిలిచి బలమైన శక్తిగా ఎదుగుదాం. ఆల్ ద వెరీ బెస్ట్ అని అనుబంధ విభాగాల నేతలకు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్ధేశం చేశారు.