సర్వం ‘సిద్ధం’

రేపు రాప్తాడులో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభ

రాష్ట్ర చరిత్రలో అత్యంత భారీ బహిరంగ సభగా దీన్ని నిర్వహించేందుకు 110 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాట్లు

‘వాక్‌ వే’ ద్వారా పార్టీ కేడర్‌ దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా పలకరించడానికి వీలుగా ఏర్పాట్లు

అనంత‌పురం : సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలూ కై వసం చేసుకునే దిశగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ నెల 18న జరిగే ‘సిద్ధం’ బహిరంగ సభకు రాప్తాడులో సర్వం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో అత్యంత భారీ బహిరంగ సభగా దీన్ని నిర్వహించేందుకు 110 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉమ్మడి వైయ‌స్ఆర్‌, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ కేడర్‌, అభిమానులు, ప్రజలు తరలిరానున్నారు. వీరందరికీ అవసరమైన తాగునీరు, వైద్యం తదితర సదుపాయాలు కల్పిస్తున్నారు. 

ఫ్యాన్‌ ఆకారంలో వాక్‌ వే
‘సిద్ధం’ బహిరంగ సభా వేదిక నిర్మాణం తుది దశకు చేరుకుంది. వేదిక ముందు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ ఆకారంలో భారీ వాక్‌ వే రూపుదిద్దుకుంది. సభలో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించిన అనంతరం ‘వాక్‌ వే’ ద్వారా పార్టీ కేడర్‌ దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా పలకరించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. 110 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభా వేదికతో పాటు పదుల సంఖ్యలో గ్యాలరీలు నిర్మించారు. నియోజకవర్గాల వారీగా వచ్చే వారందరూ గ్యాలరీలకు చేరుకునేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి వెనుక భాగంలో హెలిప్యాడ్‌ సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 25కి పైగా పార్కింగ్‌ ప్రాంతాలు గుర్తించారు.

ఏర్పాట్ల పరిశీలన
రాప్తాడు ఆటోనగర్‌ సమీపంలో ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం.. రాప్తాడు, అనంతపురం, ధర్మవరం ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ శింగనమల సమన్వయకర్త వీరాంజనేయులు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీమ్‌ అహమ్మద్‌, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్‌ లిఖిత, వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య కూడా వీరి వెంట ఉన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పూర్తిస్థాయిలో హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయిస్తున్నారు.

కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జోనల్‌ ఇన్‌చార్జ్‌ బీసీ రమేష్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే యామినీ బాల, ఉమ్మడి జిల్లా గొర్రెలు, మేకల సహకార సొసైటీ చైర్మన్‌ పసుపుల నరసింహగౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ బెడదూరి గోపాల్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ బోయ రామాంజనేయులు, పార్టీ మండల కన్వీనర్‌ జూటూరు శేఖర్‌, నాయకులు చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, బీసీ సెల్‌ నాయకులు పసుపుల ఆది తదితరులు పాల్గొన్నారు.

రాప్తాడులో రేపు ‘జగనన్న జయకేతనం’

 రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న నవరత్నాల సేవల విశిష్టతను, అవసరాన్ని తెలియజేస్తూ పద్య నాటిక రూపంలో అనంత కళాకారులు అద్బుతంగా ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం రాప్తాడు జరిగే ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభలో నాటికను ప్రదర్శించేందుకు కళాకారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు దక్షిణ భారతదేశ సాంస్కృతిక మండలి సభ్యుడు మైఖేల్‌బాబు శుక్రవారం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభ ప్రారంభమయ్యే వరూ జగనన్న జయకేతనం పేరుతో నాటిక ప్రదర్శన ఉంటుఏందన్నారు.

పటిష్ట బందోబస్తు చేపట్టాలి
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ గౌతమి పోలీసు అధికారులను ఆదేశించారు. రాప్తాడులో హెలిప్యాడ్‌ స్థలంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ అన్బురాజన్‌తో కలిసి కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. ప్రొటోకాల్‌ ప్రకారం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీకి సూచించారు. హెలిప్యాడ్‌ స్థలంలో బారికేడ్లు, పార్కింగ్‌ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమి, చిత్రంలో ఎస్పీ అన్బురాజన్‌   - Sakshi
సంయమనంతో విధులు నిర్వర్తించండి

సీఎం పర్యటన సందర్భంగా పోలీసు సిబ్బంది సంయమనంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ అన్బురాజన్‌ సూచించారు. ‘సిద్ధం’ సభకు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. కేటాయించిన విధులను వారు సక్రమంగా చేపట్టాలని, సభకు వచ్చే ప్రతి ఒక్కరినీ క్షణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే సభా ప్రాంగణం వద్దకు అనుమతించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Back to Top