బాబూ.. అంబేద్కర్‌ భావజాలంపై దాడులా?

మాజీ మంత్రి మేరుగు నాగార్జున
 

కాకినాడ: ఏపీలో అంబేద్కర్‌ భావజాలం మీద దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిప‌డ్డారు. వ్యాపారం చేసుకోవాలనుకున్న ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడాన్ని చంద్రబాబు సహించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 మేరుగు నాగార్జున గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘అంబేద్కర్ ఆలోచన విధానంపై చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా పని చేస్తోంది. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని అసెంబ్లీలో హామీ ఇచ్చి అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. విగ్రహం ఎక్కడ పెడుతున్నారు అని నాలాంటి వాళ్ళు వెళితే అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. విజయవాడ నడి బొడ్డులో కోట్లు ఖరీదైన స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ స్మతివనాన్ని  వైఎస్ జగన్  నిర్మించారు.

వైయ‌స్‌ జగన్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం మీద చంద్రబాబుకు ఆగ్రహం పెరిగింది. వ్యాపారం చేసుకోవాలనుకున్న ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడాన్ని చంద్రబాబు సహించ లేకపోయారు. అంబేద్కర్ విగ్రహం మీద పొలుగులు, గునపాలతో దాడి చేయించారు. టీడీపీ తన కర్కశత్వాన్ని చూపించింది. అంబేద్కర్‌పై దాడి మీ తేలిక స్వభావాన్ని బయట పెట్టింది. మేము ఫిర్యాదు చేసిన తొమ్మిదో తారీఖు వరకు కేసు పెట్టరా?.

వైయ‌స్ జగన్ సూచనల‌ మేరకు మేము నిన్న ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. జరిగిన విషయాలు చెబితే ఎస్సీ కమిషన్ ముక్కు మీద వేలు వేసుకుంది. అంబేద్కర్ విగ్రహంపై దాడికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతుంది. త్వరలో జాతీయ ఎస్సీ కమిషన్ విజయవాడలో పర్యటిస్తుంది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్‌పై దాడులు చేపించలేదు. బాబా సాహెబ్ ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలని విజ్ఞులను కోరుతున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Back to Top