చంద్రబాబు అతిపెద్ద రాజకీయ ఆషాడభూతి 

మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్‌

నమ్మినవారిని మోసం చేయడం బాబుకు అలవాటు

అది చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య

ఆయన ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదు

గుర్తు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని

ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటు

ఇప్పుడు యథేచ్ఛగా మా పార్టీ ఎంపీల కొనుగోలు

అది చూస్తుంటే చంద్రబాబుపై జాలి కలుగుతోంది

బాబు ఎన్ని కుట్రలు చేసినా మా పార్టీ చెక్కుచెదరదు

మా పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌గారిని ఏమీ చేయలేరు

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టీకరణ

తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు అతిపెద్ద రాజకీయ ఆషాడభూతి అని, నమ్మిన వారిని మోసం చేయడం ఆయనకు అలవాటు అని, అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదని గుర్తు చేశారు. ఇంకా ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటు అని, ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని, అది చూస్తుంటే ఆయనపై జాలి కలుగుతోందని అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కుచెదరదని, తమ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌గారిని ఏమీ చేయలేరని పేర్ని నాని స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని (వెంకట్రామయ్య) నాని గురువారం మీడియాతో మాట్లాడారు.

పేర్ని నాని ఏమ‌న్నారంటే..
    వైయ‌స్ జగన్‌గారు తనకు రాజకీయంగా అడ్డు పడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతోందని, అందుకే 2011 నుంచి ఆయనను రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి తెలిపారు. ఆ ప్రక్రియలోనే జగన్‌గారిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని, అయినా ఆయన ధైర్యం కోల్పోకుండా ప్రజల్లో నిల్చి, తొలుత 67 సీట్లు గెల్చి సత్తా చూపారని గుర్తు చేశారు. అప్పుడు కూడా తమ పార్టీని, జగన్‌గారిని నిర్వీర్యం చేసేందుకు సంతలో పశువుల్లా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారని చెప్పారు. 
    టీడీపీలోకి ఎవరైనా రావాలంటే రాజీనామా చేశాకే ఆ పని చేయాలని చెబుతున్న చంద్రబాబు, అప్పుడు ఆ 23 మందితో ఎందుకు రాజీనామా చేయించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా విజయవాడ, విశాఖ కార్పొరేషన్ల నుంచి టీడీపీ కండువాలు కప్పుకున్న మేయర్లు, కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా వైయ‌స్ జగన్‌గారిని ఒక్క అంగుళం కూడా తగ్గించలేరని తేల్చి చెప్పారు.
    ‘చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరం. అదే జగన్‌గారు గెలవాలంటే జనం సాయం చాలు’.. అని మాజీ మంత్రి స్పష్టం చేశారు. స్వార్థంతో రాజకీయాలు చేసే జంప్‌ జిలానీ బ్యాచ్‌లు వైయ‌స్ జగన్‌గారిని అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, 2029 ఎన్నికల్లో ప్రజలు వారికి కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
    వెనకబడిన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇచ్చిన జగన్‌గారు, వారికి పదవులు కట్టబెట్టారని గుర్తు చేసిన పేర్ని నాని, ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన రెండు పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని సవాల్‌ చేశారు. కేవలం వైయ‌స్ జగన్‌గారి వల్లనే ఒక మత్స్యకారుడు పెద్లలసభలో అడుగుపెట్టగలిగాడని గుర్తు చేశారు.
    ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు (డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ) ఇలా ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, శాంతి భద్రతల గురించి అస్సలు ఆలోచించకుండా, బాధ్యతను పూర్తిగా మర్చిన హోం మంత్రి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్ని నాని ఆక్షేపించారు.

మీడియా ప్రశ్నలకు సమాధానం..
    ఆనాడు తమ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఉంటే, టీడీపీలో ఒక్కరు కూడా మిగిలే వారు కారన్న పేర్ని నాని, ఇప్పుడు లావాదేవీలే తప్ప రాజకీయాలు లేవని చెప్పారు.
    తాము అధికారంలోకి వచ్చినా, నిత్యం మాపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి, ఎల్లో మీడియా.. తాజాగా ఒక సినీ నటి కేసు టేకప్‌ చేశారని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో అభియోగాలు ఎదుర్కొంటూ, కేసులు నమోదైన ఆమెను తెరపైకి తీసుకొచ్చి, ఇక్కడ అనేక మంది ఐపీఎస్‌ అధికారులను వేధించడమే లక్ష్యంగా ఎల్లో మీడియా డ్రామా చేస్తోందని వెల్లడించారు.
    2014లో మా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, ఏనాడూ మా పార్టీ గుమ్మం తొక్కని కుక్కల విద్యాసాగర్‌ను, ఇప్పుడు మా పార్టీకి అంటగడుతున్నారని, ఇదంతా టార్గెటెడ్‌ ఐపీఎస్‌ అధికారులను వేధించడమే లక్ష్యంగా జరుగుతున్న కుట్ర అని పేర్ని నాని తెలిపారు. ఆ నటి వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు.

Back to Top