అన్నమయ్య జిల్లా: లక్కిరెడ్డిపల్లె జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగడం దుర్మార్గమని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి టీడీపీ మూకలు ఇంట్లోకి చొరబడి సామాగ్రిని ధ్వంసం చేసి జెడ్పీటీసీ భర్త రెడ్డయ్యను హత్య చేసేందుకు పథకం రచించారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన జెడ్పీటీసీ ఇంటిని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిన్న రాత్రి జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన రామాదేవి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. వైయస్ఆర్సీపీ తరఫున ఆమె జెడ్పీటీసీగా ప్రతినిధ్యం వహిస్తుండగా రమాదేవి ఇంటిపై టీడీపీ మూకలు కత్తులతో దాడి చేయడం బాధాకరమన్నారు. గర్భవతి అని కూడా చూడకుండా జెడ్పీటీసీ రమాదేవి కోడలిపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న బైక్పై పెట్రోల్ పోసి నిప్పంటించి భీభత్సం చేశారని ఫైర్ అయ్యారు. సొంత డబ్బులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న జెడ్పీటీసీ కుటుంబం కుటుంబాన్ని అంతమొందించాలని కుట్రలు చేయడం హేయమన్నారు. బీసీలకు ఇచ్చే రక్షణ ఇదేనా చంద్రబాబు..? కూటమి ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చే రక్షణ ఇదేనా చంద్రబాబు అంటూ గడికోట శ్రీకాంత్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రాయచోటి నియోజకర్గాన్ని కక్షల దిశగా తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి దాడులు మంచి పరిణామం కాదు..చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఆలోచించాలని సూచించారు. బీసీ నాయకుల ఇళ్లలో దూరి దాడి చేయడం, కనిపించిన వాహనాలను దగ్ధం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటానికి మీకు సిగ్గుందా...ఇలాంటి దాడులతో మా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరని హెచ్చరించారు. వృద్ధురాలు , గర్భిణీలపై కూడా దాడి చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఆ రోజు ఎంపీడీవోపై దాడి జరగకపోయినా ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కల్యాణ్ ఇవాళ బీసీ మహిళా ప్రతినిధి ఇంటిపై దాడి జరిగితే ఎక్కడ దాక్కున్నారని శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులకు మేమంతా తోడుగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు.