తాడేపల్లి: వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంకు చెందిన నలుగురు కౌన్సిలర్లు కలిశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందూపురం మునిసిపాలిటీలో కౌన్సిలర్లను భయపెట్టి, మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుని మునిసిపల్ ఛైర్మన్ స్ధానం దక్కించుకునేందుకు కుట్ర పన్నారు. వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు, వీరిలో మల్లిఖార్జున, పరుశురాముడు, రహమత్బీ, మణిలు తమ తప్పు తెలుసుకుని తిరిగి వైయస్ఆర్సీపీ లో చేరారు. శ్రీ సత్యసాయి జిల్లావైయస్ఆర్సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, హిందూపురం వైయస్ఆర్సీపీ సమన్వయకర్త దీపికతో కలిసి వీరంతా తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ను కలిశారు. అధికార పార్టీ నేతల ప్రలోభాలు, బెదిరింపులకు తామిక తలొగ్గేదిలేదని ఏది ఏమైనా ప్రజల పక్షాన నిలబడి వైయస్ఆర్సీపీ వెంటే నడుస్తామన్నారు. బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం హిందూపురంలో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లను చేర్చుకుని.. హిందూపురం మున్సిపల్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని చేజిక్కించుకోవాలనుకున్న టీడీపీకి చుక్కెదురైంది. ఇటీవల టీడీపీలో చేరిన వైయస్ఆర్సీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. హిందూపురం పురపాలక సంఘంపై టీడీపీ జెండాను ఎగుర వేయాలని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సీనియర్ నేతలు వ్యూహలపై వ్యూహలు రచించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజతో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లను గత ఆగష్టు 15న బాలయ్య సమక్షంలో టీడీపీలోకి చేర్చుకున్నారు. దీంతో టీడీపీకి చెందిన ఆరుగురు, బీజేపీ, ఎంఐఎంకు ఇద్దరు కౌన్సిలర్లు, వైయస్ఆర్సీపీకి చెందిన పది మంది కౌన్సిలర్లు, స్వతంత్రంగా గెలిచిన కౌన్సిలర్తో పాటు మొత్తం 19 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో కలుపుకుని 21 మందితో టీడీపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది. ఇక హిందూపురం ఛైర్మన్ టీడీపీ ఖాతాలోకి వస్తోందని అందరూ ఊహించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆరో వార్డు కౌన్సిలర్ డి.రమేష్ కుమార్ పేరును ప్రతిపాదించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వైయస్ఆర్సీపీని విభేదించి టీడీపీలోకి చేరిన నలుగురు కౌన్సిలర్లు.. సోమవారం వైయస్ఆర్సీపీ నాయకులు వేణురెడ్డి సమక్షంలో తిరిగి వైయస్ఆర్సీపీలోకి చేరారు. వీరికి వేణురెడ్డి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. దీంతో.. మళ్లీ హిందూపురం పురపాలక సంఘంపై వైయస్ఆర్సీపీ జెండా ఎగరనుంది.