తాడేపల్లి: రాష్ట్రంలో ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనపబడటం లేదా అని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదని.. బ్రోకరిజం అంటూ ఆమె మండిపడ్డారు. ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనపడటం లేదని దుయ్యబట్టారు. బుధవారం లక్ష్మీపార్వతి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? ‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే లక్షన్నర కోట్లు అప్పులు చేసింది?. ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లింది. చంద్రబాబు జేబుల్లోకి వెళ్లాయా?. ప్రజలను పూర్తిగా మద్యం మత్తులోకి నెట్టేశారు, జనాన్ని మత్తులో పెట్టి పరిపాలన చేస్తున్నారు. రేషన్ డిపోలను టీడీపీ ఆఫీసుల్లో నిర్వహించటం ఈ పాలనలోనే చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో రేపిస్టులు, దొంగలు కాలర్ ఎగురవేసుకుని తిరుగుతున్నారు. తిరుపతి లక్ష్మికి ఒక న్యాయం, ముంబాయి నటి జత్వానీకి ఇంకో న్యాయమా?’’ అంటూ లక్ష్మీపార్వతి నిలదీశారు. ఇకనైనా చంద్రబాబు మారాలి: ‘‘పరిపాలన చేసే అర్హత చంద్రబాబుకు లేదు. తిరుపతి లక్ష్మీ విషయంలో ప్రత్యేక కమిటీతో విచారణ జరపాలి. ఏబీ వెంకటేశ్వరరావు వంటి వ్యక్తి చేతిలో పెట్టి పోలీసు వ్యవస్థను నడపటం దారుణం. కులాల గురించి భయంకరంగా మాట్లాడిన వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయటం ఏంటి?. పిచ్చోడి చేతిలో రాయిలాగ ప్రభుత్వ పనితీరు మారింది. ఎన్టీఆర్ మంచిపాలనే ఇప్పటికీ ప్రజల్లో ఆయన ఉండటానికి కారణం. మరి చెప్పుకోవడానికి చంద్రబాబు ఏం పాలన చేస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు ఇకనైనా మారాలి’’ అని లక్ష్మీ పార్వతి హితవు పలికారు. లోకేష్ను కట్టడి చేయాలి: అధికారం కోసం చంద్రబాబు చేయని నీచపు పనలు లేవు. అబద్దాల కోటలో బతుకుతున్నాడు. తిరుపతి లడ్డూ నుంచి ప్రతి విషయంలోనూ అబద్ధాలే. లోకేష్ అవినీతి, అరాచకాలు విపరీతంగా ఉన్నాయి. నారావారి సంప్రదాయంలో చెడు మాత్రమే మిగిలింది. కన్నతండ్రిగా చంద్రబాబు లోకేష్ని కట్టడి చేయాలి. సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. మహిళలపై అరాచకాలు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించటంలేదు?. తిరుపతిలో లక్ష్మిని కరిణ్రాయల్ అనేవాడు మోసం చేశాడు. తప్పు చేసిన వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. బాధితురాలు జైలు పాలైంది. మిర్చి రైతులు ధరల్లేక అల్లాడిపోతుండే చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలంటే చంద్రబాబుకు గౌరవం లేదు’’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.