పులి సాగర్‌కు న్యాయం చేయాలి

 వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌
 

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రికి చెందిన దళిత యువకుడు పులి సాగర్‌పై జరిగిన దాడి ఘటనపై రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఫిర్యాదు చేశారు. దళిత యువకుడిని పోలీస్ స్టేషన్‌లో బంధించి సీఐ దాష్టీకంపై ఆయన మండిపడ్డారు. దళితులపై కూటమి సర్కార్‌ వేధింపుల పట్ల భరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పులి సాగర్‌కు జరిగిన అన్యాయంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని భరత్ తెలిపారు.

కాగా, రాజమండ్రి పోలీసుల చేతిలో దారుణంగా హింసించబడ్డ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ ఉదంతంపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. బాధితుడు పులి సాగర్‌కు అండగా నిలవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలను ఆదేశించారు.

రెండురోజుల క్రితం పులిసాగర్‌ను కొందరు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వైయ‌స్‌ జగన్‌ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో.. రాజమహేంద్రవరం పోలీసులు తనతో ఎంత అవమానవీయంగా వ్యవహరించారో వైయ‌స్‌ జగన్‌కు సాగర్‌ వివరించాడు. అయితే సాగర్‌కు ధైర్యం చెప్పిన వైయ‌స్‌ జగన్‌.. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. పోలీసుల తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

Back to Top