తాడేపల్లి: వైయస్ఆర్సీపీ గెల్చిన నియోజకవర్గాల్లో రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాస్తూ, ఇన్ఛార్జీల పెత్తనం నడుస్తోందని ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరూపాక్షి ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఐఏఎస్, ఐపీఎస్లే.. ఎమ్మెల్యేలుగా తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకనైనా అధికారులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే విరూపాక్షి కోరారు. కూటమి గుండా రాజ్యం: నా (ఆలూరు) నియోకవర్గంలో ఇటీవలే ఈరన్న అనే ఫీల్డ్ అసిస్టెంట్ను దారుణంగా నరికి చంపారు. ఒక పోస్టు కోసం ఆయన్ను హత్య చేశారని ప్రచారం జరిగింది. కూటమి పార్టీలకు చెందిన గుండాలు అలా అమాయక ప్రజల ప్రాణాలు తీస్తుంటే చంద్రబాబుకి కనీసం చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదు. మరోవైపు మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. వారిపై అత్యాచారాలు, నేరాలు నిత్యకృత్యంగా మారాయి. అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల హామీల అమలు లేదు: చంద్రబాబుని నమ్మడమంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని గత ఎన్నికల ముందు జగన్గారు పలుమార్లు ప్రజలను హెచ్చరించారు. ఆయన అన్నట్లే జరిగింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి, 8 నెలలైనా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. పెన్షన్ రూ.1000 పెంచినట్లు జోరుగా ప్రచారం చేస్తున్నా, మరోవైపు కుట్రతో వాటి సంఖ్య తగ్గిస్తున్నారు. ఇప్పటికే 3 లక్షలకు పైగా పెన్షన్లకు కోత పెట్టారు. చంద్రబాబు హామీలకు తాను గ్యారంటీ ఉంటానని చెప్పిన పవన్కళ్యాణ్ పత్తా లేకుండా పోయాడు. ఎన్నికల హామీలు అమలు చేయలేకపోతే కాలర్ పట్టుకోమన్న లోకేష్, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? ఎవరి కాలర్ పట్టుకోవాలి? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.