అనంతపురం: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అందరం తోడుగా నిలవాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పిలుపునిచ్చారు. జగనన్న సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొంది ఉంటే, అవి కలకాలం మనకు అందాలని అనుకుంటే, మన పిల్లల విద్యాబుద్ధులు రూపాయి ఖర్చు లేకుండా సాగాలని భావిస్తే జగనన్నకు ఎల్లవేళలా మనం తోడుగా ఉండాలని కోరారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన వైయస్ఆర్ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమంలో ఆమె పాల్గొని రూ. 2 కోట్ల 50 లక్షల 93 వేల 551 చెక్ ను డ్వాక్రా మహిళా సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. శింగనమల నియోజకవర్గంలో మూడేళ్లలో 33కోట్ల 59లక్షలు కేవలం సున్నావడ్డీ పథకం కోసం జగనన్న వెచ్చించారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ముందడుగు వేయాలని వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, వైయస్సార్ సున్నావడ్డీ, జగనన్న తోడు ఇలా ఎన్నో పథకాలు అందజేసిన ఘనత మన జగనన్నకే దక్కుతుందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సున్నావడ్డీ రూ. 3,441 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా కట్టాల్సి ఉంటే, నాడు కడతానని చెప్పిన చంద్రబాబు కేవలం రూ.382 కోట్లు మాత్రమే కట్టి మిగిలిన 3059 కోట్లు మహిళలతో కట్టించారని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడే ధీరుడని చెప్పాలి. చంద్రబాబు హయాంలో ఆయన చేసిన అప్పులు, బకాయిలు, మహిళలకు ఇస్తానని చెప్పి ఇవ్వని డబ్బులు, కాలేజీలకు ఆగిపోయిన ఫీజు రీయంబర్స్ మెంట్లు, అమలుకాని ఆరోగ్యశ్రీ ఇవన్నీ జగనన్న తీర్చాడని, ఆ బకాయిలన్నీ తాను కట్టిన గొప్ప మనసున్న నేతగా ఎదిగాడని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ప్రజా సంక్షేమ పథకాలేవీ ఆపకుండా, ప్రజలను కష్టాలపాలు చేయకుండా ఆదుకున్న గొప్ప నేత మన జగనన్న అని తెలిపారు. మనకు సొంత అన్నదమ్ములు కూడా ఇంతలా చేయడు. కానీ మన జగనన్న అంతకన్నా ఎక్కువగా ప్రజలను ఆదుకోవడమే కాదు, ఆ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ముందుకు తీసుకువెళుతున్న ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. దిశ యాప్ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటే, ఈ తెలుగుదేశం నేతలు, ఎల్లోమీడియా అంతా దానిపై కూడా దుష్ప్రచారం చేయడం విచారకరమని అన్నారు. చందమామకైనా మచ్చ ఉంది కానీ, జగనన్నకు మచ్చలేదని ప్రజల హర్షధ్వానాల మధ్య తెలిపారు.