నెల్లూరు: చదువు పూర్తయిన తర్వాత తనను ఆడిటర్ చేసిన దివంగత నేత వైయస్ రాజారెడ్డి రుణం తీర్చుకోలేనిదని వైయస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉండాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను.. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఎంపీగా పోటీ చేసే అవకాశం రావడం అదృష్టంగా ఉందన్నారు. బుధవారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేతల నుంచి చంద్రబాబు నాయుడు వరకూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో భూములు ఆక్రమించారని నాపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే, నేను శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడిని.. ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహంచేసి తెలుగుదేశం పార్టీలో చేరారు అని మండిపడ్డారు. కోటంరెడ్డి ప్రజాసేవ మరిచి దందాలకు అలవాటు పడ్డారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అధికారిణిపై దౌర్జన్యానికి పాల్పడితే అప్పట్లో సీఎం వైయస్ జగన్ చట్టపరమైన చర్యలకు ఆదేశించారని తెలిపారు.. కోటంరెడ్డి లాంటివారికి ఓటేస్తే ప్రశాంతత ఉండదు అని హెచ్చరించారు.