వరద బాధితులకు కోటి రూపాయల సాయం 

పార్టీ నాయకుల సమావేశంలో వైయస్‌ జగన్‌ నిర్ణయం

 తాడేపల్లి:  రాష్ట్రంలో వరదల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలు, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ జరిగింది. ఈ సమావేశంలో విరాళం ఇస్తూ ఈ ప్రకటన చేశారు.  
    వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పలువురు నాయకులు వెల్లడించారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవని వారు తెలిపారు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ, సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారని, అధికార యంత్రాంగమంతా ఆయనతో ఉంటూ, ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని చెప్పారు. దీంతో వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా, వారికి మందులు కూడా లభించడం లేదని, చివరకు పాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
    కాగా, నిన్న (సోమవారం) తన పర్యటనలో వరద బాధితుల పడుతున్న కష్టాలను స్వయంగా చూశానన్న వైయస్‌ జగన్, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వల్ల ఘోర తప్పిదం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, అయినా నింద తమపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు. 

    పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ అడపా శేషు, పార్టీ నాయకుడు షేక్‌ ఆసిఫ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Back to Top