గుంటూరు: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా భావిస్తూ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహనరెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ప్రధాన ప్రతిపక్షాలు దేవుళ్ల పేరుతో చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని నందికొట్కూరు నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో నరసరావుపేటలోని క్రీడల స్టేడియంలో నిర్వహిస్తున్న ఎడ్ల బలప్రదర్శన పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వేలాది మంది రైతన్నలను ఉద్దేశించి సిద్ధార్థరెడ్డి మాట్లాడారు. కరోనా కారణంగా ప్రాణహాని ఉందని ఉద్యోగులు అందరూ ఎన్నికలు వ్యతిరేకిస్తున్నారు తప్పితే తాము కాదన్నారు. తమకు ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అన్నారు. ఎన్నికలను రద్దుచేయాలని కోరుకోవట్లేదని కేవలం వాయిదా వేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. తాము ఎన్నికలకు భయపడుతున్నామంటూ కొన్ని పక్షాల నాయకులు చేస్తున్న ప్రచారం ఏమాత్రం వాస్తవంకాదన్నారు. భయమనే పదమే వైఎస్.జగన్కు తెలియదన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ.. పౌరుషం, మాట నిలబెట్టుకోవటం, అభిమానం చూపించటంలో పలనాడు, రాయలసీమకు పోలిక ఉందన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన సిద్ధార్థరెడ్డిపై చూపిస్తున్న అభిమానం అలాంటిదన్నారు. కులాలు, మతాలను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారంటే ఆ పార్టీకి ప్రజల్లో అభిమానం లేకపోవటమే కారణం అన్నారు. టీడీపీకి మనుగడలేదనే భావనతో దేవుళ్ల పేరుతో చిల్లర రాజకీయాలకు తెరతీశారన్నారు.