తాడేపల్లి: చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కల్యాణ్ రోడ్డు మీదకు వచ్చాడని, ఏదో ఒక సాకుతో వైయస్ జగన్ ప్రభుత్వంపై నిందవేయాలనే దురుద్దేశం పవన్ మాటల్లో కనిపిస్తుందని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మాటలు పూర్తిగా అర్థరహితమన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితం చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనపై అప్పుడెందుకు నిలదీయలేదని పవన్ను ప్రశ్నించారు. పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి అని చెప్పి ఆ రెండు సంవత్సరాల ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రబాబు డైరెక్షన్లో రోడ్డు మీదకు వచ్చాడని ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. చంద్రబాబు హయాంలోనే సుగాలి ప్రీతి ఘటనపై చార్జిషీట్ వేయడం జరిగిందని గుర్తుచేశారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రీతి తల్లిదండ్రులను తానే స్వయంగా కలిసి వారికి భరోసా ఇచ్చానని హఫీజ్ఖాన్ చెప్పారు. ప్రీతికి మన ప్రభుత్వ హయాంలో న్యాయం చేయాలని రాష్ట్ర హోంమంత్రిని మూడు సార్లు కలిసి మాట్లాడడం జరిగిందని గుర్తుచేశారు. కేసు కోర్టులో ఉండడంతో సమగ్ర దర్యాప్తు మళ్లీ చేపించాలని న్యాయమూర్తితో మాట్లాడి ఆర్డర్ కూడా తీసుకువచ్చామన్నారు. ప్రీతి కేసుపై ఒక మహిళా పోలీస్ అధికారిని కూడా నియమించామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం లాగే వైయస్ జగన్ ప్రభుత్వం ఉందనుకోవడం పవన్ కల్యాణ్ భ్రమ అని, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని, లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం వైయస్ జగన్ నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. మహిళా భద్రత కోసం సీఎం వైయస్ జగన్ దిశ చట్టం తీసుకువచ్చారని పవన్కు సూచించారు.