అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యార్థులు, యువత తరలిరావాలని వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ పిలుపునిచ్చారు. యువత పోరు కార్యక్రమం విజయవంతం చేసేందుకు అనంతపురం పార్టీ కార్యాలయంలో ఆయన స్థానిక యువతతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా సలామ్ మాట్లాడారు. మోసంపై గళం విప్పుదాం `రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన (కూటమి) నేతలు ఎన్నికల ముందు ఇంటింటికీ వచ్చి తల్లికి వందనం ప్రతి ఒక్కరికీ రూ.15,000 ఇస్తాం అని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. లేకుంటే భృతి ఇస్తామని , ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తామని అనేక హామీలను గుప్పించి 9 నెలల పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మోసం చేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసంపై గళం విప్పుదాం. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ సరైన కేటాయింపులు చేయలేదు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశారు. విద్యార్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ వైయస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది పేదలు ఉన్నత చదువులు అభ్యసించారు. డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక మరో అడుగు ముందుకు వేసి వసతిదీవెన పథకం కింద హాస్టల్ ఖర్చులు అందజేశారు. ప్రతి ఏటా ఫీజులు చెల్లిస్తూ వైయస్ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తోంది. తక్షణం రూ.4,600 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఫీజుల కోసం కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికల్లో రూ.3 వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. వైయస్ జగన్ పాలనలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే ఈ ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ చేస్తున్న ‘యువత పోరు’లో అందరూ భాగస్వాములు కావాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలిరావాలి` అని బాబా సలామ్ కోరారు.