అధికారం ఉన్నప్పుడు ఆమాత్రం లేకపోతే ఎలా అన్నది పచ్చ నేతల మాటే కాదు. గెలిచి గద్దెనెక్కినందుకు తామే కాదు తమ కుటుంబం, పరివారం కూడా అధికారిక హోదాలు, రాజలాంఛనాలు అనుభవించాలన్నది పచ్చనేతల మాట. అందుకే తెలుగుదేశం నాయకులే కాదు వారి కుటుంబసభ్యులు కూడా పెత్తనం చెలాయించేస్తుంటారు. ఎలాగూ ప్రజాస్వామ్యాన్ని ఎండబెట్టి ఏడు చేపల కథ చేసారు కనుక కుటుంబ పాలనతో పచ్చ రాచరికానికి దారులు తీయాలనుకుంటున్నారు. మంత్రిగారి భార్య టోల్ కట్టనందుకే కిందా మీదా అయిపోతే ఎలా? భర్తకు అర్థం భాగం అయినందుకు అధికారాలు, లాంఛనాల్లో అర్థభాగం ఎందుకు రాదని వాదించే అర్థనారీశ్వర మంత్రిణిని చూసి ముచ్చటపడాలి. అధికారం అండ చూసుకుని పచ్చ నవాబులు చేస్తున్న రుబాబులు ఇవాళేమైనా కొత్తా?? మన రాష్ట్రంలో సీఎం బదులు ఆయన సతీమణి రిపబ్లిక్ డే కి జెండా ఎగురేస్తారు. అడ్డదారి అడ్డగోలు అమాత్యులు కుటుంబంతో సహా పోలీసు వందన స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన బామ్మర్ది సమావేశాలు కానిస్తారు. మహిళా మంత్రి కొడుకు పట్టపగలే దౌర్జన్యాలు చేస్తాడు సభాపతి సుపుత్రులు పబ్లిక్ గా గూండాయిజం చేస్తారు. చివరకు నాయకుల అనుచరులు, పార్టీ ఆఫీసు సెక్యూరిటీ గార్డులు కూడా సామన్యులపై కన్నెర్ర చేస్తారు... ఎమ్మెల్యేల సోదరులు, మంత్రుల పుత్రరత్నాలు, అమాత్యుల కోడళ్లు, ముఖ్యమంత్రి మనవళ్లూ కారెవరూ ప్రివిలేజెస్ కు అనర్హులు. ప్రొటోకాలూ పొట్లకాయ లాంటి పద్ధతులు పచ్చ ప్రభుత్వంలో జాన్తా నై. కాంట్రాక్టులు పుచ్చుకునే, డేటాలను ఇచ్చిపుచ్చుకునే వారంతా సొంతోళ్లే... సొంత అభివృద్ధిలో సొంత వాళ్ల పాత్ర కొంత కాదు అంతా ఉండాలనే నియమం ఉన్నచోట నాయకుల ఫ్యామిలీలకు అధికారాలు లేవనేదెవరు...?? టీడీపీ నేతలకే కాదు వారి కుటుంబాలకూ ప్రివిలేజెస్ వర్తిస్తాయని చెబుతూ ఓ జీవో జారీ చేస్తే ఈ గొడవలేకపోను కదా! జూన్ 8 వరకూ నేనే ముఖ్యమంత్రిని అంటూ సీటు పట్టుకు వేళాడుతున్న చంద్రబాబుగారు తెలుగు తమ్ముళ్ల కుటుంబాలకోసం ఇప్పుడైనా ఆ పని చేస్తారేమో చూద్దాం!!