మాజీ మంత్రి జోగి రమేష్‌పై కక్ష సాధింపు చర్యలు

అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులు

ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు  నిరసనగా జోగి ర‌మేష్ ధర్నా

ఎన్టీఆర్‌ జిల్లా:   వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై అధికార కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ నేతలే లక్ష్యంగా వారిపై పలు అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు గురి చేస్తోంది.

వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఇంటిలో మంగళవారం ఉదయం పోలీసులు సోదాలు చేపట్టారు. ఎందుకొచ్చారోకూడా సమాచారం ఇ‍వ్వకుండా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు తీరుపై జోగి రమేష్ కుటుంబ సభ్యులు, అనుచరులు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల క్రితం జోగి రమేష్‌ ఇంటిపై రాళ్లతో దాడులు
ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. జూన్‌ 16న జోగి రమేష్‌పై రాళ్ల దాడి చేశారు. 

ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారు.

పోలీసుల వైఖరిపై జోగి రమేష్‌ నిరసన
విజయవాడ: మాజీ మంత్రి జోగిరమేష్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడు రాజీవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై జోగి రమేష్‌ నిరసన తెలిపారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు  నిరసనగా ధర్నాకు దిగారు.

అగ్రిగోల్డ్‌లో మా కుటుంబం తప్పు చేసినట్టు నిరూపిస్తే.. విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటాం. చంద్రబాబు మాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. మా కుమారుడు విదేశాల్లో చదివాడు, ఉద్యోగం చేశాడు. బలహీనవర్గాలపై దాడి ఇది.. గౌడ కులం నుంచి అంచెలంచెలుగా ఎదిగా. కోపం ఉంటే నాపై కక్ష తీర్చుకోండి. నా కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని జోగి రమేష్‌ ధ్వజమెత్తారు.

చంద్రబాబూ.. నీకూ కొడుకులు ఉన్నారు.. తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదు. చంద్రబాబు వంకర బుద్ది మార్చుకోవాలి. ఇది జోగి రమేష్ మీద.. జోగి రాజీవ్‌పై జరిగిన దాడి కాదు.. బలహీన వర్గాలపై జరిగిన దాడి. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చండి.. డైవర్షన్ పాలిటిక్స్ వద్దు.. హామీలు నెరవేర్చి ప్రజలకి మంచి చేయండి అంటూ జోగి రమేష్‌ హితవు పలికారు.

 
 

Back to Top