పిన్నెల్లి  గ్రామ‌స్తుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అండ‌

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన గ్రామ బ‌హిష్క‌ర‌ణ బాధిత కుటుంబాలు

తాడేపల్లి:  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక గ్రామ బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భరోసా క‌ల్పించారు. గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. దాదాపు 400 వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ బహిష్కరణ వేటు వేసింది. వీరంతా మైనారిటీ, ఎస్సీ, బీసీలకు చెందిన వారే. వీరిని గ్రామంలో చేర్చేందుకు వచ్చే రెండు నెలల్లో ఛలో పిన్నెల్లి కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ సిద్దమవుతోంది. గ్రామ బహిష్కరణ విషయంపై న్యాయపరంగా హైకోర్టులో కూడా పోరాడుతోంది. ఈ క్ర‌మంలో బాధిత కుటుంబాల‌తో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.  గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని  వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందించనున్నట్లు వారికి భరోసా ఇచ్చారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులన్న కారణంతో గ్రామం నుంచి బహిష్కరించారని, గ్రామంలోకి వస్తే చంపేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. వారికి అండగా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందని వైయ‌స్ జ‌గ‌న్ ధైర్యం చెప్పారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో  వైయస్‌ జగన్‌ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు, వీరితో పాటు తురకపాలెం, మాదెనపాడు,చెన్నాయపాలెం గ్రామాలకు చెందిన మరికొంత మంది కూడా కలిసిన వారిలో ఉన్నారు.

Back to Top