వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ విజ్ఞప్తి

తాడేప‌ల్లి: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల‌ని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్ మోహ‌న్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జమ్మూకాశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు సైనికులు వీరమరణం పొందడంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు, వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దేశ రక్షణలో వీరి సేవలు చిరస్మరణీయమన్నారు. వారి త్యాగాలు మరువలేనివన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన సనపల జగదీశ్వరరావు, డొక్కరి రాజేష్ కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top