తాడేపల్లి: అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు మారారని మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టిజెఆర్ సుధాకర్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు మాట్లాడుతూ ఉచిత పథకాలను వింటుంటే విసుగు పుడుతోందని వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ ను ఎగ్గొట్టేందుకే చంద్రబాబు సిద్దమవుతున్నారని మండిపడ్డారు. ప్రెస్మీట్లో సుధాకర్బాబు ఇంకా ఏమన్నారంటే.. కేజ్రీవాల్ ను 2019లో చంద్రబాబు రాష్ట్రానికి తీసుకువచ్చి గొప్పగా ఎన్నికల ప్రచారంలో వినియోగించుకున్నారు. ఇప్పుడు అదే కేజ్రీవాల్ ఢిల్లీలో ఓటమి పాలవ్వడంతో ఆయనపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చాలా సమర్థుడైన నాయకుడు అంటూ కీర్తిస్తున్న ప్రధాని నరేంద్రమోదీని దగాకోరు అంటూ గతంలో చంద్రబాబు ఎంత నీచంగా మాట్లాడారో మరిచిపోయారా? నరేంద్రమోదీ భార్య గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడారు. నల్లచొక్కా వేసుకుని ఢిల్లీకి వెళ్ళి మోదీకి వ్యతిరేకంగా ధర్నాలు చేశాడు. ఆనాడు కాంగ్రెస్ తో జతకట్టి, తెలంగాణాలో కాంగ్రెస్ పొత్తుతో ఎన్నికలకు కూడా వెళ్ళారు. చంద్రబాబు అవకాశ రాజకీయ ప్రస్థానం: 1994లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. 1995లో ఎన్డీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. 1999లో వామపక్షాలను వదిలిపెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2009లో బీజేపీని విడిచిపెట్టి వామపక్షాలు, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని మహా కూటమి పేరుతో ఎన్నికలకు వెళ్లారు. 2014లో ఎన్డీఏ, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. 2019లో యుపిఏతో జత కట్టారు. 2024లో మళ్లీ ఎన్డీఏతో పొత్తు, పరోక్షంగా కాంగ్రెస్ తో అవగాహన పెట్టుకున్నారు. చంద్రబాబు పార్టీ పాలన ’డీ’ అనే అక్షరం మీద నడుస్తోంది. ’డీ’ అంటే డైవర్షన్, డ్రగ్స్, డిక్టేటర్ షిప్, దందాలు, దోచుకోవడం, డైలాగ్స్, డేంజరస్ పొలిటికల్ ఆర్గనైజేషన్ గా నడుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు పాలన అంటే యువకుడైన వైయస్ జగన్ పైన దూషణలకే పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తారోననే భయంతో దానికి కూడా అడ్డు పడుతున్నారు. పదకొండు సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఎక్కడా లేదు, న్యాయం చేయాలని కోర్ట్ కు వెళ్ళాం. ఇదే విషయాన్ని అసెంబ్లీకి వచ్చి అడగాలని కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇదే తెలుగుదేశం పార్టీ 2022 నుంచి అసెంబ్లీకి రాకుండా 2024 వరకు ఎందుకు బహిష్కరించారో చెప్పాలి. గౌరవ స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి వైయస్ జగన్ ను చంపడం తప్ప మరో మార్గం లేదు అని వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యక్తి వైయస్ జగన్ ను గౌరవ సభ్యుడిగా చూస్తారా? మాట్లాడిస్తారా? వైయస్ఆర్ సీపీ లో గెలిచి, పార్టీపైన తీవ్ర విమర్శలు చేసిన రఘురామకృష్ణంరాజును అసెంబ్లీ ఉపసభాపతిగా ఎన్నుకున్నారు. ఇటువంటి వారు ఉన్న సభలో వైయస్ జగన్ గారికి నిస్పక్షపాతంగా సమయం కేటాయిస్తారా? ప్రజాస్వామిక విలువలను కాపాడతారా? నిజంగా మీకు ప్రతిపక్ష వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే క్లీన్ చీట్ ఉన్న వారిని అటువంటి గౌరవ స్థానంలో కూర్చోబెట్టాలి. చంద్రబాబుకు నిత్యం వైయస్ జగన్ నామస్మరణే: చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా వైయస్ జగన్ నామస్మరణే చేస్తున్నారు. ఢిల్లీ, దావోస్, చివరికి కేబినెట్, మీడియా సమావేశాల్లోనూ వైయస్ జగన్ గారిని స్మరించుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. మేనిఫేస్టోను మనీఫేస్టోగా మార్చేసిన ఘనుడు చంద్రబాబు. తనకు, తన అనుయాయులకు సంపదను పెంచుకోవడం కోసమే పాలన అని అనుకుంటున్నారు. చంద్రబాబు మాట మీద నిలబడే చరిత్ర ఏనాడూ లేదు. 2024 ఎన్నికల సందర్భంగా ఒకవైపు మోదీ, మరోవైపు పవన్ కళ్యాణ్ నిలబడి చంద్రబాబు ఇస్తున్న హామీలను మేమే సాక్ష్యం అంటూ మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోతే తాము బాద్యత తీసుకుంటామని బీజేపీ నాయకత్వం, పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇసుక దోపిడీ, కాంట్రాక్ట్ లను బలవంతంగా తీసుకోవడం, కమిషన్లు అందుకోవడం, క్షేత్రస్థాయిలో వ్యవస్థలను లంచాల మయంగా మార్చేశారు. లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానన్న చంద్రబాబు యువతను నిలువునా మోసం చేశారు. ఈ రాష్ట్రంను డ్రగ్స్, గంజాయికి అడ్డాగా మార్చేశారు. రాజధాని నిర్మాణానికి పదిహేడు వేల కోట్లరూపాయలు, పోలవరం నిర్మాణానికి రూ.2348 కోట్లు, స్టీల్ ఫ్యాక్టరీకి రూ.3290 కోట్లు వచ్చాయని చంద్రబాబు ప్రకటించారు. ఇవ్వన్నీ కలిపితే దాదాపు రూ.25వేల కోట్ల డబ్బు వచ్చింది. పోలవరం, రాజధానిలో ఏ నిర్మాణాలు జరుగుతున్నాయి, దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో బహిరంగ పరచాలని డిమాండ్ చేస్తున్నాం. తొమ్మిది నెలల కాలంలో హామీలను నెరవేర్చలేదు. మరోవైపు గతంతో వైయస్ జగన్ గారు అమలు చేసిన పథకాలను నిలిపివేశారు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరమే లేదంటున్నారు. వైయస్ఆర్సీపీ హయాంలో అనేక పథకాలను ప్రకటించి, వాటిని తూచా తప్పకుండా అమలు చేశాం. పేదలకు రూ.2.73 లక్షల కోట్లను డీబీటీ ద్వారా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశాం. ఈ రోజు బటన్ నొక్కడంను చంద్రబాబు ఎద్దేవా చేస్తున్నారు. ఇలా పేదలకు సంక్షేమం ఇవ్వడం తప్పు అని ప్రకటిస్తున్నారా? ఈ విధానమే తప్పు అయితే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ఎలా ప్రకటించారో చెప్పాలి. వైయస్ జగన్ గారి 2.0 వస్తుందంటే దానిపైనా కారుకూతలు కూస్తున్నారు. ఈ రాష్ట్రంలో పేదవర్గాలకు సంక్షేమ ప్రధాత వైయస్ జగన్. ఆయనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి చంద్రబాబుకు అర్హత లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల గురించి కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచక పాలన చేస్తున్నారు. అధికారం శాశ్వతం అని చంద్రబాబు అనుకుంటున్నారని సుధాకర్బాబు చురకలంటించారు.