వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్‌గా పని చేస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌

ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పని చేయాలి

భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు కొత్త ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తుందని ఆశిస్తున్నాం

విశాఖపట్నం: మేం ప్రజలకు అండగా ఉంటాం వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్‌గా పని చేస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వానికి సమయమిస్తాం... ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాల‌ని డిమాండు చేశారు. ప్రజల పక్షాన పోరాటాలకు మేం ఎప్పుడూ సిద్ధమేనని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని.. కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పని చేయాలన్నారు

చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి.. వీటిపై కొత్త ప్రభుత్వం ఆలోచించాలి.. ఈ దాడులు ప్రజాస్వామ్యం కాదు. గెలిచిన వారు బలవంతులు కాదు.. ఓడిన వారు బలహీనులు కాద‌న్నారు . సీఎం వైయ‌స్ జగన్‌ ఎప్పుడూ అందరిని సమానంగా చూడాలన్న భావంతో పని చేశార‌ని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

ప్రజలకు ఇంటి దగ్గరికే పథకాలు వచ్చేలా చేశారు. గాజువాక అభివృద్ధి కోసం గెలిచిన అభ్యర్థికి సహకరిస్తా. ఏపీకి విశాఖ కీలకం.. ఆ విషయంలో కూటమి దృష్టి పెట్టాలి విశాఖ నగరానికి ఉన్న అంశాలు, అవకాశాల్ని కూటమి గుర్తించాలి. రామయ్య పట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టు పనులు అఖరి దశకు వచ్చాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ఈ కొత్త ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తుందని ఆశిస్తున్నాం. అమరావతి వద్దు.. విశాఖ ఒకటే అనలేదు. విశాఖతో పాటు కర్నూలు, అమరావతిని అభివృద్ధి చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం చెప్పింది’’ అని గుడివాడ అమర్‌నాథ్‌ గుర్తు చేశారు. 

Back to Top