తాడేపల్లి : మాజీ ఎంపీ నందిగం సురేష్ కుటుంబానికి వైయస్ జగన్ అండగా నిలిచారని, దానికే టీడీపీ నేతలు గావుకేకలు పెడుతున్నారని వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబు అయితే ఏకంగా.. ఒక ముద్దాయిని చూడడానికి జైలుకు వెళ్లారని వైయస్ జగన్ను ఉద్దేశించి అంటున్నారు. ఒక దళిత నేతను పరామర్శించడానికి వెళ్తే అంత చులకనా? అంటూ దుయ్యబట్టారు. ఏం గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లలేదా?. దళితులంటే మొదటి నుంచి చంద్రబాబుకి చిన్నచూపు. అందుకే అలా మాట్లాడారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అరాచకాలతో దరిద్రమైన పరిపాలన సాగుతుందోని ఫైర్ అయ్యారు. అక్రమంగా అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్ను వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ, దాని అనుకూల మీడియా తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ పరిణామాలపై తాడేపల్లిలో మేరుగ స్పందించారు. మేరుగ నాగార్జున ఏమన్నారంటే.. నాలుగేళ్ల క్రితం నాటి కేసులో తమ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, దళితనేత నందిగం సురేష్ను అక్రమంగా అరెస్టు చేసి, జైల్లో పెట్టారని, ఆయన్ను తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పరామర్శించడంలో తప్పేమిటని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. దీనిపై సీఎం చంద్రబాబుతో పాటు, పలువురు మంత్రులు గావుకేక పెడుతున్నారన్న ఆయన, చంద్రబాబుకు అసలు దళితులంటే ఎందుకంత చులకన అని నిలదీశారు. చంద్రబాబు ఇప్పటికీ అంటరానితనాన్ని, అస్పృశ్యతనూ ప్రోత్సహిస్తున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు ఇకనైనా అనైతిక, నీచ రాజకీయాలు మానాలని, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగించాలని మేరుగ నాగార్జున హితవు చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు కొట్టుకొచ్చింది ఐదు బోట్లయితే, మూడే అని చంద్రబాబు చెబుతున్నారని గుర్తు చేసిన ఆయన, మిగిలిన రెండు బోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ బోట్ల యజమానులంటూ అరెస్టు చేసిన ఉషాద్రి, కోమటి రామ్మోహన్తో పాటు, మరో బోటు యజమాని ఆలూరి చిన్నా.. వీరంతా టీడీపీకి చెందిన వారేనని.. అయినా తమ పార్టీకి చెందిన వారని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. పల్నాడు ప్రాంతంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందన్న మేరుగ నాగార్జున.. పిడుగురాళ్ళ ప్రాంతంలో తమ పార్టీ సోషల్ మీడియాలో చురుకుగా పని చేస్తున్న షేక్ మాబు, వెన్నా రాజశేఖర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని హింసించడంతో పాటు, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమని దుయ్యబట్టారు.