విజయవాడ: ఎన్నికలు వస్తున్నాయి.. రాజకీయ లబ్ధిపొందాలనే రాష్ట్ర ప్రభుత్వంపై అమిత్ షా ఆరోపణలు చేస్తున్నారని, టీడీపీ మాటలనే బీజేపీ చెబుతోందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే కడుపుమంటతోనే ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చిన వారు ఒక విజన్తో మాట్లాడాలన్నారు. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని బీజేపీ పెద్దలను ప్రశ్నించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాష్ట్ర హక్కు అని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే కేంద్రం నుంచి ఏపీకి కూడా నిధులు ఇస్తున్నారన్నారు. ఏపీకి కేంద్రం అదనంగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. విభజన హామీలు అమలు చేయాలని నాలుగేళ్లుగా వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అడుగుతోందని గుర్తుచేశారు. తమకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.