అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ సగం జనాభాకు సాగు, తాగునీటి కష్టాలు ఉండవు. సీమకు పారించి సస్యశ్యామలం చేసేంత వరద నీటి సామర్థ్యం పోలవరం సొంతం. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్ట్ పూర్తికావాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ. పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించగా.. ఇప్పుడు ఆయన కుమారుడు సీఎం వైయస్ జగన్ పూర్తి చేస్తున్నారు. మధ్యలో వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడనేది నగ్న సత్యంగా ప్రధాని మోడీ వ్యాఖ్యలు చెబుతున్నాయి. 2018 నాటికి పోలవరం పూర్తిచేస్తామని అసెంబ్లీలో నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా తొడలు, జబ్బలు చరుచుకొని సవాళ్ల విసిరాడు. కానీ, టీడీపీ అధికారంలో నుంచి దిగిపోయే నాటికి కూడా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయారు. మొన్నటి ఎన్నికల వేళ దేశ ప్రధాని మోడీ తనకు తానుగా చంద్రబాబు ప్రభుత్వం పోలవరంను ఏటీఎంలా వాడేసిందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండేవి. ఇప్పుడు వైయస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. పోలవరం ప్రాజెక్టు దక్కించుకున్న మేఘా వాయువేగంతో పనులు చేపడుతోంది. కరోనా కష్టకాంలోనూ, వరదలు ముంచెత్తినా పనులు మాత్రం చకచకా సాగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే యూనిక్యూ మెషీన్లను పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మేఘా సంస్థ వాడుతూ పూర్తి చేస్తోంది. నాణ్యతలో రాజీ పడకుండా, డెడ్ లైన్ లోపల ప్రాజెక్ట్ పూర్తి చేయాలని పట్టుదలతో ప్రభుత్వం ముందుకెళుతోంది. పోలవరం పనులను చంద్రబాబు సర్కార్ నత్తకు నడకనేర్పేలా చేస్తే.. ఇప్పుడు సీఎం వైయస్ జగన్ ఆ ప్రాజెక్ట్ పనులను చిరుత వేగంతో పూర్తి చేస్తోంది. ఈ ఇద్దరి పాలనకు పోలవరం పనుల పూర్తే మచ్చుతునక అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. నక్కకు నాగలోకానికి అంత తేడా ఉందని అంటున్నారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ సంవత్సర కాలంలో స్పిల్ వే పనులను శరవేగంతో పూర్తి చేస్తోంది. గతంలో పియర్స్ ఎత్తు సరాసరి 28 మీటర్లు ఉంటే.. ఇప్పుడు 52 మీటర్లుకు నిర్మాణం పూర్తి కావడం విశేషం. ఇప్పటికే 171 గడ్డర్లు నిర్మాణం పూర్తి అయ్యింది. గడ్డర్లు నిర్మాణం పూర్తి అవ్వడమే కాకుండా దాదాపు 84 గడ్డర్లును స్పిల్ వే పియర్స్పై పెట్టి ప్రాజెక్ట్ను పట్టాలెక్కించింది. 10పియర్స్పై బ్రిడ్జి శ్లాబు నిర్మాణం దాదాపు 250మీటర్లు పూర్తయింది. మిగతా పియర్స్ మీద గడ్డర్ల ఏర్పాటుతో పాటు, షట్టరింగ్ వర్క్, స్టీల్ అమరిక ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గేట్లు ఏర్పాటులో కీలకమైన ట్రూనియన్ భీంల నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 20 ట్రూనియన్ భీంల నిర్మాణం పూర్తయ్యింది. పూర్తి అయిన ట్రూనియన్ భీంల దగ్గర గేట్లు ఏర్పాటుకు సంబంధించిన ప్రిలిమినరీ పనులు జరుగుతున్నాయి. స్పిల్వేలో ఇప్పటి వరకు 1,94,944 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్పిల్ ఛానెల్లో 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని,10,64,417 క్యూబిక్ మీటర్లు మట్టితవ్వకం పనులు ఇప్పటివరకు పూర్తయ్యాయి. జూన్ నుండి స్పిల్ ఛానెల్లోకి వరద నీరు రావటంతో పనులు నిలిచిపోయాయి. వరద నీరు తోడటం ప్రారంభించి త్వరలోనే మట్టి తవ్వకం పనులు,కాంక్రీట్ పనులు ప్రారంభించనున్నారు. ఈ సీజన్ లో పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించారు. గ్యాప్–1 ఢయా ఫ్రంవాల్ నిర్మాణ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. 2కాలమ్స్ నిర్మాణ పనులు కూడా పూర్తి అయ్యాయి. గ్యాప్–3లో మట్టి తవ్వకం పనులు,కొండ రాయి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. కీలకమైన 902 కొండ తవ్వకం పనులను 1,88,623 క్యూబిక్ మీటర్లు పూర్తి అయ్యాయి. వరదల వల్ల పాడైపోయిన ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులును సైతం వేగం చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. కరోనా కరువు కాలంలో.. గోదావరి ఉగ్రరూపంతో పొంగుతున్న సమయంలోనూ ఏపీ ప్రభుత్వం, మేఘా సంస్థ పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తుండడం విశేషంగా మారింది. గడువులోపు పూర్తి చేసి తరతరాల నిర్లక్ష్యానికి చెక్ పెట్టాలని యోచిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పట్టుదలతో ఏపీ ప్రజల చిరకాల వాంచ, కలల ప్రాజెక్ట్ పూర్తి అవుతోంది. నవ్విన నాపచేనే పండు అన్నట్టుగా టీడీపీ ఏ నోటితోనైతే విమర్శలు గుప్పించారో ఇప్పుడు అదే నోటితో పొగడాల్సిన రోజు రాబోతోంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి రెడీ అవుతోంది.