ఎంపీ మిథున్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డిలపై ఆంక్షలు

ఎంపీ మిథున్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డిలపై ఆంక్షలు

నియోజకవర్గంలో పర్యటించడానికి వీల్లేదన్న పోలీసులు

పెద్దిరెడ్డి నివాసం గోడలు దూకి హడావుడి 

వకుళమాత ఆలయానికి కూడా వెళ్లనివ్వని వైనం

ఇది కక్ష సాధింపు: ఎంపీ మిథున్‌రెడ్డి

తిరుపతి: రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిని ఆ నియోజక­వర్గంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకుంటు­న్నారు. శాంతి భద్రతల పేరుతో వారి పర్యట­న­లకు అడ్డు చెబుతున్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొ­నడంతో పాటు కూటమి నేతల దాడుల్లో నష్ట­పోయి­న వారిని పరామర్శించి, భరోసా కల్పించా­లని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నిర్ణయించారు.
ఆది­వా­రం పార్ల­మెంట్‌ సమావేశాలు ఉండవు కాబట్టి  ఢిల్లీ నుంచి తిరు­పతి చేరుకున్నారు. ఇక్కడి నుంచి పుంగనూ­రుకు వెళ్లే సమయంలో పోలీ­సులు ఆదివారం ఆయన నివాసానికి చేరు­కుని అక్కడికి వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఎంపీకి నోటీసులు ఇచ్చేందుకు గోడలు దూకి హడావుడి చేశారు. తిరు­పతిలోని వకుళామాత ఆల­యానికి కూడా వెళ్లడానికి వీలు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ­చంద్రారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

పర్యటిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తు­తు­ందని సాకు చెప్పారు. అంతటితో ఆగని పోలీ­సులు.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలి­సేందుకు వచ్చిన నియోజక­వర్గ ప్రజలను సైతం లోనికి రానివ్వకుండా అడ్డుకు­న్నారు. వంద మీటర్ల దూరంలో బారి­కేడ్లు ఏర్పాటు చేసి, పెద్దిరెడ్డి నివాసంలోకి ఎవరూ వెళ్లేందుకు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మె­ల్యేలు ప్రజలను కలిసేందుకు కూడా ఒప్పు­కోలేదు. ఇదే సమయంలో పుంగనూరు నియోజక­వర్గంలోని వివిధ మండలాల్లో పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నేత­లను అదుపులోకి తీసుకు­న్నారు. తమ ఆదేశాలను పాటించకపోతే కేసులు పెడతామని బెదిరించారు.  

నా నియోజకవర్గానికి నేను వెళ్లకూడదా?
ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, గతంలో ఎన్నడూ లేని సంస్కృతికి తెరలేపారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభు­త్వంపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందన్నారు. నియోజకవర్గంలో ఎలక్ట్రికల్‌ బస్సు కంపెనీ రాకుండా, పెట్టుబ­డు­లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పుంగనూరుకు ఏ పరి­శ్ర­మలు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజక వర్గంలో పర్యటించకుండా, ప్రజల్ని కలవకుండా అడ్డుకోవడం దారుణమని మండి­పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఆస్తు­లను ధ్వంసం చేస్తున్నారని ధ్వజమె­త్తారు. జేసీ­బీలు తీసుకొచ్చి వైయ‌స్ఆర్‌సీపీ నాయ­కుల మామిడి తోటలు, ఆస్తులు, కుటుంబ సభ్యుల వాహనాలను ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

నియో­జకవర్గంలో పేదల ఆవులు కూడా ఎత్తుకెళ్లి­పో­తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం. కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణం. మా వారిని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? నా నియోజకవర్గంలో నేను పర్యటించకూడదా? ఈ విషయాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వైయ‌స్ఆర్‌సీపీకి 40 శాతం మంది ఓటేశారని, వారందరినీ రాష్ట్రం నుంచి తరిమేస్తారా?’ అని నిప్పులు చెరిగారు.  

Back to Top