ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా మోసమే కనిపిస్తోంది 

మాడుగుల నియోజకవర్గ ప్ర‌జాప్ర‌తినిధుల స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  

ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నా మన ప్రభుత్వం సాకులు చూపలేదు

వచ్చే ఎన్నికల్లో మ‌నం చేసిన మంచే మనకు శ్రీరామ రక్ష 

చంద్ర‌బాబు పాల‌న‌లో ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి

ఇంగ్లిషు మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి

కష్టాలు ఎల్లకాలం ఉండవు.. చీకటి తర్వాత వెలుగు ఉంటుంది :  వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వం ప్రతి అడుగులో కూడా మోసమే కనిపిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని.. చివరకు ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నా మన ప్రభుత్వం సాకులు చూపలేదు. మాట తప్పుకుండా మేనిఫెస్టోనే అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాటకోసం కట్టుబడి పనిచేశాం. ప్రతి ఇంటికీ మించి చేశాం. చేసిన మంచి ఎక్కడికీ పోదు. వచ్చే ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే మనకు శ్రీరామ రక్ష.

బాబు బిర్యానీ పెడ‌తాన‌ని మోసం..
 చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయి. వైయ‌స్ జగన్‌ పలావు ఇచ్చాడు బాగానే చూసుకున్నాడని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. పలావు లేదు.. బిర్యానీ లేదు ఇప్పుడు. ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి.

వైయ‌స్ జగనే ఉండి ఉంటే.. 
రాష్ట్రంలో చ‌ర్చ మొద‌లైంది. వైయ‌స్ జ‌గ‌న్ ఉండి ఉంటే ఇప్ప‌టికే రైతు భరోసా అందేది. స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లాడీ తల్లులకు అమ్మ ఒడి అందేది. సున్నావడ్డీ కూడా వచ్చి ఉండేది. విద్యాదీవెన కింద ఫీజురియింబర్స్‌ మెంట్‌, వసతి దీవెన వచ్చేది. మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేది. చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఈసరికే పడి ఉండేది. ఆగస్టు నెలాఖరు లోపల ప్రతి ఏటా ఇవి మనం ఇచ్చాం. సహజంగానే పథకాలు అమలు జరిగింది. ఇప్పుడు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం లేకపోవడతో ఇవేమీ రావడం లేదు. ఇంటికే వచ్చి పథకాలు అందించే పరిస్థితి పోయింది. జన్మభూమి కమిటీలు చుట్టూ, తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.

ఉచిత బీమా ఊసే లేదు
రైతులందరికీ కూడా ఉచితంగా బీమా ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఉచిత పంటల బీమా ప్రీమియం కట్టడం లేదు. 2023-24 సంబంధించి ఏప్రిల్‌, మేలో ప్రీమియం కట్టేవాళ్లం. జూన్‌లో ఇన్సూరెన్స్‌ డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఇచ్చేవాళ్లం. పెట్టుబడులకు రైతులకు సహాయంగా ఉండేది. ఇప్పుడు అదీ పోయింది. చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా మోసం కనిపిస్తోంది.

రెడ్‌బుక్ పాల‌న‌..
స్కూళ్లలో టోఫెల్‌ పీరియడ్‌ తీసేశారు. ప్రపంచంతో పోటీపడేలా చదువులను నిర్వీర్యం చేస్తున్నారు. విద్యాకానుక పంపిణీకూడా అస్తవ్యస్తం. ట్యాబులు కూడా ఇస్తారన్న నమ్మకం లేదు. మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజూ ఒక మెనూ కూడా అస్తవ్యస్తం. ఇంగ్లిషు మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి. ఆరోగ్య శ్రీ కింద ఒక్కపైసా ఇవ్వడంలేదు. ఇప్పటికే రూ.1600 కోట్ల బకాయిలు. లా అండ్‌ ఆర్డర్‌ కూడా పూర్తిగా దిగజారిపోయింది. రెడ్‌బుక్‌ పాలన నడుస్తోంది. కక్షలు తీర్చుకునేవారిని పోత్సహించేలా చంద్రబాబు తీరు ఉంది.

 మళ్లీ మన పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుంది..
 ఈ మోసాలను చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోంది. మళ్లీ మన పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుంది. ఎందుకంటే మనం మోసం చేయలేదు, ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు. ఐదేళ్లలో వేధింపులకు గురిచేస్తారు. కష్టాలు కూడా ఉంటాయి. నా పరిస్థితులే దీనికి ఉదాహరణ. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. కాని కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుగు ఉంటుంది. ఇది సృష్టిసహజం. అలాగే ఈ ఐదేళ్లుకూడా ముగుస్తాయి, మనమే అధికారంలోకి వస్తాం. విలువలు, విశ్వసనీయతమీదే మనం రాజకీయాలు చేస్తున్నాం. మోసాలకు, అబద్ధాలకు చంద్రబాబునాయుడు, టీడీపీ పార్టీ అలవాటు పడింది అని వైయ‌స్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.

Back to Top