ప్రతి అడుగులోనూ చంద్రబాబు మోసం

మాజీ సీఎం  వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నెన్నో ఆశలు

ఆ తర్వాత ప్రజలకు యథేచ్ఛగా మోసం

మన ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంక్షోభం

అయినా ఏనాడూ సాకులు చూపలేదు

మాట తప్పుకుండా మేనిఫెస్టో అమలు చేశాం

వైయస్‌ జగన్‌ వెల్లడి

మనం చేసిన మంచి ఇవాళ్టికి ప్రతి ఇంట్లో ఉంది

అందుకే మనం ధైర్యంగా తలెత్తుకుని తిరగ్గలం

మన పార్టీ నాయకుడు, కార్యకర్త ప్రతి గ్రామం పోగలడు 

చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారు

హామీలు అమలు చేయకుండా సాకులు చెబుతున్నారు

రెండున్నర నెలల్లోనే ప్రభుత్వం వ్యతిరేకత కనిపిస్తోంది

విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడాల్సి వస్తోంది 

ఇ–క్రాప్, ఉచిత పంటల బీమా లేకుండా పోయాయి

శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి

గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు పెంచుతున్నారు

ఏదీ శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుతురు తప్పదు

మనం తప్పకుండా అధికారంలోకి వస్తాం. సేవ చేస్తాం

మాజీ సీఎం వైయస్‌ జగన్‌ సంపూర్ణ విశ్వాసం

తాడేపల్లి: ప్రతి అడుగులోనూ చంద్రబాబు మోసం క‌నిపిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం  వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలతో మాజీ సీఎం వైయస్‌ జగన్‌ సమావేశమ‌య్యారు. తొలుత మాడుగుల నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైయస్‌ జగన్, ఆ తర్వాత అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో మాట్లాడారు.

చంద్రబాబు మోసం:
    గత ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నెన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు వాటిలో ఏవీ అమలు చేయకుండా, ఏవేవో కారణాలు చెబుతున్నారు. సాకులు చూపుతున్నారు. అది చంద్రబాబుగారి నైజం. మోసం చేయడం ఆయనకు ఎప్పుడూ అలవాటు.

మనం సాకులు చెప్పలేదు:
    మన ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నా మనం సాకులు చూపలేదు. మాట తప్పకుండా మేనిఫెస్టో అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పని చేశాం. కోవిడ్‌ మహమ్మారి రెండేళ్లు రాష్ట్రాన్ని పీడించినా, పథకాలు దాటేయాలని ఆలోచించలేదు. క్యాలెండర్‌ ప్రకటించి అన్నీ అమలు చేశాం.

ధైర్యంగా వెళ్లగలం:
    అలా అన్నీ చేశాం కాబట్టే.. ఇవాల్టికి కూడా మన పార్టీ ప్రతి నాయకుడు, కార్యకర్త తలెత్తుకుని ధైర్యంగా ప్రతి గ్రామానికీ పోగలుగుతాడు. మనం చేసిన మంచి ఇవాళ్టికీ ప్రతి ఇంట్లో ఉంది. 
    ఆ ధైర్యం చంద్రబాబులో, ఆయన పార్టీలో కనిపించదు. ఎందుకంటే, ఓట్లు అడిగేటప్పుడు నీకు రూ.15 వేలు, నీకు రూ.18 వేలు సంతోషమా? అంటూ ప్రచారం చేశారు. యువకులు కనిపిస్తే.. నీకు రూ.3 వేల నిరుద్యోగభృతి అన్నారు. అవ్వాతాత కనిపిస్తే నీకు నెలకు రూ.4 వేలు ఇస్తాం. సంతోషమా? అంటూ ఎవరు కనిపిస్తే వారికి వాగ్దానాలు చేశారు.

ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత:
    జగన్‌ బాగానే చూసుకున్నాడు. జగన్‌ కన్నా చంద్రబాబు వయసులో పెద్దవాడు కదా.. జగన్‌ పలావు పెట్టాడంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కాస్తా కూస్తో మోసపోయి అటు వైపు వెళ్లారు. కేవలం రెండున్నర నెలల్లోనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంటికే వచ్చే పెన్షన్‌ విధానం పోయింది. ఇంటికే వచ్చే రేషన్‌ విధానం పోయింది. మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఇ–క్రాప్, ఉచిత పంటల బీమా పోయింది. శాంతి భద్రతలు నీరుగారిపోయాయి. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు పెంచుతున్నారు.
    చేసిన మంచి ఎక్కడికీ పోదు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే మనకు శ్రీరామ రక్ష. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారి తీస్తాయి. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు పలావు లేదు. బిర్యానీ లేదు. పస్తులుండాల్సిన పరిస్థితి.

వైయస్ జగన్‌ ఉండి ఉంటే..:
    ఇప్పుడు అదే వైయస్ జగన్‌ ఉండి ఉంటే.. రైతు భరోసా అందేది. రైతుభరోసా డబ్బులతో రైతులందరూ చక్కగా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవారు. స్కూళ్లకు వెళ్తున్న పిల్లల తల్లులకు అమ్మ ఒడి అందేది. అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపించేది. వారికి సున్నా వడ్డీ ప్రయోజనం అంది ఉండేది. విద్యాదీవెన కింద ప్రతి పిల్లాడికి మూడు నెలలకోసారి ఆర్థిక సాయం అందేది. వసతి దీవెన వచ్చేది. మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేవి. చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఇప్పటికే జమ అయి ఉండేది. 
    ఇంకా రైతులకు ఉచిత పంటల బీమా అమలై ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రీమియం కట్టడం లేదు. గతంలో ఏప్రిల్, మేలో ప్రీమియం కట్టేవాళ్లం. జూన్‌లో వ్యవసాయ పనులు మొదలయ్యేసరికి ఇన్సూరెన్స్‌ డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఇచ్చేవాళ్లం. పెట్టుబడులకు రైతులకు సహాయంగా ఉండేది. ఇప్పుడు అదీ పోయింది. 
    అవేవీ ఇవ్వకుండా చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో మోసం కనిపిస్తోంది. జన్మభూమి కమిటీల చుట్టూ, టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ రెండు నెలల్లోనే కనిపిస్తున్నాయి. 

విద్యావ్యవస్థ దారుణం: 
    ప్రభుత్వ బడుల్లో టోఫెల్‌ పీరియడ్‌ తీసేశారు. పిల్లలందరూ గొప్పగా ఇంగ్లిషు చదువుకుని ఏకంగా ప్రపంచంతో పోటీ పడేలా  చదువులు ఉన్న పరిస్థితులను, కూటమి ప్రభుత్వం రాగానే నిర్వీర్యం చేస్తున్నారు. ఇంగ్లిషు మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి ఉంది.  విద్యాకానుక పంపిణీ కూడా అస్తవ్యస్తం. ట్యాబ్‌లు ఇస్తారన్న నమ్మకం లేదు. గోరుముద్ద (మధ్యాహ్న భోజనం) మెనూ కూడా అస్తవ్యస్తంగా మారింది.

అంతా అస్తవ్యస్తం:
    ఆరోగ్యశ్రీ కింద ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇప్పటికే రూ.1600 కోట్ల బకాయిలు ఉన్నాయి. మార్చిలో ఎన్నికల కోడ్‌ రావడంతో.. బిల్లులు ఆపాల్సి వచ్చింది. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీకి ఒక్క రూపాయి ఇవ్వలేదు. 
    వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిపాలన, ఇంటికే అందే డెలివరీ మెకానిజమ్‌తో పాటు, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏకంగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. కక్షలు తీర్చుకునే వారిని ప్రోత్సహించేలా చంద్రబాబు తీరు ఉంది. ఈ మోసాలు చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోంది.

మన విజయం తథ్యం:
    మళ్లీ మన పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే మనం ఎవరినీ మోసం చేయలేదు. ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు. ఈ ఐదేళ్లలో వేధింపులకు గురి చేస్తారు. కష్టాలు కూడా ఉంటాయి. నా పరిస్థితులే దీనికి ఉదాహరణ. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. అటువంటి కష్టాలు నేను చూశాను.
    కానీ కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుతురు కచ్చితంగా వస్తుంది. ఇది çసృష్టి సహజం. రాత్రి తర్వాత పగలు వస్తుంది.  అలాగే ఈ ఐదేళ్లు కూడా ముగుస్తాయి. మనమే అధికారంలోకి వస్తాం. మన ప్రభుత్వంలో మరలా మీరు, నేను ప్రజలకు సేవ చేసే గొప్ప పరిస్థితుల్లో అందరం ఉంటాం. ఇది కచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకొండి. 
    మోసాలకు, అబద్ధాలకు చంద్రబాబునాయుడు, టీడీపీ అలవాటు పడింది. అదే మనం విలువలు, విశ్వసనీయత మీదే రాజకీయాలు చేస్తున్నాం. అందుకే తప్పక మంచి రోజులు వస్తాయి.

Back to Top