చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి

సీఎం చంద్రబాబుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హెచ్చరిక

ఎల్లకాలం రోజులు మీవేంకావు

దాడుల సంస్కృతికి ఫుల్‌ స్టాప్‌ పెట్టకపోతే రియాక్షన్‌ కూడా ఉంటుంది

ఓవైపు విధ్వంసం, దాడులు చేస్తూ తిరిగి తప్పుడు కేసులుపెట్టడం 

ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌ బుక్కులు చూపిస్తూ విధ్వంసాలకు పాల్పడుతున్నారు 

ఓటు వేయలేదన్న కారణంతో దాడులు చేస్తున్నారు, ఆస్తులకు నష్టం చేకూరుస్తున్నారు.

చంద్రబాబు కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలి.

భ‌యాందోళనలతో నడిపే రాజకీయాలు తాత్కాలికం.

చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయం.. ఒక బీజంలా ఇవాళ నాటుకుంది. అది రేపు చెట్టవుతుంది. టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఇలాంటి పరిస్థితులనే చూడాల్సి వస్తుంది.

నాయకులుగా ఉండేవారు తప్పును, తప్పుగా చెప్పాలి.

ఆస్తులు ధ్వంసం చేస్తూ, మనుషులను కొడుతూ దౌర్జన్యాలు చేస్తున్నా పోలీసుల ప్రేక్షక పాత్ర

ఎన్నికల్లోఇచ్చిన హామీలు అమలు, పరిపాలనపై దృష్టిపెట్టండి

తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డలకు రూ.1500 ఇవ్వడంపై దృష్టి పెట్టండి

చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేలా హామీలు ఇచ్చారు 

మా పాలనలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు

ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు డోర్‌ డెలివరీ చేసిన చరిత్ర వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వానిది

కారంపూడి ఘటనలో సీఐకి పిన్నెల్లి తటస్థేపడలేదు. హత్యాయత్నం కేసు ఎలా పెడతారు?

మే 14న ఘటన జరిగితే 9 రోజుల తర్వాత మే 23న కేసు పెట్టడం దేనికి నిదర్శనం.

పాల్వాయి గేటు వద్ద జరిగిన ఈవీఎం అంశంలోకూడా తప్పుడు కేసులు పెట్టారు.

నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని, దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టకపోతే రియాక్షన్‌ కూడా అదే స్థాయిలో ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆస్తులు ధ్వంసం చేస్తూ తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇది ఏ మాత్రం న్యాయం కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, మంచి పాలన అందించడంలో చంద్రబాబు దృష్టిపెడితే మంచిదన్నారు. నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైయస్‌ జగన్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే... 

రాష్ట్రంలో విధ్వంస పాలన
’’ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస చర్యలు జరుగుతున్నాయి. కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదు అన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. వీళ్లే కొడతారు, మళ్లీ వీళ్లే అటువైపున ఉన్న వారి మీద కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు. ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైయస్సార్‌ సీపీ పరిపాలనలో ఉండగా కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకం, ప్రతి మంచీ కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికీ డోర్‌ డెలివరీ చేశాం. 
ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయలేదనే కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి గారి విగ్రహాలను విరగ్గొడుతున్నారు, పగలగొడుతున్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల మాదిరిగా పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ప్రజల దగ్గరకు వెళ్లి ఫలాన మంచి చేశాం కాబట్టి ఓటు వేయండి అనే పరిస్థితులు ఉండాలి. కానీ ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, అన్యాయమైన కేసులు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, భయాందోళనలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తే, అలాంటి రాజకీయం ఏ రోజూ నిలబడదు. తాత్కాలిక మేలు ఏదైనా జరగుతుందేమో కానీ తర్వాత ఓటు వేసేటప్పుడు ప్రజలు ఇవన్నీ కచ్చితంగా గుర్తుపెట్టుకుని, లెక్కాజమా చేసి చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబులో మార్పు రావాలని తెలియజేస్తున్నా. 

ప్రజలు మీకు ఓటు వేసింది ఎందుకు?
ప్రజలు ఎందుకు మీకు ఓటు వేశారు అని చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ప్రజలకు మంచి చేసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆకర్షితులై, ఆ 10 శాతం ఓట్లు అటు షిఫ్ట్‌ అయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మేనిఫెస్టోలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి  రూ.20 వేలు ఇస్తానన్నాడు. ఖరీఫ్‌లో జోరుగా వ్యవసాయం పనులు జరుగుతున్నాయి. రైతన్నలు పంటలు వేగంగా వేస్తున్నారు. ఇంత వరకు రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానన్న దానికి అతీగతీ లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మ ఒడి కింద జగన్‌ రూ.15 వేలు ఐదేళ్లపాటు ఇచ్చాడు. కాని, చంద్రబాబు నాయుడు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాడని, ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు ఇస్తాడని చెప్పారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా బడి ఈడు పిల్లలున్నారు. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతోంది. తల్లికి వందనం కింద ఆ డబ్బులేమయ్యాయి అని అడుగుతున్నారు. గవర్నెన్స్‌ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు డబ్బులిచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు రూ.20 వేలు ఇచ్చే కార్యక్రమం చూడండి. 18 ఏళ్లు పైబడిన ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.1500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2.10 కోట్ల మంది మహిళా ఓటర్లే. అందరూ 18 సంవత్సరాలు నిండిన వారే. వీరందరూ కూడా ఈరోజు అడుగుతున్నారు. ప్రతి నెలా రూ.1500 ఇస్తానన్నావు, ఏమైంది? అని అడుగుతున్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. ఇవేవీ కూడా చేయకుండా కేవలం భయాందోళనలు నెలకొల్పాలి, రాష్ట్రంలో రావణకాష్టం సృష్టించాలి, దొంగ కేసులు పెట్టి ఇరికించాలి, ఆస్తులను ధ్వంసం చేయాలి, వైయస్‌ఆర్‌ సీపీ అభిమానులు, కార్యకర్తలు, వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరినీ ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం. 

రెడ్‌ బుక్‌లు పెట్టుకుని ఆస్తుల ధ్వంసం
ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల స్థాయిలో రెడ్‌ బుక్స్‌ అని చెప్పి పెట్టుకుని ఉన్నారు. చంద్రబాబు స్థాయిలో ఒక రెడ్‌ బుక్, లోకేష్‌ స్థాయిలో ఒక రెడ్‌ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఇలా రెడ్‌ బుక్కులు పెట్టుకుని ఏం చేస్తున్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తోంది. కానీ ఎవరూ మాట్లాడటం లేదు. దొంగ కేసులు పెడుతున్నారు. చీనీ చెట్లు నరికేస్తున్నారు. జేసీబీలు, ప్రొక్లెయిన్ల మీద స్వయంగా ఎమ్మెల్యేలు తిష్ట వేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. 

ఇంతటి దారుణంగా చేస్తున్నారంటే.. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు.. రోజులు మీవే ఉండవు చంద్రబాబూ.. అది గుర్తు పెట్టుకో. మీ పాపాలు వేగంగా పండుతున్నాయి. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితి వస్తుంది. కచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు కూడా ఉంటాయి. చేతనైతే ప్రజలకు మంచి చేయండి, ప్రజల మనసులు గెలుచుకుని చిరస్థాయిగా నిలబడేలా పాలన చేయండి. కానీ ఈ తప్పుడు రాజకీయాలు మానండి. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతున్నావు. నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. రేప్పొద్దున మళ్లీ మీ గ్రామాల్లో, మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి, అటువంటి తప్పుడు సంప్రదాయాలు దయచేసి ఇప్పటికైనా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్లం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం దుర్మార్గం. దయచేసి దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టే కార్యక్రమం కచ్చితంగా చెయ్యండి చంద్రబాబూ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతుంటే మాత్రం ఎవరూ ఊరుకునేది జరగదు. రియాక్షన్‌ అనేది కచ్చితంగా ఉంటుంది. 

పిన్నెల్లిపై ఇంత అన్యాయమైన కక్ష సాధింపా?
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా 307 అంటే హత్యాయత్నం కేసు పెట్టారు. ఏరకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించారో చూస్తున్నాం. కారంపూడి ఘటన జరిగిందెప్పుడు? ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు అంటే మే 14న. కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్లను పరామర్శించడానికి డీఎస్పీ అనుమతి తీసుకుని ఎమ్మెల్యే బయల్దేరాడు. ఎమ్మెల్యే కారెంపూడికి చేరుకోక మునుపే ఊరికి అటువైపున ఎస్సీ కుటుంబం ఇల్లు ఉంటే ఊర్లోకి ప్రవేశించకముందే ఎమ్మెల్యేను అడ్డగించారు. గొడవ టౌన్‌ లో జరుగుతుంటే పిన్నెల్లిని ఊరుబయటే అడ్డగించారు. నారాయణ స్వామి అనే సీఐని పిన్నెల్లి చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న జరిగితే 9 రోజుల తర్వాత అంటే మే 23న ఆయనకేదో జరిగింది అన్నట్లుగా ఆ సీఐ,  రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. ఆ సీన్లో లేని వ్యక్తిపై ఈ కేసు బనాయించారు. ఇది అన్యాయం కాదా? అసలు ఇన్సిడెంట్‌ నిజంగా జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగి ఉంటే మే 15న మెడికో లీగల్‌ కేసు ఎందుకు పెట్టలేదు. 17వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం సిట్‌ వేసింది. 17 నుంచి 20వ తేదీ వరకు పల్నాడు ప్రాంతంలో ఆ సిట్‌ బృందం తిరిగి ఘటనపై రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టులో ఎందుకు ఈ అంశం రాలేదు? మరి ఈ రకంగా హత్యాయత్నం కేసులో ఒక మనిషిని ఇరికించడం ధర్మమేనా? మే 13న ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్‌ అనే పోలింగ్‌ కేంద్రం దగ్గర ఎమ్మెల్యే వెళ్లినప్పుడు జరిగిన ఘటన మీద మరో కేసు పెట్టారు. అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది? అక్కడ ఉన్న ఎస్సీ సామాజికవర్గం వారు పోలింగ్‌ బూత్‌ లోకి వెళ్లి ఓటు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఆగ్రామానికి వెళ్లారు. ఆ పరిస్థితులను చూసి ఎస్పీకి 10 సార్లు ఫోన్‌ చేసినా కూడా స్పందించని పక్షంలో, కనీసం సీఐని, ఎస్సైని పంపించని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సెన్సిటివ్‌ బూత్‌ లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఘటన జరిగింది. ఆ ఈవీఎం పగలగొట్టిన కేసులో తనకు బెయిల్‌ వచ్చింది. కాని, ఎవరిపైనో హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టి ఇవాళ జైలుపాలు చేశారు. 
ఘటన జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున కేసులు పెట్టారు. రిగ్గింగ్‌ను అడ్డుకునే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేస్తే, హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా అటువంటిది జరిగి ఉంటే సిట్‌ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఇచ్చిన రిపోర్టులో చెప్పాలి కదా. 2009 నుంచి వరుసగా నాలుగుసార్లు పిన్నెల్లి గెలిచాడంటే మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంత వరకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణారెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఇదే కార్యక్రమాలు జరుగుతున్నాయి.’’ అని వైయస్‌ జగన్‌ అన్నారు.

Back to Top