తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ఏమన్నారంటే.. నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ గారి ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకూ తమ భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా ఒక్కడితో మొదలై, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది. అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధిని అందించింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్గా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. విలువలకు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన పార్టీ పట్ల, నా పట్ల నమ్మకంతో విశ్వాసంతో నాతో నడుస్తున్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు. #YSRCPFormationDay