వైయ‌స్ఆర్‌సీపీ జెండా మోసిన వాళ్లపై టీడీపీ దాడులు

గ‌వ‌ర్న‌ర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా? :  మాజీ మంత్రి పేర్ని నాని

పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశాం 

విజయవాడ: రాష్ట్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగింద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం రాష్ట్రంలో జ‌రిగిన దాడులు, అల్ల‌ర్ల‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ ఫిర్యాదు చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. అనంత‌రం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.  
వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా టీడీపీ దాడులు జరిపింద‌ని, బిహార్‌ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని పేర్ని నాని మండిపడ్డారు. బిహార్‌ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గూండాలు వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.

గ‌వ‌ర్న‌ర్ ఆశ్చ‌ర్య‌పోయారు:
నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు పేర్ని నాని. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వసం చేస్తున్నారని మండ్డారు.  టీడీపీ దాడులు చూసి గవర్నర్‌ కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని, 26 జిల్లాల్లోనూ మా లీగల్‌ టీమ్‌లు యాక్టివేట్‌ అయ్యాయని తెలిపారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ గుండాల దాడులతోపాటు.. పోలీసుల తీరుపై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.  గవర్నర్‌ను కలిసిన వాళ్లలో తాజా ఎంపీలు గురుమూర్తి, తనుజా, ఎమ్మెల్యేలు శివప్రసాద్, మత్యలింగం, విశ్వేశ్వర రాజు, పర్చూర్‌ నేత బాలాజీ ఉన్నారు

Back to Top