తాడేపల్లి: సోషల్ మీడియాపై కూటమి సర్కార్ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఒక్క వ్యక్తినే రెండుసార్లు అరెస్టు చేశారంటే..ఏ స్థాయిలో క్షక్షగట్టారో అర్థం చేసుకోవచ్చు. వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నాడనే కారణంతో ఇంటూరిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో ఇంటూరి రవికిరణ్ను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేయగా తాజాగా ఇవాళ మరోసారి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్న చంద్రబాబు సర్కార్కు భయపడేది లేదని, న్యాయపోరాటం చేస్తామని వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా సోల్జర్స్ పేర్కొంటున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజలను పిచ్చోళ్లుగా, ఏమీ ప్రశ్నించలేని అశక్తులుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే.. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలకు తూట్లు పొడిచారు. అధికారంలోకి వచ్చింది మొదలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైయస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అంతటితో ఆగకుండా అమాయక ప్రజలపై దాడులు చేయడం, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువయ్యాయి. ఈ నాలుగు నెలల్లోనే మహిళలపై 74 ఘటనలు జరిగాయి. వీటన్నింటిని ప్రశ్నిస్తున్న సాక్షి మీడియా గ్రూప్పై కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న యాక్టివిస్టులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. చంద్రబాబును ప్రశ్నించడమే పాపమా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు . ఏదైతేనేం... టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల సందర్భంగా కలిసికట్టుగా మేనిఫెస్టోనైతే ప్రకటించాయి. మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించినా ప్రభుత్వ భాగస్వామిగా బీజేపీకి కూడా బాధ్యత ప్పకుండా ఉంటుంది. అయితే ఏదో ఒకలా కూటమి అధికారంలోకైతే వచ్చింది కానీ.. అప్పటి నుంచే ఒక్కటొక్కటిగా హామీలకు తిలోదకాలు ఇవ్వడమూ మొదలైంది. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. మద్యం కొత్త పాలసీపై మహిళలు రోడ్డుపైకి వచ్చారు. ఇసుక కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది.