న్యూఢిల్లీ: సంపద సృష్టిస్తాం, అప్పులు చేయమని అధికారంలోకి వచ్చిన కూటమి.. వారాల్లోనే రూ. 7000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు అప్పులు తెచ్చేందుకు ఏర్పాట్లు చేసిందని, సంపద సృష్టించడం అంటే ఇదేనా..? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి అన్నారు. ఏ సంక్షేమమూ అమలు చేయకుండానే వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రయత్నాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. మరి ఐదేళ్లలో సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. `ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం కొలువుదీరి మరో నాలుగు రోజుల్లో నెల రోజులు పూర్తి కావొస్తుంది. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. రేపు పెన్షన్స్ కోసం కొంత వెసులుబాటు ప్రయత్నాలు చేస్తున్నారు. మేం సంపద సృష్టిస్తాం, అప్పులు చేయమని అధికారంలోకి వచ్చిన మీరు మూడు వారాల్లోనే రూ. 7000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు అప్పులు తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు, మరి సంపద సృష్టించడం అంటే ఇదేనా..? సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంపద సృష్టిస్తామన్న మాట మీద నిలబడండి, మీ హామీల అమలుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అమలుచేయాలని వైయస్ఆర్ సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రేపు ఇచ్చే పెన్షన్లు వలంటీర్లతో కాకుండా సచివాలయ ఉద్యోగులతో ఇస్తున్నారు కదా.. ఇది రేపు ఒక్క రోజుకేనా లేక పూర్తిగా ఇదే పద్దతి కొనసాగిస్తారా..? మరి వలంటీర్లకు రూ. 10,000 గౌరవ వేతనం ఇస్తామన్నారు కదా, మరి వారిని ఏం చేస్తారు..? అమ్మ ఒడి పథకం పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఇస్తామన్నారు కదా.. మరి స్కూల్స్ ప్రారంభమయ్యాయి, మరి ఎప్పుడు ఇస్తున్నారు..? కేంద్రం నుంచి రైతులకు రైతు భరోసా సాయం అందింది, మరి మీరిచ్చిన మాట ప్రకారం రైతులకు సాయం ఎప్పుడు చేస్తారు తేదీ ప్రకటించండి. మీరు వైయస్ఆర్సీపీ కార్యాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, ఆస్తుల విధ్వంసం ఎంతవరకు సమంజసం, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా పాలన చేయాలి కానీ, ఇలా దాడులు చేయడం సరికాదు. ఇలాంటి అరాచకాలకు పుల్స్టాప్ పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై మీరు దృష్టిసారించాలని కోరుతున్నాం` అని రవిచంద్రారెడ్డి అన్నారు.