అమరావతి: రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ-వీఎంఆర్ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 లోక్సభ స్థానాలకుగాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23 సీట్లలో విజయకేతనం ఎగరవేస్తుందని, టీడీపీ కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని సర్వే తేల్చింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని తెలిపింది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా కనిపించింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల మధ్య ఓట్ల వత్యాసం కూడా భారీగానే ఉంటుందని సర్వే పేర్కొంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.5 శాతం ఓట్లు, టీడీపీకి 36 శాతం ఓట్లు పడతాయని వెల్లడించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. అప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది.