తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

నేడు వైయ‌స్ఆర్ 75వ జ‌యంతి వేడుక‌లు
 

వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి.. వైయ‌స్ఆర్‌ .. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ భరోసా. అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తూ.. రూ.1,100 కోట్ల సేద్యపు విద్యుత్‌ బకాయిలను రద్దు చేస్తూ ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేసిన పాలకుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి.. వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. 

రూ.లక్ష కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి.. ఐదేళ్లలోలోనే 41 ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత. పారదర్శక పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి.. ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించి.. 3 పోర్టు­­లు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చిన ప్రగతిశీలి. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పిన ఆర్థికవేత్త. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత.. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.  

సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు వైయ‌స్ఆర్‌
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలలే. ఆ కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చని చేతల్లో చూపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పొదుపు సంఘాల మహిళలకు పావలా వడ్డీ రుణాలు, అర్హులందరికీ ఇ­ళ్లు వంటి విప్లవాత్మక పథకాలు..  సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి వైపు ఎలా పరుగెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. 

మహా­నేత మరణించి 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైయ‌స్ఆర్‌ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరున­వ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పి­లిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆయన చిరస్మరణీయు­డు. వైయ‌స్ఆర్‌ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైయ‌స్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్‌ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబర్‌ 2న హెలికాఫ్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు.    

జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు జీవం 
అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్‌ పార్టీ జీవచ్ఛవంలా మారింది. ఆ దశలో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్‌ 9న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్‌ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. మండుటెండలో 1,475 కిలోమీటర్ల వైయ‌స్ఆర్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోను, అటు కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. 

సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, జలయజ్ఞం ప్రాజెక్టులతో, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చి ప్రజారంజక పాలన అంటే ఏమిటో దేశానికి చూపించారు. పాదయాత్రలో ఇచి్చన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమా­ణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి పునాది వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలను మాఫీ చేశారు. 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ ఆ తర్వాతి ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌ హామీ అమలుపై వెనక్కు తగ్గలేదు.

 వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తే విద్యుత్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని కల్పించారు. వైయ‌స్ఆర్‌ స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంట ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీని అందించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే అందుకు తార్కాణం.

ప్రజారోగ్యం, విద్యకు పెద్దపీట
⇒ 2004 మే 14 నుంచి 2007 జూన్‌ 26 వరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను విడుదల చేశారు. ఆ సమయంలో పేదలు పడిన వేదన గమనించారు. జబ్బునపడ్డ పేద కుటుంబాలు ఆ ఆపత్కాలంలో సహాయం కోసం సీఎం కార్యాలయానికి రావాల్సిన ప్రయాసకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచి్చంది. 108, 104 అంబులెన్స్‌ సరీ్వసులను ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ను చేపట్టింది. 

⇒ కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఒకేసారి పోలవరంతోసహా 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డును నెలకొల్పారు.   

⇒ కొన్ని ప్రైవేట్‌ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు పేదల నుంచి రోజువారీ వడ్డీలు వసూలు చేసే సమయంలో.. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకం సంచలనం సృష్టించింది. మన రాష్ట్రంలోనే కాదు.. దేశమంతటా పొదుపు సంఘాల (డ్వాక్రా) వ్యవస్థలో విప్లవం తీసుకొచి్చంది.  

⇒ 2007–08, 2008–09 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం దేశంపైనా పడింది. కానీ.. వైఎస్సార్‌ దాని ముప్పు ప్రభావం రాష్ట్రంపై పడకుండా చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధన ప్రవాహం కొనసాగేలా చేశారు. 2009 ఎన్నికల్లోనూ మరోసారి రాష్ట్రంలో, కేంద్రంలోనూ ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. 

⇒ పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి రూపకల్పన చేశారు. మెడిసిన్, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరికం నిర్మూలన సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. ఉన్నత చదువులను అందరికీ అందుబాటులోకి తేవడం కోసం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీని.. తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ని హైదరాబాద్‌ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉన్నత చదువులు దక్కేలా చేశారు

⇒ పెట్టుబడుల ఆకర్షణలో 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. శ్రీసిటీ సెజ్‌తోసహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడంలో భాగంగా గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిర్మించారు. దాంతో ఎగుమతులు భారీ ఎత్తున పెరి­గాయి. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. తద్వారా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చేశారు.  దాంతో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి.

Back to Top