కక్ష కట్టారు.. కేసులకు భయపడేది లేదు

 జోగి రమేష్‌

విజయవాడ: తనపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారని.. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మాజీ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి పీఎస్‌కు వచ్చిన జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. ప్రతి పశ్నకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.

‘‘ప్రజలంతా సూపర్ సిక్స్ పథకాల అమలు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మాత్రం రెడ్ బుక్ అమలు చేసే పనిలో ఉన్నారు. కేసులకు భయపడేది లేదు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు’’ అని జోగి రమేష్‌ పేర్కొన్నారు.

నేను చంద్రబాబు ఇంటికి వెళ్లింది అందుకే
ఏపీలో కూటమి నేతలకు రాజకీయ విలువలు లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్‌. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పాటిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి జోగి రమేష్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పాటిస్తున్నారు. చంద్రబాబు ఇంటికి ఎందుకు వెళ్లానో విచారణలో చెప్పాను. అయ్యన్న పాత్రుడు.. వైయ‌స్‌ జగన్‌పై చేసిన విమర్శలకు నిరసన చేసేందుకు వెళ్ళాను. అయితే, నాపై దాడి చేసి.. మళ్లీ నా మీదనే కేసు పెట్టారు. అధికారం ఎవరికీ శాశ్వత కాదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. ఏపీలో చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుంది. కక్ష ఉంటే నాపై తీర్చుకోవాలి. నా కొడుకుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు.

కూటమి నేతలకు రాజకీయ విలువలు లేవు. హామీలు అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ అమలు చేస్తే ప్రజలు సంతోషిస్తారు. మంచి పాలన చేయాలని కానీ.. కక్ష సాధించడం సరికాదు. ఇటువంటి ఆనందాన్ని చంద్రబాబు వీడాలి. కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నా కొడుకుని అగ్రిగోల్డ్  భూముల కేసులో ఇరికించారు. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా మేము కొనుగోలు చేయలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సత్య ప్రసాద్  దగ్గరకు నేనే వచ్చి అగ్రిగోల్డ్ గురించి వివరిస్తా.

లోకేష్ రెడ్ బుక్ తీస్తే ఏమి అవుతుంది?. వైయ‌స్ఆర్‌సీపీని అడ్డుకోవాలని చూస్తే సాధ్యం కాదు. మళ్ళీ నన్ను విచారణకు రమ్మని పిలవలేదు. 2002 నుంచి ఒకటే ఫోన్ నెంబర్ వాడుతున్నా. నేను మళ్ళీ విచారణకు రమ్మంటే వస్తాను. వారు అడిగే అన్ని ​ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ఇప్పుడు మీరు పరుష పదజాలం వాడితే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోండి. నాకు పార్టీ సపోర్ట్ ఉంది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధించాలని చూస్తుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Back to Top